Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కసితో ఓటేసిన ప్రజలు

-ట్రైన్లు మిస్ అవుతాయని తెలిసినా ఒక రోజు సెలవు పెట్టుకొని మరి ఓటు హక్కు వినియోగించుకున్న పొరుగుర్ల నుంచి జనం
-పోస్ట్ పోల్ అంచనాలన్నీ కూటమికే అనుకూలం
-150 స్థానాలలో కూటమికి విజయావకాశాలు
-కూటమికి 55 శాతానికి పైగా ఓట్లు పోలయ్యే ఛాన్స్
-నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు

జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కసితోనే ఎంత ఆలస్యమైనా ప్రజలు గంటల తరబడి క్యూ లైన్ లలో నిలబడి ఓట్లు వేశారని నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఎవరి మీద నైనా కక్ష ఉంటే వారిపై ఎక్కువ దృష్టి పెడతామా?, కృతజ్ఞతా భావం ఉన్న వారిపై ఎక్కువ దృష్టి పెడతామా? అన్నది ఒక మనిషిగా ఆలోచిస్తే, ఎవరైన కక్ష ఉన్న వారిపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. కృతజ్ఞతా భావం ఉన్న వారిని కలిసినప్పుడు మాత్రమే ధన్యవాదాలు చెప్పడం జరుగుతుందని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి పై నున్న కక్షతోనే ప్రజలు కసిగా ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలివవచ్చి ఓటు వేశారని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అభిమానం ఉంటే వచ్చి ఓటు వేయరని గుర్తు చేశారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈవీఎంల ద్వారా ఓటు వేయడానికి ఒక్కొక్కరికి 10 సెకండ్ల కంటే ఎక్కువగానే సమయం తీసుకోవడం జరిగిందన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేటాయించిన పోలింగ్ సమయం సరిపోకపోవడంతో, ఓటర్లు అర్ధరాత్రి వరకు క్యూ లైన్ల లో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.

విపరీతమైన ఉక్క పోత ఉన్నప్పటికీ, క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి పై ఎంత కసితో ఉన్నారో అర్థమవుతుందన్నారు . ట్రైన్ మిస్ అవుతుందని తెలిసినా, ఒక రోజు సెలవు పెట్టుకొని మరి ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో క్యూలైన్లలో ఓటర్లు నిలబడ్డారన్నారు.

పోస్ట్ పోల్ అంచనాల ప్రకారం 150 స్థానాల్లో విజయం సాధించనున్న కూటమి
ఫ్రీ పోల్ అంచనాలు ఎక్కువగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికి కొంతమేరకు సానుకూలంగా వెలువడినప్పటికీ, పోస్ట్ పోల్ అంచనాల శాంపిల్స్ పరిశీలిస్తే, 150 స్థానాలలో కూటమి విజయం సాధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కి వచ్చినట్లుగానే ఈసారి కూటమికి బ్రహ్మాండమైన మెజారిటీ లభించే అవకాశం ఉందన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఉడత ఊపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఐ ప్యాక్ సిబ్బంది కూడా వైకాపాకు 60 స్థానాలే వస్తాయని చెప్పారన్నారు. కౌంటింగ్ సజావుగా కొనసాగేలా కూటమి నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఎందుకంటే ఓడిపోబోతున్నామని తెలిసి వైకాపా నేతలు అల్లర్లు చేయాలని చూస్తారన్నారు.

చంద్రబాబు నాయుడు పేరిట జూన్ 9వ తేదీన ముహూర్తం మంచిగా ఉంటే, అదే రోజు ఆయన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు జన్మ నక్షత్రం ఆధారంగా ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడే అమరావతిలో ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తారేమో నాకు తెలియదని ఎద్దేవా చేశారు.

పెరిగిన ఓటింగ్ శాతం
గత ఎన్నికలతో పోలిస్తే, ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 86.3% ఓటింగ్ నమోదయిందని ఆయన పేర్కొన్నారు. ఒక్క ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే కాదని, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం పెరిగిందన్నారు. పెరిగిన ఓటింగ్ శాతం కూటమి అభ్యర్థుల విజయానికి దోహదపడుతుందని చెప్పారు. ఎన్నికలకు ముందు 125 స్థానాలలో కూటమి విజయం సాధిస్తుందని చెప్పడం జరిగిందన్న రఘురామకృష్ణంరాజు, పోలింగ్ అనంతరం కూటమి 160 స్థానాలను గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

ఎవరికి ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు వచ్చాయన్న దానిపై ఒక అధికారి హేతుబద్ధమైన అంచనాను వేశారని తెలిపారు. ఆ అధికారి పేరు చెప్పనని, చెప్పినా ఈ పది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల 33 లక్షల 45 వేల చిల్లర ఓట్లు పోలయ్యాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇందులో పురుషులు కోటి 64 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మహిళలు కోటి 69 లక్షల మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారన్నారు.

ఇందులో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు 60 లక్షల మంది ఉండగా, వారంతా తమకే ఓటు వేశారని వైకాపా నాయకులు భావిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన 60 లక్షల మంది మహిళలలో 50 లక్షల మంది వైకాపా అభ్యర్థులకే ఓటు వేశారని అనుకుందాం… మిగిలిన 10 లక్షల మంది కూటమికి ఓటు వేశారని ఒక అంచనాకు వస్తే, కోటి 69 లక్షల మందిలో 60 లక్షల మందిని మినహాయిస్తే ఇంకా మిగిలిన కోటీ 9 లక్షల మంది మహిళలలో ఎక్కువమంది కూటమికే ఓటు వేశారన్నారు.

కూటమి వైపే మహిళా ఓటర్లు
అధిక శాతం మహిళా ఓటర్లు కూటమి వైపే అధిక శాతం మొగ్గు చూపారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. దానికి హేతుబద్ధమైన కారణం లేకపోలేదని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు వైకాపాకు ఓటు వేసినప్పుడు, లబ్ధి పొందని మహిళలు సహజంగానే వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోటి తొమ్మిది లక్షల మంది మహిళలలో కూటమికి 79 లక్షల మంది మహిళలు ఓటు వేయగా , వైకాపాకు 30 లక్షల మంది వేశారన్నారు.

ఈ లెక్కల ప్రకారం కోటి 69 లక్షల మందిలో వైకాపాకు 80 లక్షల మంది ఓటు వేయగా, కూటమికి 89 లక్షల మంది ఓటు వేసినట్లు స్పష్టమవుతోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇక పురుషుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన వారు 50 లక్షల మంది ఉంటే అందులో 25 లక్షల మంది వైకాపాకు, మరో 25 లక్షల మంది కూటమికి ఓటు వేశారనుకుంటే, ఏ సంక్షేమ పథకం పొందని కోటి 14 లక్షల మందిలో వైకాపాకు 44 లక్షల మంది, కూటమికి 70 లక్షల మంది ఓటు వేసే అవకాశం ఉందని తెలిపారు.

కూటమికి చాలా తక్కువగా ఓట్లు పోల్ అయినట్టు అంచనాలను వేసుకుంటే, వైకాపాకు ఓవరాల్ గా ఒక కోటి 49 లక్షల ఓట్లు పోల్ అయితే , కూటమికి కోటి 84 లక్షల ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ లెక్కన వైకాపాకు, కూటమికి మధ్య 35 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉందని తెలిపారు. గత ఎన్నికల్లో 31 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉంటే జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చినప్పుడు, ఈసారి కూటమికి కూడా 151 స్థానాలకు పైగానే వచ్చే అవకాశం లేకపోలేదన్నారు .

గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్న ఉద్యోగులు
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు రెట్టింపు సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులలో తక్కువలో తక్కువగా నూటికి 80 నుంచి 75 శాతం మంది కూటమికి ఓటు వేశారు. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూటమి వైపే మొగ్గు చూపే అవకాశాలే అధికంగా ఉంటాయి. ఇక పోలింగ్ రోజు నాడే బయట ఊర్ల నుంచి ఓటు వేయడానికి వచ్చిన వారు కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది.

బయట ఊర్లవారిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉండే అవకాశం లేదు. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మూడు నెలలకు ఒకసారి వేలిముద్ర వేస్తే సరిపోతుందని నిబంధనలు ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి నెల వేలిముద్రవేయాల్సిందేనని షరతులు విధించడం జరిగిందన్నారు. దీనితో, బయటి ఊర్ల నుంచి వచ్చిన వారిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉండే అవకాశమే లేకుండా పోయింది. పురుషులలో నూటికి 70 శాతం మంది మద్యం సేవించే అలవాటు ఉన్నవారే ఉంటారు.

వారిలో జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు తప్ప, ప్రభుత్వం సరఫరా చేసిన నాసిరకమైన, నాణ్యత లేని మద్యం కారణంగా అనారోగ్యం పాలై, ఆర్థిక దోపిడీకి గురైన వారంతా వైకాపాకు ఓటు వేసే అవకాశం లేదు. కూటమికి అది ఒక అదనపు పర్సంటేజ్ ఓటు బ్యాంక్. మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కువ
చేస్తానని చెప్పారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

ధోని సిక్సర్ కంటే బలంగా ప్రజల్లోకి వెళ్లిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన సిక్స్ గ్యారెంటీలు
ప్రస్తుతం క్రికెట్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో క్రికెట్ భాషలో చెప్పాలంటే ధోని కొట్టే సిక్సర్ల కంటే బలంగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్ళాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం మహిళల హృదయానికి హత్తుకున్నాయనేది వాస్తవమని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.

