Suryaa.co.in

Andhra Pradesh

తిరుమల నిర్వాసితులకు స్థానిక పరిపాలన అందించాం

– ఆ ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే…
– తిరుపతి ఎమ్మెల్యే భూమన
తిరుమల నిర్వాసితులకు స్థానిక పరిపాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుమల బాలజీనగర్ లో శనివారం సాయంత్రం జరిగిన వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమంలో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకోవడం వల్ల తిరుమలలో స్థానిక పరిపాలన ప్రారంభించారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తిరుమలలో తొలి సారి స్థానిక పరిపాలన అందించడం, గొప్ప పరిణామం గా పేర్కొన్నారు. గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి, కార్యదర్శులను నియమించిన కారణంగా, స్థానికులకు అధికారులతో నేరుగా సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయన్నారు. అంతేగాకుండా సంక్షేమ కార్యక్రమాల కోసం, ఎవరి దగ్గరా చేతులు చాచించే దుర్భర పరిస్థితి రాకుండా చేశారన్నారు. సచివాలయాల్లో కార్యదర్శులను నియమించడంతో పెన్షన్ల దగ్గర నుంచి, ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు తిరుమల నిర్వాసితులకు అందరికీ నేరుగా మహిళలకు అందుతున్నాయన్నారు. ఇదంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి వల్లే సాధ్యమైందన్నారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళ కిందట 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రోజుకి కనీసం ఇరవై ఐదు వేల మందిని కలిశారని, అందులో కనీసం పది వేల మంది మహిళలుతో సంభాషించారని, వారి సమస్యలేంటో తెలుసు కున్నారని తెలిపారు. మహిళల సమస్యలను తెలుసుకుని…శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో, ప్రజల దయతో అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల్లో మహిళా సంఘాల రుణాలను నాలుగు విడతల్లో వడ్డీతో సహా చెల్లిస్తామని భగవంతునికి మీద ప్రమాణం చేసి చెప్పారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం కలిపి 13 వేల కోట్ల రూపాయలు మహిళ సంఘాల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్టు తెలిపారు.
తిరుపతిలొనే ఈ సంవత్సరం 33 కోట్లు, గత సంవత్సరం 32.5 కోట్లు జమచేసినట్టు చెప్పారు. తిరుమల వాసులకు 118 మహిళా సంఘాలకు కలిపి 1.32 కోట్ల రూపాయలు గత ఏడాది జమ చేయగా, ఈ ఏడాది కూడా మరో అదే మొత్తంలో జమ చేశారన్నారు. ఇవి కాకుండా నవరత్నాలతో పాటు 17 పథకాల ద్వారా రెండు కోట్ల మంది ప్రజలకు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు లబ్ది చేకూరుస్తున్నట్టు భూమన వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రజా రంజకంగా పరిపాలిస్తున్నారని ప్రశంసించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారాని కొనియాడారు. ప్రజా సేవే దైవ సేవగా నమ్ముతూ, మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్ఛుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రజలంతా అండగా ఉండాలని భూమన పిలుపునిచ్చారు.
 

LEAVE A RESPONSE