‘పీ.కే’ రాజకీయ ప్రత్యక్షం !!

విఫల ప్రయోగం కానున్నదా ?

”రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడమంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదు ” అని టిఆర్ఎస్ నిర్మాత,ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాకాలంగా చెబుతున్న మాట.నిజమే మరి ! రాజకీయపార్టీ పెట్టడానికి ఒక ప్రాతిపదిక తప్పనిసరి.తాత్విక భూమిక అవసరం.ప్రజల నుంచి డిమాండ్ రావాలి.కేసీఆర్ తన అనుభవాన్ని రంగరించి ఈ మాటలు అంటుంటారు.2001 లో ఆయన పార్టీ పెట్టడానికి అవసరమైన ప్రాతిపదిక ‘తెలంగాణ’ ఆకాంక్ష.ప్రత్యేక తెలంగాణ డిమాండును ఇరుసుగా చేసుకొని కేసీఆర్ 21 సంవత్సరాల కిందట రాజకీయ పార్టీని నిర్మించారు.ఇప్పుడా పార్టీ తెలంగాణలో ఎంత శక్తివంతంగా మారిందో,కెసిఆర్ ఎదురులేని మనిషిగా ఎట్లా మారారో కండ్ల ముందు కనబడుతున్నది.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయపార్టీని స్థాపించబోతుండడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.ఇందుకు కారణం ఆయన ట్రాక్ రికార్డు.ఆయనకు ఉన్న నెట్ వర్క్. కనీసం ఐదారుగురు ముఖ్యమంత్రులు,పలువురు రాజకీయ నాయకులతో పీకే మంచి సంబంధాలు ఉన్నవి.అయితే ఈ సంబంధాలు ఆయన రాజకీయపార్టీ పెట్టిన తరువాత ఇపటిలాగే ఉంటాయో లేదో తెలియదు.పీకే కార్యాచరణను బట్టి, ఆయన రూపొందించనున్న ‘ప్రత్యామ్నాయ’ ఫార్ములాను బట్టి సమీకరణాలు ఉంటాయి.’సుపరిపాలన’ అని పీకే అంటున్న మాట కొత్తదీ కాదు.ఆయనే కనిపెట్టినది అంతకన్నా కాదు.ఏ ప్రభుత్వమైనా నిష్కళంక,సుపరిపాలన గురించే చెబుతుంది.అవే తమ ప్రాధామ్యాలుగా ఆయా ప్రభుత్వాలను నడిపే రాజకీయపక్షాలు హామీ ఇస్తుంటాయి.కానీ ఆచరణలో ఏమి జరుగుతున్నదో చూస్తున్నాం.

కాంగ్రెస్‌ పార్టీలో పీకే చేరడం ఖాయమన్న వార్తా కథనాలకు ఇటీవలే తెరపడింది.ఆయన ‘గుంపులో గోవిందయ్య’లా ఉండే రకం కానందున కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు.2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ‘సాధికార కమిటీ ‘లో సభ్యునిగా పీకే ఉండదలచుకోలేదు. కనుక రామ్.. రామ్ చెప్పాడు.కింగ్ మేకర్ గా ఉంటావా? కింగ్ గా ఉంటావా అని పీకేను ప్రశ్నిస్తే తప్పనిసరిగా ‘కింగ్’ గా ఉండడానికే ఇష్టపడతానని

ఆయన ఆనవచ్చు. ”నాకన్నీ తెలుసు.ఇంకా కొత్తగా తెలుసుకోవలసినదేమీ లేదు.నేనేమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది.అదే ఫైనల్” అనే మానసిక స్థితిలో పీకే ఉన్నారు.అందుకే ”పదేండ్లుగా ప్రజానుకూల విధానాల రూపకల్పనలో క్రియాశీల భూమిక నిర్వహించా”నని పీకే చెబుతున్నాడు.జగన్,కేసీఆర్,మమతా బెనర్జీ, స్టాలిన్,అమరీందర్ సింగ్ తదితరుల కోసం ఆయన చేసినవి,చేస్తున్నవి ‘ప్రజానుకూల విధానాల రూపకల్పన’ కిందకు వస్తుందా ?లేక ‘కాంట్రాక్టు వ్యాపారం’ కిందకు వస్తుందా ? అన్నది ప్రజలకు,ఆయా రాజకీయ పార్టీలకు తెలుసు.

ఇంట గెలిచి రచ్చ గెలవడం ముఖ్యం.కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణంలో చాలా దూరం ప్రయాణించినందున ఆయన జాతీయ రాజకీయాల గురించి మాట్లాడడంలో అభ్యంతరం లేదు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని చెప్పినా ప్రజల ఆమోదం ఉంటుంది.అందువల్ల పీకే కూడా ముందుగా తన స్వస్థలం బీహార్ నుంచే ప్రయాణిస్తానని చెప్పుకొచ్చాడు.అయితే బీహార్ లో జనతాదళ్ (యు) ఉపాధ్యక్షునిగా కొంతకాలమే ఎందుకు కొనసాగగలిగారు?ఎందుకు ఆ పార్టీ నుంచి నిష్క్రమించారు? జే.డీ(యు) గెంటివేసిందా ? ఆయనే వెలుపలికి వచ్చేశారా ? అనే అంశాలపై భిన్న కథనాలు ఉన్నవి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు నిష్కళంక,అవినీతి రహిత నాయకునిగా దేశవ్యాప్తంగా మంచి పేరున్నది.నితీశ్ ఒకవేళ ‘సుపరిపాలన’ అందించకపోతే,ఎట్లా అందించాలో ప్రశాంత్ కిశోర్ ఎందుకు సూచనలు ఇవ్వలేకపోయాడు?

జనతాదళ్(యు) తో తెగతెంపుల తర్వాత ఇతర పార్టీల్లో చేరడానికి పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు.కానీ అత్యంత ‘నిస్సహాయ’స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ‘స్వైర విహారం’ చేయాలనుకున్నాడు. సోనియా, రాహుల్, ప్రియాంక సహా ఆ పార్టీ హేమాహేమీలను వెనకెక్కి నెట్టివేసి ‘సూపర్ మ్యాన్’ కావాలనుకున్నాడు. ఆయన ఆశలు నెరవేరలేదు.పదేండ్లుగా రాజకీయాలను ఒక వ్యూహకర్తగా కాచి వడబోసి ఉండవచ్చు.కానీ ఏకంగా కాంగ్రెస్ ‘స్టీరింగ్’ పట్టాలనుకోవడం ఆయన అత్యాశ అనుకుందామా? అతి విశ్వాసం అనుకుందామా? కాంగ్రెస్‌ పార్టీలో చేరిక ప్రయత్నాలలో భాగంగా సోనియా గాంధీ సహా పలువుఋ పార్టీ అగ్రనాయకులు, రాజస్థాన్,ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులతోనూ ఎడతెరిపిలేని సమావేశాలు జరిపారు. 600 కు పైగా స్లైడ్ లతో ప్రజెంటేషన్ లు ఇచ్చాడు.2024 లో కాంగ్రెస్ కు పునర్ వైభవం రావడానికి గాను తన బ్లూ ప్రింట్ పనిచేస్తుందని అన్నాడు. వివిధ రాష్ట్రాలలోని కాంగ్రెస్‌యేతర పార్టీలతో చేసుకున్న ‘ఎన్నికల ఒప్పందాల’ను రద్దు చేసుకోవాలని పీకే కు సోనియా సూచించారని కాంగ్రెస్‌ ముఖ్య నేతలు తెలిపారు. సోనియా గాంధీ షరతు మేరకే పీకే టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌తో రెండు రోజుల పాటు మంతనాలు జరిపారు.ఆ మంతనాల కారణంగానే కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్న ప్రచారం ఉన్నది.ఆ ప్రచారంలో నిజమెంతో తెలియదు.

ఇక ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీ సిద్ధాంతం,విధానాలపై స్పష్టత రావాల్సి ఉన్నది.పీకే పార్టీని ‘అన్ టెస్టడ్ మిస్స్సైల్’ గా అభివర్ణించవచ్చు.ఆ మిస్సైల్ ఎలా పనిచేస్తుందో ప్రయోగించాకే తెలుస్తుంది.ముందస్తుగా జోస్యం చెప్పడం సరైంది కాదు.ఇలాంటి ‘మిస్సయిల్స్’ కుప్పగూలిపోయిన సందర్భాలు,ఘటనలు చరిత్రలో ఉన్నవి.మర్రి చెన్నారెడ్డి వంటి రాజకీయ పండితుడే ‘సొంత కుంపటి ‘పెట్టి మూసేసి మరలా కాంగ్రెస్ లో చేరిపోయారు.అలాగే మేధావులు,ప్రొఫెసర్లు ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించిన సన్నివేశాలు అరుదైనవి.ఆదర్శాలకు మీడియా చర్చలలో,పత్రికా కథనాలలో మాత్రమే చోటున్నది.సమకాలీన భారత రాజకీయాల్లో పనిచేయవు.ఉపయోగపడవు.రాజకీయాలలో సంస్కరణల గురించి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ‘లోక్ సత్తా’ సంస్థ ద్వారా చాలా కసరత్తు చేశారు.ఈ మాజీ ఐఏఎస్ అధికారి ‘లోక్ సత్తా’ ను ఎన్నికల రాజకీయాల రొంపిలోకి దింపిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ‘ప్రధాన స్రవంతి’రాజకీయాల్లో లోక్ సత్తా ఊసులేకుండా పోయింది.

