వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
సెప్టెంబర్ 24: స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దిరికిపోయినా, తన తండ్రి ఏ తప్పూ చేయకుండానే జైలు పాలయ్యారని ఢిల్లీలో లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆదివారం పలు అంశాలు వెల్లడించారు.
స్కిల్ స్కాంలో రూ.371 కోట్ల కుంభకోణానికి ఆది, అంతం చంద్రబాబు నాయుడేనని స్పష్టమవుతోందని అన్నారు. ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు, 2 చోట్ల అచ్చెన్నాయుడు సంతకాలు చేసి నిధులు విడుదలకు అధికారులపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఈ వివరాలతో కూడిన కాపీని సీఐడీ అధికారులు ముద్దాయికి కూడా ఇచ్చారని అన్నారు.
40 ఏళ్లుగా ప్రజాధనం లూటీ చేస్తున్న చంద్రబాబు
చంద్రబాబు 40 ఏళ్లుగా ప్రజాధనం లూటీ చేస్తూనే ఉన్నాడని ఆయనకు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్నవారికి, కొవ్వొత్తుల ప్రదర్శకులకు ఆయన సంపాదన రహస్యం ఏమిటో తెలియదా అని ప్రశ్నించారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.371 కోట్ల స్కిల్ స్కాంకు పాల్పడ్డాడని, తవ్వేకొద్దీ “ఆస్తి”కలెన్నో బయటపడుతున్నాయని అన్నారు.
వందే భారత్ ట్రైన్ టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి తేవాలి
విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్ ట్రైన్ ప్రారంభం కానుండడం సంతోషం కల్గించే విషయమని అలాగే విశాఖ-తిరుపతి నగరాల మధ్య వందేభారత్ ట్రైన్ సేవలు త్వరిత గతిన ప్రారంభించాలని రైల్వే మంత్రిని కోరుతున్నానని విజయసాయి రెడ్డి అన్నారు. వందేభారత్ ట్రైన్ టికెట్ ధరలు మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నాయన్న ప్రయాణీకులు భావిస్తున్నారని, టికెట్ ధరలు తగ్గించడం ద్వారా ఎక్కువ మంది ప్రయాణీకులు ప్రయాణించే అవకాశం ఉంటుందని అన్నారు. రైల్వే మంత్రి అంశాన్ని సీరియస్ గా పరిగణించి టికెట్ ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలని విజయసాయి రెడ్డి కోరారు.