Suryaa.co.in

Andhra Pradesh

ఓటమి భయంతోనే సజ్జల అవాకులు చెవాకులు

-సీఎం క్యాంపు కార్యాలయానికి కంటెయినర్ ఎందుకు వెళ్లిందో ఈసీ విచారణ జరపాలి
-చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పధకాలు రద్దు చేస్తారన్న వైసీపీ మాయ మాటలు ప్రజలు నమ్మెద్దు
-రాష్ట్రాభివృద్ది, పేదల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం
– ఎం.ఏ షరీఫ్

ఎన్నికల ముందే వైసీపీకి ఓటమి ఖాయమైంది, అందుకే ఓటమి భయంతో ప్రస్టేషన్ లో సజ్జల రామకృష్ణారెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని మండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీఫ్ అన్నారు. గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….

చంద్రబాబు ప్రజాగళం సభలకు వస్తున్న జన స్పందన చూసి వైసీపీ నేతలు వణికిపోతూ పైకి మాత్రం చంద్రబాబు సభలకు జనం రావటం లేదని అంటున్నారు. సిద్దం సభలకు మందు, బిర్యానీ డబ్బులిచ్చినా వైసీపీ కార్యకర్తలు కూడా రావటం లేదు, చంద్రబాబు సభలకు ప్రజలు స్వచ్చందంగా హాజరవుతున్నారు. అందుకే వైసీపీ నేతల్లో అసహనం పెరిగిపోయింది. ఐదేళ్లపాటు దోచిన సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లలో తరలించి వైసీపీ అభ్యర్దులకు చేరవేస్తున్నారని మీడియాల్లో కధనాలు వస్తున్నాయి. కానీ పైకి మాత్రం అది జగన్ సిద్దం సభలకు పాంట్రీ కంటెయినర్ అని అబద్దాలు చెబుతున్నారు. సజ్జల చెబుతున్నట్టు పాంట్రీతో కూడిన కిచెన్ కంటెయినర్ అయితే అంత రహస్యంగా సీఎం క్యాంపు ఆఫీసులోకి వెళ్లాల్సిన అవసరం ఏంటి? మొన్న AP16Z0363 నెంతో ఉన్న కంటెయినర్ తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసుకుకి వెళ్లింది.

సాధారణంగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే వాహనాలను ప్రధాన దారిలో ఉన్న మెయిన్ గేట్ వద్ద తనిఖీ చేసి వాహనం, అందులో ఉన్న వారి వివరాలు నమోదు చేస్తారు. లోపలికి వెళ్లాక అక్కడ మరో చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది ఈ వివరాలు సరిచూసుకుని వాహనాన్ని స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు. కానీ మెయిన్ గేట్ వద్ద ఈ కంటెయినర్ కి సంబందించిన ఎలాంటి వివరాలు నమోదు చేయలేదు. రెండో చెక్ పోస్టు ముందు వైపు స్కానర్ మీదుగా వెళ్లకుండా చెక్ పోస్ట్ వెనుక వైపు నుంచి ఈ కంటెయినర్ ని క్యాంపు కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటెయినర్ బాగాన్ని సుమారు గంటసేపు లోపలివైపు తిప్పి ఉంచారు. సీఎం ఇంటిలోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన ఈ కంటైనర్ తనిఖీ ఎందుకు చేయలేదు? పాంట్రీ కంటెయినర్ అయితే అంత రహస్యంగా లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? అందులో గంటసేపు ఏమి లోడింగ్ చేశారో చెప్పాలి. దీనిపై ఈసీ విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలి.

చంద్రబాబు గెలిస్తే సంక్షేమ పధకాలు ఆగిపోతాయని జగన్, సజ్జల, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అమలు చేసిన సంక్షేమ పధకాలు రద్దు చేసింది వైసీపీ కాదా? అన్న క్యాంటీన్ లు మూసివేసి పేదల కడుపు కొట్టింది ఎవరు? 26 దళిత సంక్షేమ పధకాలు రద్దు చేసి దళితులను వంచనకు గురి చేసింది ఎవరు? విదీశీ విద్య, పెళ్లికానుక రంజాన్ తోపా, క్రిస్మస్, సంక్రాంతి కానుక వంటి 130 కి పైగా సంక్షేమ పధకాలు రద్దు చేసి బడుగు,బలహీన వర్గాలకు ద్రోహం చేసింది వైసీపీ కాదా? ప్రజలందరికి తెలియజేస్తున్నాం…చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే రెట్టింపు సంక్షేమ పధకాలు అమలు చేస్తాం.

వైసీపీ మాయ మాటలు నమ్మొద్దు. సంక్షేమ పధకాలతో పాటు అభివృద్ది చేసి సంపద సృష్టించి పేదలను పైకి తీసుకొస్తాం. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా రాష్ట్రాన్ని నడిపించే సత్తా చంద్రబాబు నాయుడుకే ఉంది. రూ. 12 లక్షల కోట్ల అప్పల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. ఉద్యోగులకు సకాలానికి జీతాలు చెల్లించలేని స్ధితిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు పెట్టబడులు వచ్చియువతకు ఉపాధి లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. వైసీపీ పని అయిపోయింది, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని షరీఫ్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE