లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ప్రధాని నరేంద్ర మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ కంటే ముందు ప్రధాని మోదీ గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆయన గంగా హారతి నిర్వహించారు.
ప్రధాని మోదీతో పూజారి రామణ్ పూజలు చేయించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మూడవ సారి మోదీ ప్రధాని కావాలని, దేశ ప్రఖ్యాతలు ప్రపంచ వ్యాప్తంగా వెలిగి పోవాలని కోరుకున్నట్లు పూజారి రామణ్ వెల్లడించారు.అన్ని దశల ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఘన విజయం లభించాలని ఆశీర్వదించినట్లు మరో పూజారి సంతోష్ నారయన్ తెలిపారు.
దశాశ్వమేథ ఘాట్లో పూజలు నిర్వహించిన తర్వాత, మోదీ ప్రత్యేక క్రూయిజ్ బోట్లో విహరించారు. సోమవారం రాత్రి ప్రధాని మోదీ, కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నారు.
కాశీతో నాకు విడదీయరాని బంధం
ఈ రోజు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో కాశీతో ఉన్న అనుబంధం గురించి మోదీ ట్విటర్ లో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. తనకు కాశీతో విడదీయరాని. ఎంతో అద్భుతమైన బంధం ఉందని, అది మాటల్లో చెప్పలేనిదని ట్వీట్ చేశారు..