– బాబు బ్రాండ్కు ఆయనే అంబాసిడర్
దాదాపు మూడు దశాబ్దాల నుంచి నేను ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలను చాలా దగ్గరనుంచి చూస్తున్నాను. అంటే, ఒక తరం మారిపోయింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఎన్నో రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను, వారి ఉద్ధాన పతనాలను కూడా పరిశీలించాను.
గడచిన ముప్ఫై ఏళ్లలో కానీ, మరో ముప్ఫై ఏళ్లలో కానీ.. చంద్రబాబు లాగా ఇటు రాష్ట్రంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా.. అంటు కేంద్రంలో కింగ్ మేకర్గా ఉండే అవకాశం మరే ఇతర నేతకూ రాకపోవచ్చు. అంతేకాదు, ఇన్నేళ్లుగా జాతీయ రాజకీయాల్లో తన ప్రాభవాన్ని చాటుకుంటూ, మరింత పెంచుకుంటూ వస్తున్న నాయకుడు కూడా చంద్రబాబే.
రాజకీయాల్లో స్వీయ తప్పిదాల వల్లనే చాలా మంది నాయకులు, పార్టీలు కనుమరుగు అవుతుంటాయి. మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకోలేకపోవడమే అసలైన లోపం. కానీ, చంద్రబాబు మాత్రం ప్రతి సందర్భంలోనూ తనను తాను మెరుగుపర్చుకుంటూ వచ్చారు. తప్పులు చేసినా వాటినుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నారు.
ఏ రాజకీయ నాయకుడికైనా తన జీవితకాలంలో ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే, ఒక నగరాన్ని గ్రోత్ ఇంజిన్గా మార్చే అవకాశం రావటమే గొప్ప. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చరిత్ర గతిని మార్చిన నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ, చంద్రబాబుకు మాత్రం ఇలాంటి అవకాశాలు రెండు వచ్చాయి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేశారు.
హైదరాబాద్కు ప్రపంచస్థాయి నగరంగా పునాదులు వేశారు. సైబరాబాద్ను నిర్మించారు. ఈరోజు భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది సైబరాబాద్. అలాగే, ఇప్పుడు అమరావతి నగరాన్ని నిర్మించే బృహత్తర కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు చేపట్టారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటుంటారు. అంటే, ఆ రెండూ చాలా శ్రమతో కూడుకున్నవని.
ఇల్లు కట్టడం అంటే వ్యయప్రయాసలు మాత్రమే కాదు. వనరులను సమీకరించుకోవడం, తగిన ప్లానింగ్తో నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్నట్లుగా ఇంటిని రూపుదిద్దటం వంటి ఎన్నో ప్రయాసలు ఉంటాయి. అలాంటిది చంద్రబాబు ఒక నగరాన్ని నిర్మించడమే కాకుండా మరో నగర నిర్మాణానికి సమాయత్తం అయ్యారు.
అలాగే, పెళ్లి చేసి చూడు అంటే రెండు కుటుంబాలు, వారి బంధువులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం. ఇందులోనూ వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ భావోద్వేగాలను నియంత్రించుకుంటూ జరగాల్సిన పనిమీదే శ్రద్ధ పెట్టుకుంటూ, అందరినీ నడిపించడమే పెద్ద పని. అలాంటిది చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఇద్దరు ప్రధాన మంత్రుల ఎంపికలో కీలకపాత్ర పోషించారు.
ఆ తర్వాత ఎన్డీఏలో కీలక భాగస్వామిగా గతంలోనూ, ఇప్పుడూ భారతదేశ కూటమి ప్రభుత్వాల్లోనూ, రాజకీయాల్లోనూ ప్రభావవంతమైన, అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఉన్నారు. అధికారంలో లేనప్పుడు సైతం ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేయటంలో, ఒకేతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఆయన మాటకు జాతీయస్థాయిలో ఎంత గౌరవం ఉందో, నాయకులు ఆయనను ఎలా గౌరవిస్తారో నేను చాలా సందర్భాల్లో ప్రత్యక్షంగా చూశాను.
భారతదేశ రాజకీయాలపై చంద్రబాబు ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రభావం చూపడానికి ప్రధాన కారణం ఆయన పరిస్థితులకు తగ్గట్లుగా తన వ్యూహాలకు పదునుపెట్టుకోవడమే. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. సంక్షోభాలను, అవకాశాలుగా మార్చుకోగలగటం. ఇన్నేళ్ల కాలంలో చంద్రబాబు ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు.
