నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట

-భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు
-మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది
-పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు
-కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం పై బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

“భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట.
రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం.

ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు.

పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు.దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బిజేపి ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బిజేపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి..”

Leave a Reply