భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి,ప్రధాని..

దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలను మాటల్లో వర్ణించలేమని రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. దేశ రక్షణలో వారి సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ క్రమంలో జాతీయ సైనిక దినోత్సవాన్ని (జనవరి 15) పురస్కరించుకుని రామ్‌నాథ్‌ కోవిండ్‌, నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యేక సైనిక సందేశం పంపారు. ముందుగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘ఆర్మీ డే సందర్భంగా ఆర్మీ సిబ్బంది, సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. దేశ భద్రతకు భరోసా ఇవ్వడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. దేశ సరిహద్దుల వెంట శాంతి భద్రతలను కాపాడడంలో మన సైనికులు ఎంతో నైపుణ్యం, శౌర్యం ప్రదర్శిస్తున్నారు. వారి సేవలు వెలకట్టలేనివి. ఇందుకుగాను యావత్ దేశం ధన్యవాదాలు చెబుతోంది. జై హింద్!’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత సైన్యంపై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్‌ వేదికగా ‘ఆర్మీ డే సందర్భంగా.. మన ధైర్యవంతులైన సైనికులు, మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. భారత సైన్యం ధైర్యసాహసాలు, వృత్తి నైపుణ్యానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశ భద్రత కోసం భారత సైన్యం చేస్తున్న అమూల్యమైన సహకారం గురించి చెప్పడానికి మాటలు చాలవు’ అని పేర్కొన్నారు. ఇక మరో ట్వీట్‌లో ‘భారత ఆర్మీ సిబ్బంది ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో సమర్థంగా సేవలందిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, సంక్షోభ సమయాల్లో, శత్రువుల ముప్పు నుంచి తోటి పౌరులకు సహాయం చేయడంలో సైనికులు అందిస్తున్న సేవలు నిరూపమైనవి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోన్న శాంతిస్థాపన కార్యక్రమాల్లోనూ మన దేశ సైనికులు వీరోచిత ప్రదర్శన కనబరుస్తున్నారు’ అని పేర్కొన్నారు. వీరితో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ భారత సైన్యం సేవలను కొనియాడారు. ‘ దేశాన్ని రక్షించడంలో

మన సైనికుల నిబద్ధత తిరుగులేనిది. సైన్యాన్ని చూసి యావత్ దేశం గర్విస్తోంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Leave a Reply