-ఆ పార్టీ అధికారిక ఖాతా నుంచే అసభ్యకర పోస్టింగ్స్
-వైయస్సార్సీపీ పార్టీ లీగల్సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి
తాడేపల్లి: ‘వైఫల్యాలు ప్రశ్నించడం నేరం’ అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆ దిశలోనే కేసులు నమోదు చేయడంతో పాటు, అక్రమ అరెస్టులు చేస్తూ, వేధింపుల పర్వం కొనసాగిస్తోందని వైయస్సార్సీపీ లీగల్సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి వెల్లడించారు.
ఈ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తప్పు చేయని వారిని దోషులుగా చిత్రీకరిస్తూ.. తప్పు చేసిన వారిని దొరలుగా.. తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. అధికార పార్టీ చేసే తప్పులను ఒప్పులుగానూ.. ప్రతిపక్షాలు చేసే మంచిని కూడా చెడుగా ఎల్లో మీడియా చిత్రీకరించి ప్రజలను వంచన చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనోహర్రెడ్డి చెప్పారు.
ఈ దుష్ట సాంప్రదాయాన్ని రూపుమాపకపోతే నిజాయితీగా బతికే వారికి సమాజంలో స్థానం ఉండదు. అందుకే నిజాయితీగా ఉండే వారికి సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి, డీజీపీతో పాటు, సమాజంలో ఉన్న మేథావులు, న్యాయవాద సంఘాలు, పార్టీల్లో ఉన్న ఉన్నతమైన వ్యక్తులు, పౌర హక్కులు, మానవ హక్కులు, ప్రజా సంఘాలు అండగా ఉండాలి.
ఇంటూరి రవికిరణ్ పోస్టుల్లో వ్యంగ్యమే తప్ప అశ్లీలత లేదు. ఆయన తన పోస్ట్ల్లో వ్యంగ్యమైన భాష, చిత్రాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. కానీ, అలా ప్రశ్నించినందుకు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 20 కేసులు పెట్టి వేధిస్తున్నారు. తను హృద్రోగి అని తెలిసినా, కాలికి ఆపరేషన్ జరిగి ఉన్నా, వైద్యులు విశ్రాంతి అవసరం అని చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ 99 శాతం ఎలా ఉందని ప్రశ్నిస్తూ ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని ఎలన్ మస్క్ చేసిన పోస్టింగ్కు ముడిపెడుతూ ఇంటూరి చేసిన వ్యంగ్య పోస్టులో ఏం తప్పు ఉందో మేథావులు ఆలోచించాలి. రాజకీయ అక్రమ సంబంధాలు అంటూ చంద్రబాబు పొత్తులపై విమర్శించిన పోస్టు, డైవర్షన్ పాలిటిక్స్పై మరో పోస్టు.. ఇలా ప్రభుత్వాన్ని వ్యంగ్యమైన భాషతో చంద్రబాబు ఫొటోలతోనే ప్రశ్నించడమే రవికిరణ్ చేసిన తప్పా?.
తిరుమల ప్రసాదంపై, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడంపై, కల్తీ మద్యం సరఫరాపై, చంద్ర మండలాన్ని దాటిన చంద్రబాబు దోపిడీ అంటూ విజయవాడ వరద బాధితులకు పరిహారం పంపిణీలో జరిగిన అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?.
నిజానికి టీడీపీ అధికారిక ఎక్స్ అకౌంట్ లో, బుడమేరు బుడ్డోడు, శివుడు, మిస్టర్ యష్, అనే అకౌంట్ల నుంచి టీడీపీ, జనసేన కార్యకర్తలు అత్యంత అసభ్యకరంగా వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్పై, పార్టీ మహిళా నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై పెట్టిన మార్ఫింగ్ పోస్టులు ప్రదర్శించారు. టీడీపీ ఫేక్ ఫ్యాక్టరీ. మోసాలు చేయడంలో తెలుగుదేశం పార్టీని మించిన పార్టీ మరొకటి లేదు.