– హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలి
– కేసీఆర్ పదేళ్లలో 1 లక్షా 86 వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు
– అందులో 1 లక్షా 5 వేల కోట్లు కాళేశ్వరం కోసమే
– కృష్ణాలో మన వాటా మనం తీసుకోకపోవడం వల్ల ఆ నీటిని ఆంధ్రా తరలించుకు పోతోంది.
– 299 టీఎంసీలు చాలు అని ఆనాడు హరీష్ సంతకం పెట్టి వచ్చారు
– ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తాం.
– మన్నెవారిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్: 30 టీఎంసీల తరలింపు, 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 1983 లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మంజూరైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు టన్నెల్-1, టన్నెల్-2 పనులను ప్రారంభించారు. రూ. 1968 కోట్లతో టెండర్లు ఇచ్చారు. టన్నెల్ బోర్ మిషన్ తో దేశంలోనే తొలిసారి ఎస్ఎల్బీసీ టన్నెల్ కు ఉపయోగించారు.
2014 వరకు కి.మీ టన్నెల్ పనులు పూర్తయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత పదేళ్లలో పది కి.మీ కూడా కేసీఆర్ పూర్తిచేయలేదు. రాజకీయ దురుద్దేశంతో హరీష్, కేసీఆర్ ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారు. గ్రావిటీ ద్వారా నల్గొండకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రపంచంలో 40 కి.మీ టన్నెల్ ఎక్కడా లేదు. ఇది పూర్తయితే తెలంగాణకు ఆ రికార్డు దక్కుతుంది.
ఆనాడు 2 వేల కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇప్పుడు పెరిగిన అంచనాలతో 4600 కోట్లతో ఈ టన్నెల్ను పూర్తి చేయొచ్చు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడమే కాదు. కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. కేసీఆర్ పదేళ్లలో 1 లక్షా 86 వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. అందులో 1 లక్షా 5 వేల కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేశారు. కృష్ణాలో మన వాటా మనం తీసుకోకపోవడం వల్ల ఆ నీటిని ఆంధ్రా తరలించుకు పోతోంది.
299 టీఎంసీలు చాలు అని ఆనాడు హరీష్ సంతకం పెట్టి వచ్చారు. మన వాటా మనకు దక్కాల్సిందేనని ట్రిబ్యునల్ లో దీనిపై మేం వాదనలు వినిపిస్తూ ఒక కొలిక్కి తీసుకొస్తున్నాం. ఇంత తక్కువ ఖర్చుతో 30 టీఎంసీలు తీసుకు వెళ్లే ప్రాజెక్టు ఎక్కడా లేదు.
మేం అధికారంలోకి వచ్చాక పనులు మొదలు పెట్టాం. దురదృష్టవశాత్తు 8 మంది కార్మికులు చనిపోయారు. మాకు బాధ ఉన్నా ఆ కుటుంబాలను ఆదుకుని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఆర్మీలో ఉన్న పరిచయాలతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.
హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలి. తప్పులు చేసి అప్పులు చేసి దోపిడీ చేశారనే ప్రజలు మిమ్మల్ని పక్కనబెట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఇక్కడి ప్రజలు మమ్మల్ని క్షమించరు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తాం. ముంపునకు గురవుతున్న మర్లపాడు, కేశ్య తండా, నక్కలగండి తండా ప్రజలను ఆదుకుని, డిసెంబర్ 31 లోగా సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది.
ఇప్పుడు కాకపోతే ఈ ప్రాజెక్టును ఇంకెప్పుడూ పూర్తి చేసుకోలేం. ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగొంచుకుని ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోకపోతే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలకు నష్టం కలుగుతుంది.