ఇటు మూడుముక్కలాట.. అటు మూడు “ముక్కు”లాట!

2024 ఎన్నికలు…
ఆంధ్రప్రదేశ్ లో ఇవి ఎలా ఉండబోతున్నాయి..
గత ఎన్నికల్లో విపక్షాలను అసలు దగ్గరకే రానీయకుండా
దిగ్విజయం సాధించిన జగన్ పార్టీ వైసిపి రానున్న ఎన్నికల్లో ఆ ఫీట్ ను రిపీట్ చెయ్యగలుగుతుందా..?

మొన్నటి ఎన్నికలతో
గత వైభవాన్ని కోల్పోయి..ఒకనాడు జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చెయ్యబోతున్నారు..
కొడుకుని పక్కనబెట్టడమే గాక అవసరమైతే కొన్ని మెట్లు దిగి పొత్తులకు సిద్ధపడి అడుగు ముందుకు వేస్తారా?

గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలపై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయినా రాష్ట్రాన్ని..ప్రజలను..వారి సమస్యలను విడిచి పెట్టకుండా ప్రజల్లోనే మసలుతూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏం చేయబోతున్నాడు..?

ఇక బిజెపి..ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీగా గుర్తింపు సంపాదించ లేకపోయిన జాతీయ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ మద్దతు ఎవరికి..??

రానున్న ఎన్నికలకు ముందు సమాధానాలు దొరకాల్సిన కీలక ప్రశ్నలు ఇవే..అయితే ఆ సమాధానాలు వచ్చేలోగా కొన్ని విశ్లేషణలు అనివార్యం..

ముందుగా అధికార పార్టీ గనక వైసిపి పరిస్థితి..
జగమ్మోహన రెడ్డికి గాని..ఆయన స్థాపించిన పార్టీకి గాని 2019 నాటి క్రేజ్ ఇప్పుడు లేదన్నది వాస్తవం.మూడున్నరేళ్లకు పైగా సాగిన పాలన జగన్ సత్తాని..వైసిపి రంగుని ప్రజల ఎదుట తేటతెల్లం చేసింది.
ఈ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని..ధరలు పెరిగిపోయి సామాన్యులు..
మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారినా పట్టించుకునే నాథుడే లేడనే అభిప్రాయం బలంగా ఏర్పడిపోయింది.జగన్ విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకొలేనంత దుర్భర స్థితిలో ఉంది. ప్రాజెక్టులు లేవు..ఉన్నవి పూర్తి కావు..
ఇవన్నీ చాలవన్నట్టు ఏది ఎందుకు చేస్తున్నారో తెలియని అయోమయం..
రాజధానిపై మూడేళ్లుగా కొనసాగుతున్న గందరగోళం..సందట్లో సడేమియాలా కొత్త జిల్లాల ఆవిర్భావం..
ఈ హడావిడిలోనే మంత్రివర్గ పునర్నిర్మాణం..కొత్త కొత్త కార్పొరేషన్లు..అంతా హడావిడి..అసలు తక్కువ..
హంగామా ఎక్కువ..టైపు..!
ఒక పరాకాష్టగా ఉచితాలు..ఇవి పుచ్చుకుంటున్న వారికి సైతం వెగటు పుట్టించేంత దారుణంగా పరిణమించాయి.
ఖజానా గుల్లయి..ధరల రూపంలో ఈ ఉచితాలన్నీ తమ నెత్తిన మోయలేనంత భారంగా పరిణమించాయని ప్రజలకి స్పష్టంగా అవగతమైంది.
విద్యుత్ సంక్షోభం..శాంతి భద్రతల క్షీణత..మహిళలకు కొరవడిన రక్షణ..సరైన ఫలితాలు ఇవ్వని సచివాలయ వ్యవస్థ..
చెత్త పన్ను..మెజారిటీ దన్నుతో పెరిగిపోయిన ఎమ్మేల్యేలు…
ఇతర నాయకుల ఆగడాలు..ఇలాంటి ఎన్నో మైనస్ లతో..పూర్ ట్రాక్ రికార్డుతో అధికార పార్టీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.ఇవన్నీ గాక జగన్ వ్యక్తిగత ఇమేజ్..అది 2019 మాదిరి మెరిసిపోవడం లేదు.
అధికారంలోకి రాక ముందు ఓదార్పు యాత్ర..పాదయాత్ర ఆంటూ జనాల్లో తెగ తిరిగిన వైసిపి అధినేత ముఖ్యమంత్రి
అయిన తర్వాత దర్శనమే కరవు చేశారు.
సచివాలయంలో తన ఛాంబర్ నుంచి
ఓ చిత్రరాజం..
అప్పుడప్పుడు సమావేశం…వీడియో కాన్ఫరెన్స్..తప్పదు సుమా అన్నట్టు ఎప్పుడైనా ప్రత్యక్షంగా కొన్ని కార్యక్రమాల్లో హాజరు..కరోనా..తుఫాను..
ఇలాంటి అత్యవసర సందర్భాల్లో సైతం ముఖ్యమంత్రి జనం మధ్యలో ఉండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు తక్కువ.ఇలాంటి విపరీత ధోరణి వల్ల జనానికి..జగన్ కి
మధ్య దూరం పెరిగిపోయిందన్నది వాస్తవం.
అయితే విజయసాయి రెడ్డి..లేదా సజ్జల..ఈ ఇద్దరే పార్టీలో..ప్రభుత్వంలో..
జనంలో..జగన్ సన్నిధిలో విఐపిలు..ఆ ఇద్దరికీ ప్రజల్లో పలుకుబడి..పరిచయాలు తక్కువ..ఇదీ స్టేటస్…!

