Suryaa.co.in

Telangana

ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ కుట్ర

– మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌ : కెసీఆర్‌ను, కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… మద్యం పాలసీ కేసులో అసెంబ్లీ ఎన్నికల ముందు సాక్షిగా ఉన్న కవితను పార్లమెంటు ఎన్నికలకు ముందు నిందితురాలిగా మార్చడం రాజకీయ కుట్రలో భాగమే. ఈ కేసులో కవిత బాధితురాలు మాత్రమే. నిందితురాలు కాదు. ఢల్లీలో సిసోడియాను తమకు లొంగితే సీఎం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సిసోడియానే స్వయంగా చెప్పారు.

పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ లబ్ది పొందేందుకే బీజేపీ కవితను ఈడీ ద్వారా అరెస్టు చేయించింది. కాంగ్రెస్‌, బీజేపీలు ఒక్కటై బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రధాని మోదీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. మోదీ కార్పొరేట్‌ సంస్థలకు ఏజెంట్‌గా పని చేస్తున్నారు. కేసీఆర్‌ను లొంగదీసుకోవడానికి ఆడబిడ్డ అని కూడా చూడకుండా కవితను మోడీ అరెస్టు చేయించారు. భ్రష్టాచార్‌ హటావో అంటూ దేశాన్ని మోడీ భ్రష్టు పట్టించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై మోడీ దర్యాప్తు సంస్థలతో వేధిస్తున్నారు. కవిత నిర్దోషిగా ఈ కేసు నుంచి బయట పడతారు.

LEAVE A RESPONSE