– పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ ధీటైన జవాబిచ్చింది
* ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యావత్ జాతి మద్దతిస్తుంది
* క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి
* సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టొద్దు
* భారత సైన్యాన్ని కించపరచినా… దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులు పెట్టినా కఠిన చర్యలు
* కాంగ్రెస్ లో కొందరు నాయకులు తమ వైఖరిని మార్చుకుంటే మంచిది
* హైదరాబాద్ మీడియాతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి: ‘భారతదేశ సమగ్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నించి, పహల్గాంలో 26 మంది సామాన్యులను బలిగొన్న ఉగ్రవాదం దాడిని ప్రతి ఒక్కరం చూసాము. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూసింది. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఆపరేషన్ సిందూర్ ఆగకూడదు’ అని ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రతి భారతీయుడి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ కీలక సమయంలో దేశ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి, ఐక్యతను ప్రదర్శించాలన్నారు. దేశంపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరు తీవ్రంగా పరిగణించాలని, భారత సైన్యం చర్యలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తే వారిపై కఠిన చర్యలు తెలియజేసామని.. బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశంలో చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను ప్రతి ఒక్కరూ అందరూ స్వాగతిస్తున్నారు. పాక్ సైనిక కేంద్రాల జోలికి పోకుండా, సాధారణ పౌరులకు ఇబ్బందులు కలుగకుండా ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం ముందుకు సాగడం అభినందనీయం. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలంతా కట్టబడి ఉండాలి. భారతదేశ ఐక్యతను చాటాలి.
ఉగ్ర దాడులకు బదులివ్వాలని ప్రతి ఒక్క భారతీయుడూ కోరుకున్నాడు
ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరుతో మారణహోమం సృష్టించారు. 26 మంది పర్యటకులను దారుణంగా చంపేశారు. ఈ ఘటనతో దేశం మొత్తం శోకంలో మునిగిపోయింది. హిందువా? ముస్లింమా? అని అడిగి పర్యాటకులను చంపిన విధానం దారుణం. కలిమా చదవమని హిందువా, ముస్లిం అని గుర్తించి మరీ చంపారు.
ఇలాంటి ఘాతుకానికి దేశం సరైన రీతిలో బదులివ్వాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నాడు. గత రాత్రి భారత సైన్యం 9 ప్రధాన ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేయడంతో మనం ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించాం. భారత సైన్యం వెళ్లి, ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలపై దాడులు చేసి ధ్వంసం చేయడం ద్వారా ఉగ్రవాదులకు భారత్ ఇచ్చిన జవాబు హర్షణీయం.
* ప్రతిసారి సహనం.. సహనం అంటూనే ఉన్నాం
కశ్మీర్ భారత దేశంలో అంతర్భాగం. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు కాశ్మీరీ పండిట్లను చంపేశారు. అంత్యక్రియలు చేయడానికి శ్మశానానికి తీసుకువెళ్లిన వారిని కూడా చంపేశారు. హిందువుల మీద దాడి అనాదిగా జరుగుతూనే ఉంది. సరైన సమయంలో సరైన చర్య మోదీ తీసుకున్నారు. మన ఆర్మీ చేపడుతున్న చర్యలకు మద్దతు ఇస్తున్నాం. మేమంతా మీతో ఉన్నాం.
ప్రత్యేకించి యుద్ధం సమయంలో పాకిస్తాన్ కి గట్టి పాఠం నేర్పాల్సి ఉంది. గతంలో లుంబినీ పార్క్, గోకుల్ చాట్ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఏ ఘటన జరిగినా, ఎలాంటి ఉపద్రవం ఎదురైనా- సహనం, శాంతి అంటూనే ఇంతవరకు తెచ్చుకున్నాం. ఇప్పుడు గట్టిగా గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానిలో ఆపరేషన్ సిందూర్ తిరిగి వీరత్వాన్ని నింపింది.
* సెలబ్రిటీలు సైతం బాధ్యతగా వ్యవహరించాలి
మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణగదొక్కేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. మిలటరీ బలగాలు యుద్ధం చేస్తున్నప్పుడు, ఎవరూ జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆ తరహా కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా పోస్టులు పెట్టవద్దు.
సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా కుక్కలా మొరగవద్దు. క్లిష్ట సమయంలో మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి. త్రివిధ పోరాట పోరాటాన్ని కించపరచేలా, దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ఎవరు కామెంట్స్ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ కి సూచించాను” అన్నారు.
“దేశాన్ని సెలబ్రెటీలు నడిపించడం లేదు. వారే దేశం మొత్తం గొంతుక కాదు అని గుర్తుంచుకోవాలి. వారు కూడా ఈ తరుణంలో బాధ్యతగా దేశ సమగ్రతలా మాట్లాడాలి. పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోవాలి అనే మాట – పాకిస్థాన్ కి అనుకూలంగా మాట్లాడే కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు అని మాత్రమే చెప్పాను. నేను చేసిన వ్యాఖ్యలకు జవాబుదారీతనంగా ఉంటాను.
క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు మాత్రమే నేను చెప్పాను. వారు తమ వైఖరి మార్చుకుంటే మంచిదే కదా.. ఇది దేశం మొత్తం చేస్తున్న యుద్ధం. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కి మద్దతుగా మాట్లాడడం సరికాదని మాత్రమే చెప్పాను.
* ఘాజీ లాంటి సబ్ మెరైన్లు విశాఖ వరకూ వచ్చావని గుర్తుంచుకోవాలి
ఎవరి పని వారు శ్రద్ధగా, నిబద్ధతతో జాతి ప్రయోజనాల కోసం చేసుకోవాలి. దేశాన్ని ప్రేమించాలి. ఉద్రిక్త పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా అన్ని రాష్ట్రాలకు కేంద్రానికి మద్దతుగా నిలబడుతుంది. ఈ రోజు మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఎవరికి వారు బాధ్యతతో మాట్లాడాలి. సోషల్ మీడియాలో కూడా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఏ ఇష్టానుసారం మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.
కేవలం ఇది సరిహద్దుల్లో జరుగుతున్న వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ కు కూడా 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రమాదం ఎటు వైపు నుంచి అయినా మన మీదకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఘాజీ లాంటి సబ్ మెరైన్లు విశాఖ తీరం వరకు వచ్చాయంటే దాని అర్థం… మనకు ప్రమాదం అన్ని వైపుల నుంచి పొంచి ఉంది. కాబట్టి ప్రజలంతా నిరంతరం అప్రమత్తంగా ఉండటం ప్రధానం. అందులోనూ ఉద్రిక్త వాతావరణం మరింత జాగ్రత్త అవసరం” అన్నారు.