ఏపీ కాంగ్రెస్ జగన్ కబ్జా

-కాంగ్రెస్ కు వెన్నుపోటు… అధికారంలోకి జగన్ 
-మా భూమి పత్రాలపై నీ బొమ్మలు ఏంటీ?
-నీకు విషయం లేదన్న సంగతి చెప్పడం బాధగానే ఉంది
-ఎంపీ రఘురామకృష్ణం రాజు

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా?, లేకపోతే ఎక్కడ నుంచి అన్ని ఓట్లు వచ్చాయని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. జగన్ తనకు తానుగా ఒక ఎన్టీ రామారావు, ఎంజీఆర్ తో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీ రామారావు తన తండ్రి లక్ష్మయ్య పేరు చెప్పుకుని రాజకీయంగా లబ్ధి పొందలేదని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ రాజకీయ జీవితాన్ని ప్రసాదించిందన్నారు.

ముఖ్యమంత్రిగా అవకాశాన్ని కల్పించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చివరిలో పెట్టుకుని, తన తండ్రి పేరుతో ఎవరో ఏర్పాటు చేసిన పార్టీ జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జగనన్న శాశ్వత భూ నొక్కుడు పథకంలో భాగంగా భూ యజమానులకు అందజేసే పాస్ పుస్తకాలు పై మీ బొమ్మలు వేసుకోకపోతే మంచిదని జగన్మోహన్ రెడ్డికి సూచించారు. సర్వేలలో కూడా అవకతవకలు జరగకుండా చూసుకోవాలన్నారు. భూ యజమానులు లేకుండా సర్వే చేయవద్దన్న ఆయన, భూ యజమాను లేకుండా సర్వే చేసి తన అనుయాయులకు భూములను కట్టబెట్టే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. మాజీ మంత్రి ఎర్నినేని సీతాదేవి కుటుంబానికి చెందిన 30 ఎకరాల భూమి ని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారని గుర్తు చేశారు .

వైయస్సార్ జగనన్న శాశ్వత భూ నొక్కు, భూభక్ష అనే అద్భుత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం 20-21 లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 9 రాష్ట్రాలలోని కొన్ని జిల్లాలలో పైలెట్ ప్రాజెక్టుగా సౌమిత్వ ( సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీస్ ఇన్ విలేజ్ ఏరియాస్ ) పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలోని 6.62 లక్షల గ్రామాలలో కోర్స్ అనే నూతన టెక్నాలజీ ద్వారా మ్యాప్స్ ను రూపొందించి, రాష్ట్రాలకు అందజేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. అయితే, ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు తన ఫోటో ఉండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, సౌమిత్వ పథకాన్ని వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం గా మార్చారన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే చట్టాన్ని గతంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి, రెండుసార్లు కేంద్రానికి నివేదించగా ఇప్పటివరకు ఈ చట్టాన్ని కేంద్రం ఆమోదించలేదని గుర్తు చేశారు. మూడవసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి నివేదించినప్పటికీ, ఇంకా పెండింగ్ లోనే ఉందని తెలిపారు. ఇదే విషయమై తాను కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శిని కలవబోతున్నట్లు తెలిపారు.

ఫోటోల ముద్రణపై ఈసీకి లేఖ రాశా
వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం లో భాగంగా భూ యజమానులకు అందజేసే పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి తాను లేఖ రాసినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం, ఇప్పుడేమీ ఎన్నికలు లేవు కదా అనే ప్రశ్న తో కూడిన సమాధానం ఇచ్చిందన్నారు. ప్రతివారికి భూమి ఉంటుందని, శాశ్వత భూ హక్కు పథకంలో భాగంగా అందజేసే పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించి ఉండడంవల్ల, రానున్న ఎన్నికల్లో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు . ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నట్లు తెలిపారు. దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు, ఇతర ఏ రాష్ట్రాలలోనూ ఈ విధానం అమలులో లేదన్నారు . 1932లో బ్రిటిష్ వారు భూమి సర్వే నిర్వహించినప్పుడు, ఆనాడు భూ యజమానులకు జారీ చేసిన పాసుపుస్తకాలపై తమ ఫోటోలను ముద్రించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సౌమిత్వ పథకంలో భాగంగానే వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తన వంతుగా 70 శాతం నిధులను చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా 30% నిధులను ఖర్చు చేసి పాసు పుస్తకాలను ముద్రిస్తుందని తెలిపారు. పుస్తకాల ముద్రణలో కూడా కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలు కక్కుర్తి పడుతున్నారన్నారు. ఈ విధానం సరికాదని ప్రతిఘటించిన అధికారులను బదిలీ చేశారని తెలిపారు. భూమి తమ దైతే ఫోటో నీదా?, దానికి జగనన్న బహుమానం అంటూ ప్రగల్బాలను పలుకుతారా? అంటూ మండిపడ్డారు. సర్వే రాళ్లపై ఫోటోలు ఎందుకని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఫోటోల పిచ్చి వేలం వెర్రిలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యం కోసం సౌమిత్వ పథకాన్ని ప్రవేశపెడితే, ఇవాళ అధికారంలో ఉండి రేపు దిగిపోయే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పార్టీ రంగులను వేసుకోవడానికి, ఫోటోలను ముద్రించడానికి మాత్రమే శాశ్వత భూహక్కు పథకాన్ని ప్రవేశపెడుతున్నారన్నారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులను వేయవద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు అక్షితలు వేసింద న్నారు. జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా పాసుపుస్తకాలపై ఫోటో ముద్రించడాన్ని వ్యతిరేకిస్తూ వారం రోజుల వ్యవధిలో హైకోర్టును ఆశ్రయించనున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు.

అన్నం తింటున్నారా?… గడ్డి తింటున్నారా??
మూడు రాజధానులలో భాగంగా మార్చి నుంచి విశాఖపట్నంలో కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పేర్కొనడం పట్ల రఘురామకృష్ణం రాజు తీవ్రంగా మండిపడ్డారు. మీరు అన్నం తింటున్నారా?, గడ్డి తింటున్నారా?? అని ప్రశ్నించారు. నోటికొచ్చినట్లు బాధ్యతారహితంగా ఎలా మాట్లాడుతారని నిలదీశారు. మూడు రాజధానుల అంశంపై జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమన్నారో, ప్రస్తుతం ఏమి మాట్లాడారో తెలియజేసే వీడియో క్లిప్పింగ్ ను రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు . పూటకు ఒక మాట మార్చేవాణ్ణి మాయలోడు అంటారా?, మాయల మరాఠీ అంటారా?? ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాజధాని అంటే సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ… అది ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని గతం లో వ్యాఖ్యానించిన జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ వేరువేరు చోట్ల ఏర్పాటుచేసి దాన్ని అభివృద్ధి అని అంటున్నారని అపహస్యం చేశారు. మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి, వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ బిల్లును రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసిందన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు. ఇప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనే సజీవంగా లేదని… అయినా మూడు రాజధానులను ఏర్పాటు చేశానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్క భార్యతో ఉండేవాడు రాముడట… ఇతరుల భార్యను ఎత్తుకెళ్లిన వాడు రావణుడని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం పరిశీలిస్తే, ఎవరి భార్యను ఎవరు ఎత్తుకెళ్లారన్నది తనకైతే అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ పథకాల పేరిట భూ యజమానులకు ఇచ్చే పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటో ముద్రణ, పార్టీ రంగుల ముద్రణపై ప్రధానమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

మీ తండ్రి జైలు శిక్ష అనుభవించింది నిజమా? కాదా?? నీ కుమార్తె సొంత కూతురేనా???… సమాధానం చెప్పు విజయ సాయి
మీ పెద్దనాన్నను నీ తండ్రి హత్య చేసి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించింది నిజమా? కాదా??, అలాగే నీ కూతురు సొంత కుమార్తెనా?దత్తపుత్రికనా?? అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ పెదనాన్న ను నీ తండ్రి హత్య చేసి, జైలు శిక్ష అనుభవించారా? లేదా?? అని తాను గతంలో కూడా ప్రశ్నించానని, అయినా విజయసాయిరెడ్డి సమాధానం చెప్పలేదన్నారు. మరొకసారి తాను అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి తన నోటి విరోచనాలకు మందు వేసుకోవాలని సూచించానని, ఇదే విషయాన్ని ఉపరాష్ట్రపతికి నివేదించానని తెలిపారు. దానికి , విజయసాయిరెడ్డి ట్విట్టర్లో తనపై అవాకులు, చెవాకులు పేలారని మండిపడ్డారు . వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలడం సహజమని, తనకు కొద్దిగా ఎక్కువగా జుట్టు రాలిందన్నారు. దానికి తాను తగిన చర్యలు తీసుకున్నానని తెలిపారు.. తనకు జుట్టు రాలినందుకు విగ్గు పెట్టుకుంటే విజయ సాయి రెడ్డి ప్రశ్నిస్తున్నారని, ఆయనకు విషయం లేదని…పిల్లలు లేరనే విషయం తాను ఎప్పుడూ ప్రస్తావించలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం తన కూతురుగా చెప్పుకుంటున్న అమ్మాయి ఎప్పుడు పుట్టిందో చెప్పాలన్నారు. ఆమె నీ కుమార్తె నా?, దత్త పుత్రిక నా అని ప్రశ్నించారు. విజయ సాయి, ఆయన బాస్, మరో ఇద్దరు మూర్ఖులతో కలిసి తనపై అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 కేసులలో 420 గా అభియోగాలను ఎదుర్కొంటున్న A1, A2 లు తనని ప్రశ్నించడమా? అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన వాచాలతను తగ్గించుకోవాలని సూచించారు.

విద్యావంతుడివి ఒక స్త్రీ ఔన్నత్యాన్ని తక్కువ చేసి మాట్లాడడం తప్పు అని మంచి మాటలు చెప్పినందుకు తనపై ట్విట్టర్లో ఇష్టా రీతిలో వ్యాఖ్యలు చేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు. తన అనర్హత పిటిషన్ గురించి మాట్లాడడం పై రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే ఎన్నో మార్లు సూట్ కేసులను మోశారని, అయినా ఏమి కాలేదన్నారు. అనర్హత అనే పదాన్ని మీ నాయకుడు భాషా దోషం పదిసార్లు
లేకుండా పలికితే వదిలేస్తానని చెప్పానని తెలిపారు. విజయసాయిరెడ్డి తన ఫోన్ పోయిందని చెప్పడం పరిశీలిస్తే, త్వరలోనే ఈడి ఆయనకు నోటీసులు జారీ చేయనున్నట్లు స్పష్టం అవుతుందన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో, శరత్ చంద్రారెడ్డికి ముందస్తుగా సూచనలు పంపించడం… ఇప్పుడు విజయ సాయి తన ఫోను పోయిందని ఫిర్యాదు చేయడం పరిశీలిస్తే, లిక్కర్ కుంభకోణంలో ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోందన్నారు. తాను శ్రీరామచంద్రుడిని అని చెప్పడం లేదని, తాను పెగ్గు వేస్తానని… విగ్గు పెట్టుకుంటానని తెలిపారు. తనపై విజయసాయి ట్విట్టర్ లో ఎలా స్పందించిన తనకు అభ్యంతరం లేదన్న రఘురామకృష్ణంరాజు, తాను అడిగిన రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply