Suryaa.co.in

Andhra Pradesh

మే 23 నుండి పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియ

-జూన్ 7న సీట్ల కేటాయింపు, 10న తరగతుల ప్రారంభం
-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి

పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ మే 23వ తేదీ గురువారం నుండి ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను బుధవారం విడుదల చేయటం జరుగుతుందన్నారు. అమరావతి లోని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కార్యాలయంలో మంగళవారం పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి విద్యా విషయక సమావేశం నిర్వహించారు.

ప్రవేశాలకు సంబంధించిన విభిన్న అంశాలను చర్చించిన సమావేశం సంబంధిత ప్రక్రియకు అవసరమైన ప్రణాళికను ఖరారు చేసింది. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ ప్రవేశాలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తదితర ఆన్ లైన్ ప్రక్రియకు మే 24వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు పది రోజుల పాటు అవకాశం ఉంటుందన్నారు. ధృవపత్రాల వెరిఫికేషన్ కు మే 27 నుండి జూన్ 3వ తేదీ వరకు ఎనిమిది రోజుల లోపు పూర్తి చేయవలసి ఉందన్నారు. ఐచ్చికాల నమోదుకు మే 31వ తదీ నుండి జూన్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. జూన్ 5వ తేదీన ఐఛ్చికాల మార్పుకు అవకాశం ఉంటుందని , జూన్ 7వ తేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని కమీషనర్ వివరించారు.

జూన్ పదవతేదీ నుండి 14వ తేదీ వరకు 5 రోజుల లోపు ప్రవేశాలు ఖరారు అయిన విద్యార్ధులు అయా పాలిటెక్నిక్ లలో వ్యక్తిగతంగా, ఆన్ లైన్ విధానంలోనూ రిపోర్టు చేయవలసి ఉంటుందన్నారు. జూన్ 10వ తేదీ నుండే రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు ప్రారంభం అవుతాయని నాగరాణి పేర్కొన్నారు. ర్యాంకు కార్డులను వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ప్రవేశాల కౌన్సిలింగ్ కు సిద్దంగా ఉండాలన్నారు. పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరుకాగా, 87.61 శాతం మేర 1,24,430 మంది అర్హత పొందారు.

బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా, 89.81 శాతం మంది, బాలురలో 85,561 మంది హాజరుకాగా 86.16 శాతం అర్హత గడించారు. సమావేశంలో సాంకేతిక విద్య శాఖ సంయిక్త సంచాలకులు వెలగా పద్మారావు, అదనపు కార్యదర్శి ఎస్ వి ఆర్ కె ప్రసాద్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి రమణబాబు, చీప్ క్యాంప్ ఆఫీసర్ విజయకుమార్ , ఉపసంచాలకులు విజయ బాస్కర్, నేషనల్ ఇన్ ఫర్ మేటిక్ సెంటర్ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE