ప్రధాని చేతులు మీదుగా ఏడు కార్యక్రమాలు ప్రారంభం,శంకుస్థాపన

– బహిరంగ సభకోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ పరిశీలించిన ఎంపీ విజయసాయి రెడ్డి
– రాజకీయాలకు అతీతంగా ప్రధాని సభ విజయవంతం చేయాలని పిలుపు

విశాఖపట్నం, నవంబర్ 2: ఈ నెల 11, 12 తేదీలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించి ఏడు అభివృద్ది కార్యక్రమాలకు శంకు స్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారని, ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో మాట్లాడనున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 12న ప్రధాని బహిరంగ సభ కోసం ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ను జిల్లా అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని బహిరంగ సభ, ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలు పీఎంఓ ఖరారు చేయగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ బాద్యతలు చేపడుతుందని అన్నారు. ఇది రాజకీయ పార్టీలకు సంబందించిన కార్యక్రమం కాదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కార్యక్రమమని అన్నారు. ప్రధాని 11న విశాఖకు చేరుకుంటారని, 12 వ తేదీ ఉదయం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని అన్నారు.

ప్రధాన మంత్రి విశాఖ విచ్చేయుచున్న సందర్బంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఘనంగా స్వాగతం పలుకుతారని అన్నారు. ఈ సందర్బంగా రైల్వేజోన్ పై మీడియా ప్రతినిదులు అడిగిన ప్రశ్నలకు బదిలిస్తూ, రైల్వేజోన్ పై ఇప్పటికే రైల్వే మంత్రి స్ఫష్టమైన సమాచారం ఇచ్చారని గుర్తుచేశారు. ప్రధాని భద్రతా కారణాల దృష్ట్యా పర్యావరణానికి హాని కలిగించకుండా చెట్లు నరకకుండా సమీప ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రధాని పర్యటనకు సంబందించి పీఎంఓ కార్యాలయం నుంచి మినిట్ టూ మినిట్ ప్రోగ్రాం వివరాలు త్వరలో అందనున్నాయని అన్నారు.

ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ తో పాటు యూనివర్సిటీ ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్ల కొరకు మరి కొన్ని క్రీడా స్థలాలు పరిశీలించించారు. యూనివర్సిటీలో పలు బహిరంగ ప్రదేశాలను సుమారు 2 గంటలు పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, జివిఎంసీ కమీషనర్ రాజాబాబు, ఏయు వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు తో కలిసి పరిశీలించారు. బహిరంగ సభ ఏర్పాట్లపై కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించారు.

జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ రూ.10472 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు ప్రధాని చేతులు మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరగనుందని అన్నారు.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ,
రాయపూర్- విశాఖపట్నం 6లేన్ల రహదారి,
కాన్వెంట్ జంక్షన్- షీలానగర్ పోర్డు రోడ్డు అభివృద్ది,
విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరుద్దరణ,
గెయిల్ కు సంబందించి శ్రీకాకుళం-అంగుళ్ పైప్ లైన్ ఏర్పాటు,
నరసన్నపేట- ఇచ్చాపురం రోడ్డు అభివృద్ది,
ఓఎన్జీసీ యూ ఫీల్డ్ డెవలప్ మెంట్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్ షోర్ కార్యక్రమాలకు శంకు స్థాపన, ప్రారంబోత్సవం నిర్వహిస్తారని అన్నారు. కార్యక్రమంలో తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంఎల్సీ వరుదు కళ్యాణి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Leave a Reply