ఒక్క నరేంద్ర మోడీ విషయంలోనే ఆయన అంచనాలు రెండుసార్లు తప్పాయి. అయినా మోడీని అర్థం చేసుకుని, ఆయనకు అండగా నిలిచారు. చంద్రబాబులో నేను గమనించిన మరో ముఖ్యమైన సానుకూల అంశం.. ఆయన తీసుకునే మెజార్టీ నిర్ణయాలు రాష్ట్ర ఎకానమీని పెంచేవే. ఆర్థికాభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని పరిపాలించడమే ఆయన సక్సెస్కి మూలకారణం. ఎంత దగ్గరివారైనా సరే ఆర్థికాభివృద్ధిని సాధించే సత్తా వారి ప్రణాళికల్లో లేకపోతే చంద్రబాబు వారికి ఎలాంటి మేలూ చేయరు.
ఒకసారి చంద్రబాబుకు అత్యంత దగ్గరి బంధువు ఒకరికి పెట్రోలియం సంబంధిత ప్రాజెక్టుకు ప్రభుత్వ భూములు కావాల్సి వచ్చాయి. అయితే, ఆ ప్రాజెక్టు ఫైల్ను చాలాకాలం పెండింగ్లో ఉంచారు. వయబిలిటీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వ ధరకు భూముల్ని కేటాయించారు. తాజాగా విశాఖపట్నంలో టీసీఎస్కి 99 పైసలకే భూములు కేటాయించడంపై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. కానీ, టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీని ఆయన విశాఖకు తీసుకురావడం ద్వారా అందులో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు, వారి మీద ఆధారపడే లక్షలాది మంది, వీరందరి ద్వారా రాష్ట్రానికి సమకూరే ఆదాయం.. ఇవే చంద్రబాబు 99 పైసల నిర్ణయానికి మూలకారణాలు.
ఆర్థికశాస్త్రం చదువుకున్న విద్యార్థిగా కాకుండా.. ఆర్థిక శాస్త్ర నిపుణుడిగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ప్రపంచ బ్యాంకు ద్వారా నేరుగా రుణం పొందిన తొలి భారతీయ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు సాధించారు. బిల్ గేట్స్ వంటి పారిశ్రామిక వేత్తలు సైతం చంద్రబాబును తమ స్నేహితుడిగా చూస్తున్నారంటే దానికి కారణం ఆయన నాయకత్వ లక్షణాలు, దార్శనికత.
ఒక బ్రాండ్ను క్రియేట్ చేయడం అంటే మాటలు కాదు. కానీ, చంద్రబాబు తనను తానే ఒక బ్రాండ్గా మలచుకున్నారు. ఏ బ్రాండ్కి అయినా దానిని ప్రచారం చేసే ఒక ప్రచారకర్త అవసరం ఉంటుంది. కానీ, బాబు బ్రాండ్కు ఆయనే అంబాసిడర్. అయినా ఏమాత్రం గర్వం లేకపోవడం, ఎంతో క్రమశిక్షణతో ఇప్పటికీ నడుచుకోవడం స్ఫూర్తిదాయకం. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు ఈ వయసులో కూడా దేశంలో అత్యంత ఎక్కువ సమయం పనిచేసే ముఖ్యమంత్రుల్లో ముందువరుసలో ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నా, రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకం కల్పించాలన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనే అవసరం. ఉమ్మడి రాష్ట్రాన్ని, ప్రస్తుత రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసిన, పునాదుల నుంచి అమరావతికి ప్రాణం పోస్తున్న నిర్మాతగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. ఒకపక్క నరేంద్ర మోడీ, మరోపక్క పవన్ కల్యాణ్ అండతో రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడిన చంద్రబాబు నాయకత్వం కనీసం మరొక ఐదేళ్లు, ఆయన మార్గదర్శనం మరెన్నో ఏళ్లు ఈ రాష్ట్రానికి అవసరం.
– పురిఘళ్ల రఘురామ్
బీజేపీ సీనియర్ నాయకులు
(వ్యాసకర్త గతంలో ఢిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్తగా పనిచేశారు)