ఇక తెలుగుదేశం పార్టీ
2019 ఎన్నికల్లో కోలుకోలేనంత దెబ్బ తింది.
ఆ ఎన్నికల్లో అధికారం కోల్పోవడమే గాక అటు తర్వాత కూడా ప్రజల్లో పట్టు కోల్పోతూ..పార్టీలో ఒకొక్కరు జారిపోతూ ఒక దశలో ఎన్టీఆర్ పార్టీ పని
ఇక శాశ్వతంగా ముగిసిపోయినట్టేనన్న లెవెల్లో టాక్ వచ్చేసింది.
చంద్రబాబుకు వయసు
పైబడిందని..లోకేష్ ను ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది..ఇదీ టిడిపి
ప్రోగ్రెస్ రిపోర్ట్..!

పవన్ కళ్యాణ్ సంగతి..
జనంలో విపరీతమైన క్రేజ్..
ఆకట్టుకునే ప్రసంగాలు..
సమస్యలపై పోరాటాలు..
ఇవన్నీ జనసేన అధినేత ప్లస్ పాయింట్లు..అయితే ఇవి 2019 లోనూ ఉన్నాయి. కాని పవన్ని జనాలు ఆమోదించలేదు.అయినా అదే దూకుడుతో జనసేనాని
2024 ఎన్నికలకు షాట్ రెడీ చేసుకుంటున్నారు.

ఇప్పుడు వర్తమానానికి వస్తే…2024 ఎన్నికల్లో వైసిపి
సింగిల్ గా బరిలోకి దిగుతుందన్నది నిర్వివాదం.
జగన్ పార్టీ పొత్తు కోరుకునేది
బిజెపితో.. మరి కమలనాథులు వైసిపితో
చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు
ఏ దశలోనూ ఎలాంటి సంకేతాలూ లేవు..
అది సాధ్యపడేనా…లేదా అన్నది ఇప్పటికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే…!