వృద్ధులను కూడా జగన్మోహన్ రెడ్డి తమ లబ్ధిదారుల జాబితాలో లెక్క కట్టుకున్నారు. వృద్ధులకు జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత 250 రూపాయలు అదనంగా పింఛన్ ఇస్తానని చెబితే, నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే గత మూడు నెలల పెండింగ్ పింఛన్ మొత్తాన్ని చెల్లించడం కాకుండా, ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఏ తోడు లేని వృద్ధులకు అన్నగా, కుటుంబ పెద్దగా ఆదుకుంటానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీతో వృద్ధులలో కూడా 70 శాతం మంది కూటమి వైపే మొగ్గు చూపారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలు దారుణంగా వంచింపబడ్డారు. అమ్మ ఒడి ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నా ఇద్దరికీ ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రమే అది కూడా రెండు వేల రూపాయల కోత విధించి, ఒక ఏడాది ఎగవేసి ఇచ్చారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరిట ఇద్దరు పిల్లలు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్న అందరికీ ఏడాదికి 15 వేల రూపాయలు ఎటువంటి కోతలు లేకుండా ఆర్థిక సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందన్నారు.

గతంలో జగన్ మాయ మాటలు విని మోసపోయిన జనం
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూర్చారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అయినా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలను విని ప్రజలు మోసపోయారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమికి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలను ప్రజలు విశ్వసించడమే కారణమన్నారు. ఇప్పుడు అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకుంటున్నారని, ఇది కూటమికి అన్ని విధాలుగా కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు.

నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన ప్రణాళికతో సంక్షేమాన్ని చేపడుతూనే అభివృద్ధిని కొనసాగిస్తారన్నారు. అభివృద్ధిలో అందరికంటే ముందే చంద్రబాబు నాయుడు ఉంటారని భారతీయులందరికీ, ప్రత్యేకించి ఆంధ్రులకు తెలుసునని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్లతోను, వీళ్ళతోనూ మాట్లాడి పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారనడంలో ఎవరికి ఎటువంటి సందేహం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించే వారి ఓట్లు కూటమికి అదనంగా ప్లస్ కానున్నాయని తెలిపారు.

బిల్లుల క్లియరెన్స్ కోసమే మళ్లీ అధికారంలోకి వస్తామని డ్రామాలు
జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నానని తెలిసినప్పటికీ, మళ్లీ అధికారంలోకి వస్తామని ఎందుకు చెబుతున్నారని ఆరా తీయగా అసలు విషయం తెలిసిందని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. పెండింగ్ లోని 14 వేల కోట్ల రూపాయల బిల్లుల క్లియరెన్స్ కోసమే మళ్లీ అధికారంలోకి వస్తున్నామని జగన్మోహన్ రెడ్డి బీరాలు పలుకుతున్నారన్నారు.

జగన్మోహన్ రెడ్డి కున్న తెలివితేటల కోణంలోనే ఆలోచిస్తే ఈ విషయం తేటతెల్లమయిందని చెప్పారు. జనవరి నుంచి మొదలుకొని బటన్ నొక్కినా లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఎన్నికల ముందు 25 శాతం చొప్పున కమిషన్
తీసుకొని విడుదల చేయాలని భావించారని, కానీ బిల్లుల విడుదలకు న్యాయస్థానం, ఎన్నికల సంఘం ‘నో’ చెప్పడంతో వారి ప్లాన్ బెడిసి కొట్టిందన్నారు. ఎన్నికల అనంతరం వెంటనే క్లియరెన్స్ ఇవ్వగా ప్రభుత్వం 1200 కోట్ల రూపాయల మాత్రమే విడుదల చేసిందని గుర్తు చేశారు. మరోసారి 1500 కోట్ల రూపాయలు విడుదల చేశారన్న ఆయన, ఇప్పుడు మరో రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని చెప్పారు.

చచ్చిన వాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లు 2000 కోట్ల రూపాయలలో 25% కమిషన్ చొప్పున 250 కోట్ల రూపాయలు నొక్కి వేయడానికి పథక రచన చేశారన్నారు. న్యాయస్థానం, ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన బిల్లులను మాత్రమే అధికారులువిడుదల చేయాలని, అలా కాదని అదనంగా బిల్లులు విడుదల చేస్తే అధికారుల జీతాలలో నుంచి క్రమశిక్షణ చర్య కింద ఆ మొత్తాన్ని రికవరీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మీ జీతాలు తక్కువేనని తెలుసు… అయినా నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ఐఏఎస్ అధికారులు తప్పుడు పనులు చేయవద్దని సూచించారు. పైన వారి మాటలు విని మీ కెరీర్ ను నాశనం చేసుకోవద్దని కోరారు. తక్షణమే రెండు వేల కోట్ల రూపాయల బిల్లుల విడుదలను నిలిపివేయాలన్నారు. ఇప్పటికే హడావుడిగా ఫైల్ క్లియరెన్స్ చేయడానికి అధికారులను చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలన్నారు.

కూటమి అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. గతంలో పదివేల మెజారిటీ వస్తుందనుకున్నచోట ప్రస్తుతం 15 నుంచి 20 వేల మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్న రఘురామకృష్ణంరాజు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.

LEAVE A RESPONSE