– కాంగ్రెస్, బిజెపి చేస్తున్న రాజకీయాలే చిల్లర
– NDSA నివేదికను ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ
– తిరస్కరించడం కాంగ్రెస్, బీజేపీలకు చెంపపెట్టు
– అశాస్త్రీయ పద్దతుల్లో NDSA రిపోర్ట్ ఇచ్చిందని బీఆర్ఎస్ చేస్తున్న వాదనే నిజం అయింది
– తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు
– రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి వెంటనే మేడిగడ్డ బారేజ్ కు రిపేర్లు చేయించాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి చీప్ క్వాలిటీది కాదని, తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న రాజకీయాలే చీప్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామా రావు. కనీస పరీక్షలు చేయకుండా, ఎలాంటి శాస్త్రీయ డేటాను సేకరించకుండానే తయారుచేసిన NDSA రిపోర్ట్ ను ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తిరస్కరించడమే ఇందుకు సాక్ష్యమన్నారు.
బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఓ అశాస్త్రీయ నివేదికను ఇచ్చిందన్న నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్-బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీశాయన్నారు.
కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఆ తప్పుల తడక నివేదికతో కాంగ్రెస్, BJP లు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమన్న సంగతి ఎల్ అండ్ టీ తాజా నిర్ణయంతో మరోసారి ప్రజలకు తెలిసిందన్నారు కేటీఆర్. కేవలం ఓ నీచమైన ఊహ ఆధారంగా క్రూరమైన రాజకీయ ఎజెండాతో ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో ఆ రిపోర్ట్ ను తయారుచేశారని ఆరోపించారు. NDSA నివేదికను NDA నివేదిక అని తాము పిలవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.
ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనమన్నారు కేటీఆర్. కేసీఆర్ కు పేరొస్తుందనే రాజకీయ దుగ్ధతోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ తెలిపారు.
క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండా ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కేటీఆర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణం వరకు నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా కట్టిన కాళేశ్వరంపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో.. దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని సూచించారు. లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్-బీజేపీలు చేస్తున్న కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.
ఎవరు ఎన్ని కుట్ర సిద్ధాంతాలను సృష్టించినా.. వాస్తవం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందన్న కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అయితే కేసీఆర్ దార్శనికుడన్నారు.