ఇదిలాఉండగా మొన్న మంత్రివర్గ పునర్నిర్మాణం..
జిల్లా ఇంఛార్జిల నియామకంతో జగన్ మిషన్ 2024 కి శ్రీకారం చుట్టేసినట్టే ఫీల్ అవుతున్నారు.అయితే ప్రజలు మాత్రం మంత్రివర్గం
విషయంలో జగన్ మడమ
తిప్పినట్టు భావిస్తున్నారు.
ఇకపోతే జగన్ క్రేజ్ కాస్తయినా మిగిలి ఉందేమో గాని ఆయన టీంలో ఇతర ప్రముఖులెవరూ వ్యక్తిగతంగా
ఇమేజ్ సంపాదించుకున్న దాఖలాలు లేవు.జగన్ కూడా అదే ఫీల్లో ఉన్నారు.ఈసారి కూడా తన బొమ్మ పెట్టుకుని గెలవాల్సిన పరిస్ధితేనని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.ఆ నమ్మకం మరీ పెరిగిపోతే మొన్న మంత్రులను మార్చేసినట్టు రేపు కొత్త అభ్యర్థులను తెరపైకి తెచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

చంద్రబాబు ఈసారి తన గుడ్ కంటే జగన్ బ్యాడ్ పైనే ఎక్కువగా ఆధారపడి
ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంది..ఆ నేపథ్యంలోనే ఇన్నాళ్లూ నిమ్మళంగా ఉన్న బాబు ఇప్పుడు కొంచెం జగన్ క్రేజ్ తగ్గుతోంది అనగానే తన స్పీడ్ పెంచారు.ఆయన సభలకు..కార్యక్రమాలకు జనాల హాజరు పెరగడం కొంత మార్పు..

ఇటు పవన్ ఇస్తున్న కొన్ని స్టేట్మెంట్లు టిడిపి.. జనసేన పొత్తుపై కొత్త ఆశలకి తలుపులు తెరిచాయి.మొన్న విశాఖ వైసిపి గర్జన..ఆ సమయంలో పవన్ని ఇబ్బందులకు గురిచేయడం..అదే రోజున జనసేనానిని తెలుగుదేశాధీశుడు కలవడం ..ఇత్యాది పరిణామాలు జనసేన..తెలుగుదేశం పొత్తుపై కొత్త ఆలోచనలకి తావిచ్చాయి..ఎవరు అధికార పీఠంపై కూర్చుంటారు అనే అంశం కంటే వైసిపి వ్యతిరేక ఓట్లు చీలకూడదన్నదే తన కీలక
ప్రాధాన్యత అని నొక్కి వక్కాణిస్తూ ఎవరితోనైనా తాను పొత్తుకు సిద్ధమేనని
పవన్ చెప్పకనే చెప్పారు.కాకపోతే ఇప్పటికే జనసేనతో సన్నిహితంగా ఉన్న బిజెపి రేపు అదే పవన్ చంద్రబాబుకు దగ్గరైతే ఎలా
స్పందిస్తుంది అన్నది 2024 లో అత్యంత కీలకం..అదే జరిగితే గత చేదు అనుభవాన్ని మరచి బిజెపి బాబుతో మరోసారి దొస్తీకి సిద్ధపడినట్టే..అప్పుడు అనేక కోణాల్లో వైసిపి అధినేత కష్టాల్లో పడినట్టు అవుతుంది.

ఇవన్నీ స్థూలంగా
2024 ఎన్నికల్లో జగన్ వర్సెస్ టిడిపి+జనసేన
+బిజెపి..అనే పరిస్థితిని సూచిస్తున్నాయి.
కమ్యూనిష్టులు సరే..ఈ పొత్తులపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటాయి.
సిపిఎం..సీపీఐ బాబుతో..
పవన్ తో చేతులు
కలిపేందుకు సిద్ధపడతారేమో గాని ఆ కూటమిలో కమలం పార్టీ ఉంటే గనక చెయ్యి కలిపే పరిస్థితి ఉండదు.

ఇక కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతానికి ఒక శక్తిగా పరిగణించే పరిస్థితి లేదు.
ఆ పార్టీ పెద్దగా ఓట్లు చీల్చే సీన్ కూడా అనుమానమే.

సో..అన్నీ కుదిరితే…
అంతా బాగుంటే..
అందరూ ఒకటైతే..
2024లో..వైసిపి వర్సెస్ టిడిపి..జనసేన..
ఇంచుమించు పక్కా..
బిజెపి కూడా కలిస్తే ఎంచక్కా..జగన్ కు వ్యతిరేకంగా బలమైన కూటమే చెమ్మచెక్కా..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్

Leave a Reply