Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరి ప్రీమియర్ లీగ్-2 విజేత వల్లభనేని వెంకట్రావు యూత్

– ఫైనల్ మ్యాచ్‌ను తిలకించి స్వయంగా బహుమతులు అందజేసిన నారా లోకేష్
– ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ-జనసేన నాయకులు
-ప్రథమ బహుమతి రూ. 2 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. లక్ష, తృతీయ బహుమతి రూ. 50 వేల నగదు ప్రోత్సహకం
-పాల్గొన్న 100 జట్లకు నారా లోకేష్ సహకారంతో క్రికెట్ కిట్లు అందజేసిన టీడీపీ జనసేన నాయకులు
-లీగ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన తెలుగు యువతను, నియోజకవర్గ నాయకులను అభినందించిన నారా లోకేష్

మంగళగిరి టౌన్, జనవరి 28: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ -2 పోటీలలో తాడేపల్లికి చెందిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు విజేతగా నిలిచింది.

ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో డీజే 2023 జట్టు 54 పరుగులతో విజయం సాధించి మూడవ స్థానంలో నిలిచింది. మధ్యాహ్నం వల్లభనేని వెంకట్రావు యూత్ వర్సెస్ అన్‌స్టాపబుల్ మధ్య ఉత్కంఠ బరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు గెలుపొందింది. నియోజకవర్గ నాయకులు ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకోగా, జాతీయ గీతాలాపనతో ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇతర మఖ్య అతిథులతో కలిసి ఉత్కంఠ బరితంగా జరిగిన మ్యాచ్‌ను వీక్షించి అనంతరం బహుమతులు అందజేశారు. వందలాది మంది క్రీడాకారులు, అభిమానులతో నారా లోకేష్ ఫోటోలు దిగారు. నియోజకవర్గ స్థాయిలో 20 రోజులపాటు జరిగిన ఈ పోటీలకు విశాలమైన మైదానంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.

ఈ పోటీలలో 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్ 15 ఓవర్లకు నిర్వహించగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వల్లభనేని వెంకట్రావు యూత్ 10 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అన్‌స్టాపబుల్ క్రికెటర్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఎంపీఎల్ ఫైనల్స్ సందర్భంగా నారా లోకేష్ క్రీడా ప్రాంగణం ఆదివారం సందడిగా మారింది.

పోటీలను తిలకించేందుకు యువత, క్రీడాభిమానులు, మహిళలు, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎంపీఎల్ విజేతగా నిలిచిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టుకు నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి మరియు మాలపాటి పుల్లయ్య చౌదరి సహకారంతో రూ.2 లక్షలు ప్రైజ్ మనీ అందించారు.

ద్వితీయ స్థానంలో నిలిచిన అన్‌స్టాపబుల్ క్రికెటర్స్ జట్టుకు సీనియర్ నాయకులు ఇట్టా పెంచలయ్య సహకారంతో రూ.లక్ష, తృతీయ స్థానంలో నిలిచిన డీజే 2023 జట్టుకు యర్రబాలెం టీడీపీ గ్రామ కమిటీ సహకారంతో రూ.50 వేల నగదు బహుమతులు అందించారు.

అన్ని మ్యాచ్‌లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన క్రీడాకారులకు తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్ చంద్ సహకారంతో రూ.రెండు వేల నగదు బహుమతి, ట్రోఫీ, క్రీడాకారులందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మరియు బెస్ట్ బ్యాట్స్ మెన్ గా నిలిచిన మూకా సురేష్‌కు రూ 15 వేలు, బెస్ట్ బౌలర్ గా నిలిచిన ఫణింద్రకు రూ 5వేల నగదు బహుమతిని జవ్వాది కిరణ్ చంద్ ఆర్థిక సహకారంతో అందించారు.

టోర్నీలో పాల్గొన్న 100 జట్లకు నారా లోకేశ్ సహకారంతో క్రికెట్ కిట్లు, ప్రతి జట్టుకు కాసరనేని కిషోర్ కుమార్, జాలాది రఘురాం సహకారంతో హెల్మెట్‌లను, పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి టీషర్స్‌ను టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ సహకారంతో స్థానిక టీడీపీ జనసేన నాయకులు అందజేశారు. సిక్స్ కొట్టిన ప్రతి క్రీడాకారుడికి నియోజకవర్గ తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి తిరువీధుల సతీష్ సహకారంతో రూ వెయ్యి, బుల్లా మహేష్ సహకారంతో రూ 500 నగదు బహుమతి అందజేశారు.

పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన పలువురు క్రీడాకారులు ట్రోఫీలు, సర్టిఫికెట్లు బహూకరించారు. ఎంపీఎల్లో ఎంపైర్లుగా సేవలందించిన వారిని, 20 రోజుల పాటు నిరంతరాయంగా క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన నియోజకవర్గ తెలుగుయువతను, నియోజకవర్గ నాయకులను నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో రూ 2 లక్షలు, రూ లక్ష, రూ 50 వేల ఫ్రైజ్‌మనీతో అద్భుతంగా క్రికెట్ పోటీలను నిర్వంచడం అభినందనీయం అన్నారు. నారా లోకేష్ నియోజకవర్గంలోని క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం వాలీబాల్ కిట్స్, క్రికెట్ కిట్స్ అందించడంతో పాటు విశాలవంతమైన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి క్రీడాకారులను ఆకట్టుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో నారా లోకేష్‌ను గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, పోలిట్‌బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పి గన్నవరం నియోజకవర్గ టూమెన్ కమిటీ కన్వీనర్ గంటి హరీష్ మధూర్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ నాయకులు యం.ఎస్ బేగ్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీ పోతినేని శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE