Home » “ప్రజాదర్బార్”కు భారీగా తరలివస్తున్న ప్రజలు

“ప్రజాదర్బార్”కు భారీగా తరలివస్తున్న ప్రజలు

సమస్యల పరిష్కారానికి యువనేత భరోసా

అమరావతి: కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు “ప్రజాదర్బార్” కు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరవు పెడుతున్నారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి, ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని మంత్రి వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.

టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేయాలి
దివ్యాంగులకు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులైన తమకు సరైన జీవనాధారం లేదు. తమకు ఎన్టీఆర్ నగర్ లో మంజూరైన టిడ్కో ఇంటికి వడ్డీతో కలుపుకుని రూ.7 లక్షల వరకు రుణం చెల్లించాలని బ్యాంకు వారు ఒత్తిడి చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్లకు తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ సొంతింటి కల నెరవేరేలా టిడ్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని యువనేతను కోరారు. సమస్యను విన్న నారా లోకేష్.. చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

రైతు కూలీ పెన్షన్ పునరుద్ధరించాలి
తన కుమార్తెకు పూర్తిస్థాయి అంగవైకల్యం ఉందని, ఆ విధంగా దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ భానుభి, దివ్యాంగ పెన్షన్ కోసం నులకపేటకు చెందిన ఆంజనేయులు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన డి.పెద్దిరాజు కోరారు. విద్యుత్ బిల్లు నెపంతో తొలగించిన తన దివ్యాంగ పెన్షన్ ను పునరుద్ధరించాలని ఆత్మకూరుకు చెందిన ఆర్.హేమలత విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎమ్.వంశీకృష్ణ కోరారు. దుగ్గిరాల మండలం వీర్లపాలానికి చెందిన తనకు రేషన్ కార్డు మంజూరు చేయాలని ఆళ్ల సత్యనారాయణ రెడ్డి కోరారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్ ను పునరుద్ధరించాలని యర్రబాలెంకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు నీట్ పరీక్ష ద్వారా బీ-కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వచ్చిందిని, ఫీజు రాయితీ కల్పించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా అనంతవరానికి చెందిన సీహెచ్.అనూష విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ అండతో తన ఇంటి దారిని కబ్జా చేసి అక్రమ కేసులు నమోదు చేశారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి నియోజకవర్గం శృంగారపురానికి చెందిన పి.శివకుమార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈవో గ్రేడ్-2 సూపర్ వైజర్స్ పోస్టులకు ఎంపికైన తమకు అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా గత ప్రభుత్వం నిలిపివేసిందని, తమను ఆదుకోవాలని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.

Leave a Reply