– పేదవాడి ఇల్లు కూల్చివేతకు అంత మంది అధికారులు యుద్దం చేస్తారా?
– అనంతపురం జిల్లాలో ఇల్లు కూల్చివేతను ఖండించిన టిడిపి అధినేత చంద్రబాబు
అమరావతి:- సిఎం జగన్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం రాదని ప్రతి రోజూ నిరూపణ అవుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. దళితుల ఇళ్లను కూడా కూల్చి రాక్షసానందం పొందుతున్నారని మండి పడ్డారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవళ్లిలో హనుమంత రాయుడు అనే దళితుని ఇల్లు కూల్చిన ఘటనను చంద్రబాబు ఖండించారు.
ఒక సామాన్య దళిత వ్యక్తి ఇంటిని కూల్చి కుటుంబాన్ని రోడ్డున పడెయ్యడానికి ఎమ్మెల్యే, ఆర్డివో, పోలీసులు అధికారుల వరకు అంతా కలిసి యుద్దం చెయ్యడం పై విస్మయం వ్యక్తం చేశారు. పేద కుటుంబం ఇల్లు కూల్చడమే లక్ష్యం అన్నట్లు పని చేసిన అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయ కక్షలతో వేధించే విష సంస్కృతిని వైసిపి డిఎన్ఏ లోనే ఉందని చంద్రబాబు అన్నారు. ఇంత మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు ఒక ప్రజా సమస్య పరిష్కారం కోసం పని చేసి ఉంటే బాగుండేదని అన్నారు.
ఇల్లు కూల్చివేతపై ఆవేదనతో హనుమంత రాయుడు, అతని భార్య అనితాలక్ష్మీ దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడంపై ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుందని ప్రశ్నించారు. గళం లేని వారని దళితులను అణగదొక్కే చర్యలను దళిత జాతి క్షమించదని చంద్రబాబు అన్నారు. బాధిత కుటుంబానికి వెంటనే ఇంటిని మంజూరు చెయ్యడంతో పాటు….వారిని వేధనకు గురిచేసినందుకు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.