‘మేధావులు,ప్రొఫెసర్ల’ సేవలను రాజకీయాల్లో ఎట్లా వాడుకోవాలో కేసీఆర్ కు బాగా తెలుసు.వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో పనికిరారని కూడా ఆయన ఎప్పుడో నిర్ధారించేశారు.ఆయన నిర్ధారణ తప్పు కాదని పలు ఉదంతాలు రుజువు చేస్తున్నవి.ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన గుర్తింపు,తిరుగులేని ప్రాధాన్యం గురించి కొత్తగా చెప్పవలసినదేమీ లేదు.ఆయన ‘సొంత కుంపటి’ తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేసిన తర్వాత ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రజలు ఓడించడాన్ని ఎట్లా విశ్లేషించాలి? పీకే అయినా కోదండరాం అయినా ,మరొకరైనా రాజకీయ పార్టీని స్థాపించగానే సరిపోదు.ఆ పార్టీకి మొట్టమొదట అడ్డంకి ‘నిధుల’ సమీకరణ సమస్య. తర్వాత ఎన్నికల రాజకీయాల్లో సక్సెస్ కు అవసరమయిన కుట్రలు, కుతంత్రాలు, మాయలు, మోసాలు, జిమ్మిక్కులు చేయాలి.రాజకీయాలలో ఇవేవీ కుదరకపోతే రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది.గౌరవప్రదమైనది.

పీకే ఎన్నికల వ్యూహకర్తగా గొప్ప గుర్తింపు పొందారు.కానీ ‘రాజకీయ పార్టీ’ఏర్పాటు తర్వాత ఆయన కష్టార్జితమైన ‘గుర్తింపు’ కనుమరుగవుతుంది.కుళ్ళు రాజకీయాల జాతరలో ఆయన నిలబడగలుగుతారా ? లేక ఆ జాతరలో అదృశ్యమవుతారా ?తెలియదు.”ఇన్నాళ్లు అర్ధవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశా.ఇప్పుడు ప్రజల సమస్యలను మరింత మెరుగ్గా అర్ధం చేసుకోవడం కోసం ప్రజలకు చేరువ కావలసి ఉన్నది.ఆ క్రమంలోనే సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నా” అని ట్విట్టర్ ద్వారా ప్రశాంత్ కిశోర్ తెలిపారు.రాజకీయ పార్టీలను తన మార్కెటింగ్ నైపుణ్యంతో తన చెప్పు చేతల్లోకి తీసుకోవడం వేరు.తానే రాజకీయపార్టీని స్థాపించి నడపడం వేరు.తన బలమేమిటో,బలగమేమిటో సరిగ్గా అంచనా వేయలేని వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయాల్లో విజయాలను సాధించలేరు.ఓటు బ్యాంకు రాజకీయాలపై పీకేకు అవగాహన లేదని ఎవరూ చెప్పరు.అయితే అందుకు తగిన మోతాదులో డబ్బు,లిక్కరు ఓటర్లకు పంచగలగాలి.ఓటర్లను మభ్య పుచ్చాలి.భ్రమల్లో ముంచాలి.తాము మోసం చేస్తున్నట్టుగా ప్రజలకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాంగ్రెసేతర, బిజెపియేతర రాజకీయ విధానాలను పీ.కే. రూపొందించ గలుగుతారా? ఆ పార్టీలకు ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించడం సాధ్యమేనా ? కేసీఆర్ తో కలిసి ‘ఉమ్మడి’గా ‘ ప్రత్యామ్నాయ’ ఎజండా రచిస్తున్నారా ? అనే అంశాలపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నవి.

– ఎస్.కె. జకీర్
ఎడిటర్, బంకర్‌న్యూస్

Leave a Reply