-
ఆరునెలలకే వీఆర్లోకి బల్లికురవ ఎస్ఐ చౌదరి
-
జంట హత్యల కేసుల రాజీకి ఎస్ఐపై ఒత్తిళ్లు
-
నిరాకరించిందుకే వీఆర్కు పంపారంటున్న తమ్ముళ్లు
-
తమ ప్రమేయం లేకుండానే పోస్టింగ్ తెచ్చుకున్నారన్న ఆగ్రహం
-
యువనేత పీఏ ద్వారా పోస్టింగ్ తెచ్చుకున్న చౌదరి
-
నిబంధనలకు విరుద్ధంగా ఆయన స్థానంలో సొంత జిల్లా అధికారికి పోస్టింగ్
-
నిబంధనలు పట్టించుకోని రేంజ్ ఉన్నతాధికారులు
-
చక్రం తిప్పిన అద్దంకి పెద్ద ‘ఆత్మ’
-
ఎమ్మెల్యేల ఆదేశాలు గుడ్డిగా ఫాలో అవుతున్న రేంజ్ కీలక అధికారి
-
గతంలో అమరావతి సీఐనూ వీఆర్కు పంపిన వైనం
-
నెల్లూరు జిల్లా వెంకటగిరి లోనూ అదే దృశ్యం
-
ఇద్దరికీ పోస్టింగులివ్వని రేంజ్ ఉన్నతాధికారి
-
కమ్మ అధికారులకు అచ్చిరాని గుంటూరు రేంజ్
-
కూటమిలో కమ్మ అధికారులకు దక్కని న్యాయం
-
జగన్ జమానాలో డజన్ల సంఖ్యలో వీఆర్కు పంపిన వైసీపీ సర్కారు
-
కూటమి న్యాయం చేసినా ఎమ్మెల్యేల అన్యాయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
పేరుకు ఇది కమ్మ ప్రభుత్వమని రాజకీయ ప్రత్యర్ధుల ప్రచారం. అన్నీ వారికే చేస్తున్నారన్న నిందలు. కానీ నిజానికి వారే బాధితులవుతున్న వైచిత్రి ఇది. వారిని వేధిస్తున్నది కూడా కమ్మ ప్రజాప్రతినిధులే కావడం మరో వైచిత్రి. ప్రధానంగా రాజధాని గుంటూరు జిల్లా రేంజ్.. పాపం కమ్మ పోలీసు అధికారులకు అచ్చి వచ్చినట్లు లేదు. జగన్ జమానాలో డజన్ల సంఖ్యలో ఎస్ఐ, సీఐ, డీఎస్సీలను వీఆర్లోకి పంపితే.. కూటమి ప్రభుత్వంలో వారికి న్యాయం జరిగింది. అయితే ప్రభుత్వం వరకూ వారికి మేలు చేసింది గానీ.. అదే కమ్మ కులానికి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం వారిని వెంటాడి, వీఆర్కు పంపిస్తున్న వైనమిది. బాధపడుతున్న వారూ.. బాధిస్తున్న వారూ ఒకటే సామాజికవర్గానికి చెందిన వారు కావడమే ఇక్కడ విశేషం.
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో బల్లికురవ పోలీసుస్టేషన్ రాజకీయ-శాంతిభద్రల పరంగా కీలకమైనది. గతంలో ఈ స్టేషన్ పరిథిలో వర్గవైషమ్యాలతో హత్యలు, దాడులు జరిగాయి. ప్రత్యర్థి వర్గాలు రెండూ కమ్మ సామాజికవర్గానికి చెందినవి కావడంతో, అక్కడి పోలీసులకు ఎప్పుడూ టెన్షనే.
ఈ నేపథ్యంలో జీవీ చౌదరి అనే యువ ఎస్ఐ ఆ స్టేషన్లో ఆరునెలల క్రితం బాధ్యతలు స్వీకరించారు. సహజంగా సీఐ, ఎస్ఐ, డీఎస్పీ పోస్టింగు కావాలంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేఖ తప్పనిసరి. కానీ ఎస్ఐ చౌదరి ఎవరి ప్రమేయం లేకుండా, ఒక యువనేత వద్ద పనిచేసే పీఏ సహకారంతో.. అక్కడ పోస్టింగ్ తెచ్చుకోవడం అద్దంకి పెద్దలకు, అక్కడ చక్రం తిప్పే ‘అద్దంకి ఆత్మ’కు మింగుడుపడలేదట. దానితో ముక్కుసూటిగా వ్యవహరించే ఎస్ఐ చౌదరికి కష్టాలు మొదలయ్యాయట.
