Suryaa.co.in

Andhra Pradesh

అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం

-జగన్ రెడ్డి సీఎంగా కొనసాగితే ఏపీ మరో నైజీరియాలా మారుతుంది
– యనమల రామకృష్ణుడు

జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. అభివృద్ధి అటకెక్కించారు. వ్యవసాయం నుండి వృత్తులు, వ్యాపారాలు అన్నింటినీ సంక్షోభంలోకి నెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వందలాది వృత్తుల్లోని ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ అంధకారం కావడం తధ్యం. ప్రజలపై భారాలు, నిలిచిపోయిన అభివృద్ధితో నైజీరియా, జింబాంబ్వే కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది.

తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వ అప్పులు అసాధారణంగా పెరిగాయి. మూల ధన వ్యయం మాత్రం దారుణంగా తగ్గిపోయింది. రెవెన్యూ పడిపోయింది. జీ.ఎస్.డి.పి, తలసరి ఆదాయం సింగిల్ డిజిట్ కు దిగజారాయి. ఓపెన్ బారోయింగ్స్ 130% పైగా పెరిగాయి. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ.4 లక్షల కోట్ల వరకు చేశారు. అప్పుల్ని బడ్జెట్ లో చూపించకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ చర్యలను 15వ ఆర్ధిక సంఘం తూర్పారబట్టింది. మూడున్నర సంవత్సరాల్లో రూ.8 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారు. అయినా ప్రజల ఆదాయం పెరగలేదు, అభివృద్ధీ జరగలేదు. ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నుల ఆదాయం ఎటు పోతోందో కూడా లెక్కల్లేవు. ప్రభుత్వం ఎడా పెడా చేస్తున్న అప్పులకు, వచ్చే ఆదాయానికి సంబంధం లేకుండా పోయింది. ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న అప్పుల కారణంగా ప్రస్తుతం సంవత్సరానికి రూ.50వేల కోట్లకు పైగా వడ్డీలే చెల్లించాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఆ మొత్తం రూ.లక్ష కోట్లకు చేరే ప్రమాదమూ ఉంది. లక్ష కోట్లు వడ్డీలే చెల్లిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి.

ఎఫ్.ఆర్.బి.ఎం చట్టం ప్రకారం రాష్ట్ర అప్పులు జి.ఎస్.డి.పిలో 35% మించకూడదు. కానీ, వైసీపీ ప్రభుత్వం 2021 మార్చి నాటికి చేసిన అప్పులు 44.04శాతానికి చేరుకున్నాయి. అప్పులు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయడమంటే రాష్ట్ర ఆర్ధిక స్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పడమే. తీసుకున్న అప్పుల్లో దాదాపు 81 శాతం సొమ్మును కేవలం రెవెన్యూ ఖర్చుల కోసం వినియోగించడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం. మూడున్నరేళ్లలో రాష్ట్ర తలసరి అప్పు రూ.67 వేలకు చేరింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 331 రోజులు అప్పులు చేయాల్సి రావడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు అద్దం పడుతోంది. రిజర్వు బ్యాంకు వద్ద రాష్ట్రం ఉంచాల్సిన కనీస నగదు నిల్వ రూ.1.94 కోట్లు 330 రోజులకు పైగా మెయింటైన్ చేయలేకపోయారు.

గతంలో రాష్ట్రం ఎన్నడూ ఎదుర్కోని స్థాయిలో ద్రవ్యోల్బణం పెరిగింది. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. పండగ పూట కూడా పస్తులుండే పరిస్థితి నెలకొంది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఆర్ధిక అసమానతలు తీవ్రమయ్యాయి. ప్రజల అప్పులు పెరిగాయి, పేదరికం, నిరుద్యోగం పెరిగింది, రాష్ట్రం అతలాకుతలం అవుతోంది.

గతంలో ఉద్యోగ నోటిఫికేషన్లు, పెట్టుబడుల ఆకర్షణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు లోటు లేకుండా ఉండేది. స్వయం ఉపాధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. డ్వాక్రా వ్యవస్థకు రూ.10 లక్షల వరకు రుణాలు అందడంతో సుమారు కోటి మంది మహిళలు స్వయం ఉపాధి సాధించేలా ముందడుగులు వేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలకు రాష్ట్ర వాటా కలిపి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని పేద యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించడం జరిగింది. ప్రస్తుతం కొత్త పరిశ్రమల ఏర్పాటు ప్రశ్నార్ధకమైంది. ఉన్న పరిశ్రమలను కమిషన్ల కోసం బెదిరిస్తుండడంతో.. పెట్టుబడులు ఉపసంహరణలు పెరిగాయి. విశాఖలో ఏర్పాటు కావాల్సిన లులూ, అదానీ డేటా సెంటర్, ప్రకాశం జిల్లా నుండి ఏసియన్ పల్ప్ పేపర్ మిల్, కియా అనుబంధ సంస్థలు సహా ఎన్నో ప్రఖ్యాత కంపెనీలతో దక్కాల్సిన ఉపాధి రాష్ట్ర ప్రజలకు దూరం చేశారు. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగ విప్లవం హామీని గాలికి వదిలేశారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ వంటి సంస్థల విషయంలో మాట తప్పి మడమ తిప్పి.. ప్రజల్ని మోసం చేశారు.

ఆదాయం పెంచుకోవడం, సంపద సృష్టించుకోవడం ద్వారానే భవిష్యత్తుకు భరోసా అనే కనీస సిద్ధాంతాన్ని పక్కన పెట్టి.. అప్పులు పెంచుకుంటూ పోతున్నారు. సంపద సృష్టి గాలికి వదిలేసి.. విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, ఆర్టీసీ స్థలాలు, మార్కెట్లు, ప్రభుత్వ భవనాలు వంటి విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని సొంత వారికి కట్టబెట్టి జేబుల్లో వేసుకుంటున్నారు. ఇటువంటి విధానాలు రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారబోతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి.

LEAVE A RESPONSE