– వైయస్ జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు కూతలు
– అవే నిర్మాణాలకు ప్రభుత్వ భవనాలని నేడు జీవో ఎలా ఇచ్చారు?
– గత ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారానికి క్షమాపణలు చెప్పాలి
– విశాఖలో ఈవెంట్లు… అమరావతిలో పేమెంట్లు
– ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ పై రామ్మోహన్ నాయుడు ప్రగల్భాలు
– ఇప్పుడు కేంద్రమంత్రిగా నోరు మెదపలేని దౌర్భాగ్యం
– విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం: విశాఖ నగరానికి తలమానికంగా గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్పై వైయస్ జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు కూతలు కూసిన కూటమి నేతలు ఈరోజు వాటిని ప్రభుత్వ భవనాలుగా పేర్కొంటూ జీఓ ఎలా జారీ చేశారని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.
విశాఖపట్నం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రిషికొండ రిసార్ట్స్పై చంద్రబాబు, పవన్, లోకేష్లు ఎలాంటి దుష్ప్రచారం చేశారో మరిచిపోయారా అని నిలదీశారు. ప్రభుత్వ పరంగా నిర్మించిన ఈ నిర్మాణాలపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన నేతలు. ఇప్పుడు వాటిని ప్రభుత్వ భవనాలే అంటూ సమర్థించుకుంటున్నారని, గతంలో తాము చేసిన విష ప్రచారానికి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నిన్న పవన్ కళ్యాణ్ రుషికొండ రిసార్ట్స్ అంతా తిరిగారు. ఎక్కడో ఒకచోట సీలింగ్ బోర్డు పడిందని హంగామా చేశారు. వారు మీడియాకు ఇచ్చిన ఫోటోలను పరిశీలిస్తే… సీలింగ్ ఆయనకు ఓ ఏడెనిమిది అడుగులు దూరంలో ఉంటే… ఊడిన సీలింగ్ పెచ్చులు మాత్రం ఆయన కాళ్ల దగ్గర కనిపిస్తున్నాయి. అది పడిపోయిందా? లాగి పడేశారా ? స్పష్టంగా ఊడిపోయిన భాగంలో ఎవరో కట్ చేసినట్లు పైన కనిపిస్తోంది. కింద మరో వ్యక్తి దీన్నంతా వీడియో షూట్ చేస్తున్నాడు. అంతా సినిమాటిక్ రికార్డింగ్. ప్రచారం కోసమే ఇది వారు ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పనేనని స్పష్టమవుతుంది.
రూ.5 వేల కోట్లతో అమరావతిలో తాత్కాలిక భవనాలు కట్టారు. అవి ఎలా ఉన్నాయో? వర్షం పడితో, ఎలా పైకప్పు నుంచి నీరు కారి జలమయం అవుతున్నాయో ప్రజలందరూ చూశారు. నిన్న పవన్ కళ్యాణ్ వారి శాసనసభ్యులు రుషికొండ రిసార్ట్స్కు వెళ్లి అబ్బురపడ్డారు. ఆ భవనాలు చూసిన తర్వాత వాటిని ముఖ్యమంత్రి వినియోగించుకోవాలా? ఆయన కుమారుడు వాడుకోవాలా? లేక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాడుకోవాలా అన్నది తెలియని పరిస్థితుల్లో ఆ భవనాల కోసం పోటీ పడుతున్నట్టు వారి వైఖరి కనిపించింది.
కానీ ముందే ఆ భవనం మీద తప్పుడు ప్రచారం చేశాం కాబట్టి వాటిని వినియోగించుకుంటే ఎక్కడ బూమరాంగ్ అవుతుందేమోనన్న భయంతో, రుషికొండ భవనాల వద్దకు వెళ్ళి ఫోటోలు తీసుకుని, యథాప్రకారం గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిన్న సాయంత్రం రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలో తేల్చడానికి ముగ్గురు మంత్రుల ఉపసంఘాన్ని నియమిస్తూ జీవో విడుదల చేసింది. అందులో చాలా స్పష్టంగా రుషికొండలో నిరుపయోగంగా ఉన్న రిసార్ట్స్ను ఎలా వినియోగించుకోవాలో తేల్చడానికి మంత్రివర్గ ఉపసంఘం నియామకం రాని రాశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 1200 మంది రెగ్యులర్ ఉద్యోగులతో వీఆర్ ఎస్ పెట్టించారు. నెలకు 150 మంది పదవీవిరమణ పొందుతుండగా… డిసెంబరులో మరో 1000 మందితో వీఆర్ ఎస్ చేయించే ప్రయత్నం జరుగుతోంది. 32 విభాగాలను స్టీల్ ప్లాంట్ లో ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ పిలిచి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతోంది. అలా ఆసక్తి చూపిన సంస్థలకు నిన్న స్టీల్ ప్లాంట్ లో పోలీసు రక్షణతో ప్లాంట్ అంతా చూపించారు. కార్మికులు ఎవరైనా మాట్లాడితే వారిని ఇబ్బంది పెట్టడంతో పాటు సస్పెండ్ చేస్తున్నారు.
మరి స్టీల్ ప్లాంట్ మీద చంద్రబాబు, షాడో సీఎం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? తిరిగి పవన్ కళ్యాణ్ ఇవాళ సూక్తులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారో చూడండి. ఆ రోజు విశాఖ ఉక్కు మన ఆత్మ అంటూనే… మన ఆత్మను అమ్మితే ఉపేక్షిస్తారా అని అడుగుతూనే అందరం కలిసి కాపాడుకుంటాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఆ రోజు ఉక్కు గురించి గొంతు చించుకుని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ అవకాశం ఉండి ఏం చేస్తున్నారు?
కేంద్రంలో టీడీపీ సహకారంతో ప్రభుత్వం నడుస్తుంటే.. మీరు ప్రయివేటీకరణ చేస్తే మా ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటానని చంద్రబాబు హుకుం జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు చంద్రబాబు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారు.?
మీ ఈవెంట్లకు విశాఖపట్నం, పేమెంట్లకు మాత్రం అమరావతి. విశాఖపట్నం ఏం పాపం చేసింది? విశాఖ పట్నానికి చెందిన సీనియర్ మంత్రి దీనిపై ఏం మాట్లాడడు. పవన్ కళ్యాణ్ ఇక్కడ బహిరంగ సభ పెట్టారు.. కార్మికులకేం సమాధానం చెప్తారు?
గతంలో పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ.. వైయస్సార్సీపీ ప్రతినిధులను చేతకాని వ్యక్తులు, మీరు పార్లమెంటులో ప్లకార్డు పట్టుకోగలరా ? అని అడిగారు. ఇప్పుడు ఎవరు చేతకాని వారు పవన్ కళ్యాణ్ గారు ? మీ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు పార్లమెంటులో ఉన్నారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మీ భాగస్వామ్య పార్టీలకు చెందిన వారే కేంద్రంలో ఉన్నారు. ఈ ఏడాదిలో పలు దఫాలు పార్లమెంటు సమావేశాలు జరిగాయి.
ఎప్పుడైనా మీరు, మీ భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటులో ఒక్క ప్లకార్డు అయినా ప్రదర్శించారా ? ఎవరి చేతకాని దద్దమ్మలు ? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రంతో మాట్లాడలేం ? వారు లాజిక్కుతో మాట్లాడతారు సమాధానం చెప్పలేమని చెబుతున్నారు. మరి ఆ రోజు ఎన్నికల అవసరాల కోసం, అధికారం కోసం ప్రజలకు హామీ ఇచ్చారా ? ప్రజలను గమనించమని కోరుతున్నాను.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న కె రామ్మోహన్ నాయుడు ఆ రోజు ఎలా గొంతు చింపుకున్నారో చూస్తే… వాస్తవాలు అర్ధం అవుతాయి. ఆ రోజు అమ్మడానికి వారెవరు, కొనడానికి వీరెవరు అని గొంతు చించుకున్న రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్రమంత్రిగా ఏ ఏసీ రూముల్లో ఉన్నారో సమాధానం చెప్పాలి?
ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అతిపెద్ద పరిశ్రమగా ఉన్న స్టీల్ ప్లాంట్ కు కష్టం వస్తే.. కేంద్రంలో మీరు, రాష్ట్రంలో మీ బాబాయి మంత్రులుగా ఉండి బంట్రోతు ఉద్యోగం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు కష్టం వస్తే ఆ రోజు అరిచినట్లు ఇవాళ ఎందుకు గొంతు రావడం లేదు?