ప్రధానంగా 2017 మే 19న వేమవరంలో కరణం-గొట్టిపాటి వర్గ రాజకీయాల నేపథ్యంలో జరిగిన జంతహత్యలు, రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో అప్పట్లో టీడీపీలోనే ఉన్న కరణం బలరామ్ అనుచరులు ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపై బతికి బయటపడ్డారు. మృతులతోపాటు, బతికిబయటపడ్డ ఆ ఇద్దరూ 1983 నుంచి టీడీపీలో కరణం బలరామ్తోపాటు పనిచేస్తున్నవారే.
ఈ కేసు వచ్చే నెలలో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఆ హత్య కేసులో బతికి బయటపడ్డ ఇద్దరినీ పిలిచి, రాజీ కుదిర్చే రాజకీయ ప్రయత్నాలు విఫలమైన క్రమంలో.. ఎస్ఐ చౌదరికి ఆ బాధ్యతలు అప్పచెప్పి, రాజీ కుదర్చాలన్న ఒత్తిడి వచ్చిందట. వినకపోతే లాఠీకి పనిచెప్పి, స్టేషన్లో ఉంచాలన్న ఆదేశాలు వచ్చాయట.
దానితో ఆ గ్రామానికి వెళ్లి నిజానిజాలు నిర్థారించుకున్న ఎస్ఐ చౌదరి, తాను ఆ కేసులో రాజీ కుదర్చలేనని ‘అద్దంకి ఆత్మ’కు చెప్పారట. పైగా బాధితులు సైతం.. తాము రాజీ అయ్యే సమస్య లేదని ఎస్ఐకు చెప్పినట్లు సమాచారం. దానికితోడు మల్లాయపాలెం, అద్దంకి సరిహద్దుల్లో పెద్దల ఆశీస్సులతో నడుస్తున్న పేకాట- కోడిపందాలను ఎస్ఐ చౌదరి మూసివేయించారట.
దీనితో త మ ఆదాయమార్గాలు మూసుకుపోతున్న నేపథ్యంలో.. బల్లికురవ లోని ‘అద్దంకి పెద్ద’ వర్గీయులు, ఎస్ఐ చౌదరిపై ‘పార్టీ పెద్ద’కు రోజూ ఫిర్యాదులు చేయడం ప్రారంభించారట. అప్పటికే ఆ స్టేషన్లో పోస్టింగ్పై మనసు పడ్డ మరో అధికారి, బల్లికురవలోని ‘అద్దంకి పెద్ద’ వర్గీయులతో రోజూ మంతనాలు ప్రారంభించారట. ఆ క్రమంలో ఎస్బి కానిస్టేబుల్ ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఎస్ఐ చౌదరిని ఈనెల 5న వీఆర్కు పంపుతూ ఆదేశాలొచ్చాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబునాయుడు ఇంటిదగ్గర డ్యూటీ చేస్తున్న ఇదే ఎస్ఐ చౌదరి.. గతంలో కూడా సీఎం జగన్ ఇంటిదగ్గర డ్యూటీ చేయడం విశేషం.
