Suryaa.co.in

Andhra Pradesh

ఏప్రిల్ 27న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ 2024 నిర్వహణ

-ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశ పరీక్ష కోసం ఉచిత శిక్షణ
-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి

పదవ తరగతి తర్వాత ఉజ్వల భవిష్యత్తు, పిన్న వయస్సులోనే ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉత్తమమైన మార్గం “పాలిటెక్నిక్ విద్య” మాత్రమేనని సాంకేతికి విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం “పాలిసెట్-2024“ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 27వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నామన్నారు.

పదవ తరగతి చదువుతున్న విద్యార్దులలో పాలిటెక్నిక్ పట్ల మరింత అవగాహన పెంపొందిoచే క్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి రూపొందించిన సమాచారా కరదీపిక, కరపత్రాలు, గోడ పత్రికలను సోమవారం సాంకేతిక విద్యా శాఖ కేంద్ర కార్యాలయంలో నాగరాణి ఆవిష్కరించారు. ఈ ప్రచార కరదీపికలో పాలిటెక్నిక్ విద్యతో కలిగే ప్రయోజనములు, పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసిన విద్యార్ధులు పొందుతున్న ఉపాధి అవకాశాలు, జీత భత్యాల వివరాలను సమగ్రంగా వివరించారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ పాలిసెట్-2024 ప్రవేశ పరిక్ష గురించి విద్యార్ధులకు మెరుగైన అవగాహన కల్పించే క్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో అవగాహన సదస్సులు నిర్వహించ నున్నామన్నారు. పదవ తరగతి పరిక్షలు పూర్తయిన వెంటనే అన్ని (87) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా “పాలిసెట్-2024“ ప్రవేశ పరీక్ష కు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఈ కోచింగ్ ఇంగ్లీష్, తెలుగు మీడియం లో ఇవ్వడమే కాకుండా, ప్రవేశ పరీక్ష కొరకు రూపొందించబడిన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లేబరేటరీలను ఆధునీకరించి, వసతి కల్పనను సైతం మెరుగుపరచామని నాగరాణి వివరించారు. ఎన్ బిఎ గుర్తింపు పొందిన ప్రభుత్వ పాలిటెక్నిక్ లతో ఈ విద్యా సంవత్సరము (2024-25) నుండి విద్యార్ధులకు మెరుగైన విద్యనందిచుటకు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ సంసిద్దంగా ఉందన్నారు.

పాలిటెక్నిక్ విద్య పూర్తి అయిన వెంటనే సత్వర ఉపాధి అవకాశములను కల్పించేందుకు వివిధ పరిశ్రమలతో ఒప్పoదములు చేసుకున్నామన్నారు. గోడ పత్రిక అవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణా మండలి కార్యదర్శి రమణబాబు, సంయిక్త కార్యదర్శి జివివిఎస్ ఎన్ మూర్తి, కంట్రోలర్ ఆప్ ఎగ్జామినేషన్స్ జానకి రామయ్య, ఉప కార్యదర్శులు డిఎస్ఎస్ ఎన్ వి ప్రసాద్ బాబు, రవికుమార్, వేణు మాధవ్, ఓఎస్డి రత్నసాగర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE