బాదుడే బాదుడంటూ…ఆనాడు చంద్రబాబు ఛార్జీలు పెంచలేదా? : మంత్రి ఆర్కే రోజా

తిరుపతి : టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బాదుడే బాదుడు..అంటూ వ్యాట్, విద్యుత్ ఛార్జీలను ఆనాడు చంద్రబాబు పెంచలేదా అని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు చూస్తే, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. డిస్కంలకు చంద్రబాబు హయాంలో 28వేల కోట్లు బకాయిలు పెట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలు పెంచారని అన్నారు. కరోనా కష్ట కాలంలో సంక్షేమ పథకాలను అందించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా, వైద్యం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారని మంత్రి తెలిపారు.

రూ.1800 కోట్లు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి చంద్రబాబు వెళ్ళిపోయారన్నారు. వాటిని సీఎం జగన్ చెల్లించమే కాకుండా, ప్రతి మూడు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లిస్తున్నారని చెప్పారు. గతంలో నారకాసుర ఆంధ్రప్రదేశ్‌గా అనిపించింది కాబట్టే చంద్రబాబు దించి జగన్మోహన్ రెడ్డిని అధికారం కట్టబెట్టారని మంత్రి తెలిపారు. మహిళలపై దాడులు నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌లో మూడు శాతం తగ్గిందని వెల్లడించారు. కొంత మంది ఉన్మాదుల వల్ల జరిగే ఘటనలకు కఠిన శిక్ష విధిస్తున్నారని తెలిపారు. మహిళా రక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఈనెల 5న సీఎం జగన్ తొలిసారిగా జిల్లా పర్యటనకు రావడం సంతోషంగా ఉందని మంత్రి రోజా అన్నారు.

Leave a Reply