ఎస్ఐ చౌదరి వీఆర్కు వెళ్లిన తర్వాత.. మళ్లీ శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతున్న పరిణామాలు డీఎస్సీ, సీఐకు తలనొప్పిలా మారిందంటున్నారు. అక్కడి డీఎస్పీ వైసీపీ హయాంలో ఐదేళ్లు వీఆర్లో ఉండగా, సీఐ ఇంటలిజన్స్లో సుదీర్ఘకాలం పనిచేశారు. కమ్మవర్గానికి చెందిన ఇద్దరికీ ఉద్యోగపరంగా మంచి ట్రాక్రికార్డు. సాత్వికులనే పేరు ఉంది. కాగా అధికార పార్టీ చెప్పినట్లు పనిచేయడం వరకూ ఫర్వాలేదు గానీ, ఇతరులను హింసించడం వల్ల అది శాంతిభద్రతల సమస్యగా మారి.. చివరకు ప్రభుత్వానికే చెడ్డపేరు తెస్తుందన్న విషయం, ఎమ్మెల్యేలు గ్రహించకపోవడమే విచారకమని పలువురు పోలీసులు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
అలాంటి నిజాయితీగల వారిపై.. ఒక కింద స్థాయి అధికారి, ప్రభల అనుమతికి సంబంధించి ‘అద్దంకి పెద్ద’కు ఫిర్యాదు చేయడం, అదికాస్తా ఎస్పీ దాకా వెళ్లడం డీఎస్పీ, సీఐలకు తలనొప్పిలా మారింది. బల్లికురవలో ఇటీవల జరిగిన తిరునాళ్లలకు.. ప్రభలపై పార్టీ జెండాలు, పార్టీనేతల ఫొటోలు పెట్టకపోతేనే అనుమతి ఇస్తానని డీఎస్పీ స్పష్టంగా చెబితే.. అందుకు విరుద్ధంగా, అవి పెడితేనే అనుమతి ఇస్తానని కింది స్ధాయి పోలీసు అధికారి చెప్పడం, అది కాస్తా మీడియాకెక్కడంతో.. బల్లికురవ మండలంలో మళ్లీ రాజకీయ వైషమ్యాలకు ఆద్యం పోసినట్టయింది.
తాజాగా రామాంజనేయపురం, సోమవరప్పాడు గ్రామాల్లో ఒకే బీసీ సామాజికవర్గం మధ్య, దాడులు జరిగి పలువురు గాయపడ్డారు. అయితే గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా.. పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లి 307 కేసుల నుంచి తప్పించారన్న సమాచారం, జిల్లా ఇంటలిజన్స్ వర్గాలకు చేరినట్లు తెలిసింది.
కాగా అంతకుముందు ఎస్ఐ చౌదరిని వీఆర్కు సాగనంపిన తర్వాత, మరో ఎస్ఐకు పోస్టింగ్ ఇప్పించిన వైనం పోలీసు శాఖలో వివాదంగా మారింది. నిబంధనల ప్రకారం కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్కు మినహా.. ఏఎస్ఐ నుంచి ఎస్పీ వరకూ ఎవరినీ సొంత జిల్లాల్లో నియమించరు. ఆ రేంజ్లో మాత్రమే బదిలీ చేస్తారు. కానీ ‘అద్దంకి పెద్దల’ ఒత్తిళ్లతో.. ఒక సీనియర్ పోలీసు అధికారి ఆ నిబంధనను పట్టించుకోకుండా, అదే జిల్లాకు చెందిన ఎస్ఐకు, అదే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వడంపై జిల్లా పోలీసువర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
కాగా సదరు ఉన్నతాధికారి.. గత 9 నెలల కాలంలో ఎమ్మెల్యేల సిఫార్సులను ఏమాత్రం పరిశీలించకుండా వాటిని గుడ్డిగా పాటించి, ఎమ్మెల్యేలు చెప్పిన పోలీసు అధికారులను, వీఆర్కి పంపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆ ఎస్ఐకు బల్లికురవలో పోస్టింగ్ వేసేందుకు, ఆ ఉన్నతాధికారి తొలుత నిరాకరించినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోస్టింగు ఇచ్చినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిజానికి గుంటూరు రేంజ్ కమ్మ కులానికి చెందిన పోలీసు అధికారులకు అచ్చి వచ్చినట్లులేదు. జగన్ జమానాలో రాష్ట్రంలోని కమ్మ పోలీసు అధికారులకు దాదాపు నాలుగున్నరేళ్లు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్లో ఉంచారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో పీటీసీ, ఎస్సీఎస్టీసెల్, ఆర్టీసీ వంటి లూప్లైన్లలో పోస్టింగులు ఇచ్చారు. ఒక్క గుంటూరు రేంజ్లోనే 26మంది సీఐలు, 18 మంది ఎస్ఐలు, 8 మంది డీఎస్పీలకు 2024 జూలై వరకూ పోస్టింగులు లేని దుయనీయం. వారి విషాదంపై ‘సూర్య’లో కూటమిలోనూ సీఐలకు ‘కమ్మ’టి షాకులు వార్తా కథనం వెలువడిన తర్వాత, అందరికీ పోస్టింగులు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే కూటమి వచ్చిన తర్వాత ప్రభుత్వం వారికి లా అండ్ ఆర్డర్లో పోస్టింగులు ఇచ్చి న్యాయం చేసినప్పటికీ, ఎమ్మెల్యేలే మళ్లీ వారిని మరోసారి అన్యాయం చేస్తుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోస్టింగు వచ్చిన ఐదారు నెలలకే వారిని మార్చి, తాము చెప్పినట్లు వినే అధికారులను తీసుకువస్తున్న ఎమ్మెల్యేల తీరుపె,ై అటు పార్టీ కార్యకర్తల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల సిఫార్సులను రేంజ్ పోలీసు అధికారులు కూడా, ముందూ వెనకా ఆలోచించకుండా నిమిషాల్లో వీఆర్కు పంపిస్తున్న దారుణ పరిస్థితి గుంటూరు రేంజ్లో నెలకొంది.
ఉదాహరణకు.. జగన్ జమానాలో నాలుగున్నరేళ్లు వీఆర్లో ఉన్న మాకినేని శ్రీనివాసరావు అనే కమ్మ సామాజికవర్గ సీఐకి, పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఆయనను ఐదారు నెలల్లోనే వీఆర్కు పంపించి, ఇప్పటివరకూ పోస్టింగు ఇవ్వలేదు. కారణం పెదకూరపాడు ఎమ్మెల్యే ఒత్తిడి! ఎమ్మెల్యే కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం.
ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఎంపి కుటుంబం చెప్పినమాట వినలేదన్న కారణంతో, విజయ్ అనే కమ్మ సామాజికవర్గానికి చెందిన సీఐని హెచ్చరించి మరీ ఆగ మేఘాలపై వీఆర్కు పంపించారు. ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, ఆయనకు తెలియకుండానే, రేంజ్ ఉన్నతాధికారి ఆ సీఐని వీఆర్కు పంపించడం ఆశ్చర్యం.
ఇప్పుడు కమ్మ వర్గానికి చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకర్గంలోని బల్లికురవ ఎస్ఐగా పనిచేస్తున్న చౌదరిని, ముక్కుసూటిగా పనిచేసే ఆయనను కేవలం ఐదు నెలల్లోనే వీఆర్కు పంపించడం, కమ్మ సామాజికవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
వచ్చిన వారిని ఎమ్మెల్యేలు వెనక్కి పంపించడానికి, కమ్మ అధికారుల స్థానంలో ఇతరులను తెచ్చుకోవడానికి కారణాలు లేకపోలేదు. వైసీపీకి చెందిన దళిత, గిరిజన నాయకులపై కేసులేమీ పెట్టకుండా, వారిని పోలీసుస్టేషన్కు తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టమని కోరడం, దానిని ఆ సీఐ-ఎస్ఐలు నిరాకరించి కేసులు పెడతామని చెప్పడం, అందుకు ఒప్పుకోని ఎమ్మెల్యేలు వారి స్థానాల్లో తమ మాట వినే బీసీ-ఎస్సీలను తెచ్చుకోవడం జరుగుతోందని టీడీపీ కమ్మవర్గ నేతలు విశ్లేషిస్తున్నారు.
బల్లికురవలో అందరి మన్ననలు పొందిన చౌదరి అనే యువ ఎస్ఐ పనితీరును, అక్కడి కమ్మ సామాజికవర్గమంతా మెచ్చుకోగా.. తాము చెప్పినమాట వినటం లేదన్న ఏకైక కారణంతో, ఆయనను కేవలం ఐదారునెలల్లోనే వీఆర్కు పంపించడంపై అక్కడి కమ్మ సంఘ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం విశేషం.