– తెలుగునాడు అంగన్వాడీ-డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు
కమీషన్లకు కక్కుర్తిపడి పోస్టులు అమ్ముకుంటున్నారని తెలుగునాడు అంగన్వాడీ-డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. మంగళవారం ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శిరి ని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ…మూడున్నరేళ్లుగా జీతాల పెంపు లేక, నెలవారీ జీతాలు సక్రమంగా అందక అంగన్వాడీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఎట్టకేలకు గ్రేడ్ -2 సూపర్ వైజర్ పోస్టుల పదోన్నతులకు పరీక్షలు పెట్టారు కదా.. ఏళ్ల తరబడి ఎదురుచూపుకు ఫలితం ఉంటుందని ఆశించిన అంగన్వాడీలకు ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల పదోన్నతి పరీక్షల్లోనూ అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సూపర్ వైజర్ పోస్టుల పదోన్నతికి సంబంధించి 45 మార్కుల రాత పరీక్ష నిర్వహణ వరకూ సవ్యంగానే నడిచింది. ఆ పరీక్షలో ఉత్తీర్ణలైన వారికి 5 మార్కుల స్పోకెన్ ఇంగ్లీష్ ఆడియో పరీక్ష పెట్టడాన్ని మాత్రం ఒక పద్దతి లేకుండా గందరగోళం చేశారు. రాత పరీక్షకు సంబంధించిన కీ విడుదల చేయకుండా , పరీక్షలో అభ్యర్థులకు మార్కులు విడుదల చేయకుండానే ఆదరాబాదరగా ఆడియో పరీక్ష నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇంటర్వూకు ముందు అభ్యర్థులు మార్కుల లిస్ట్ బయటపెట్టాలనే ప్రభుత్వ నిబంధనను ఎందుకు తుంగలో తొక్కారు? స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోను రికార్డు చేసి పంపమన్న స్త్రీ శిశు, సంక్షేమశాఖ ఆదేశాలు రాత పరీక్ష రాసిన కొంతమంది అంగన్వాడీలకే ఎందుకు చేరాయి? దీనికితోడు కొన్ని జిల్లాల్లోనయితే ఇంటి దగ్గరే వీడియో రికార్డు చేసి పంపమని అంగన్వాడీలకు వైసీపీకి చెందిన స్థానిక నేతుల చెబుతున్నట్టు సమాచారం ఉంది. దీనిపై మీ స్పందనేంటి? ఇంటి నుంచి పంపిన వీడియో ద్వారా మెరిట్ నిర్ధారించడం ఎంతవరకూ సబబు?
ఇంటర్వ్యూ లేకుండా మార్కులు వేయడమంటి? అంగన్వాడీల ఉద్యోగాలకు సంబంధించిన అంశాన్ని ఇంత గందరగోళంలోకి నెట్టడం సరికాదు. అంగన్వాడీల పదోన్నతుల వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయని తెలుస్తోంది. కమీషన్ల కోసం కక్కుర్తి పడిన పలువురు వైసీపీ నేతలు సూపర్ వైజర్ పోస్టింగులను అవినీతిమయం చేస్తుంటే చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం? ఇప్పటికైనా స్త్రీ, శిశు సంక్షేమశాఖ దీనిపై దృష్టి పెట్టాలి. వైసీపీ నేతల కమీషన్ల కక్కుర్తికి అడ్డుకట్టవేయాలి. అభ్యర్థుల మార్కుల లిస్ట్ ను విడుదల చేయాలి. సూపర్ వైజర్ పోస్టుల భర్తీలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలి. అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని’’ ఆచంట సునీత కోరారు.