Suryaa.co.in

Andhra Pradesh

దుర్గి ఘటన పునరావృతం కాకుండా చూడండి

– డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

నిన్న దుర్గిలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు శెట్టిపల్లి కోటేశ్వర్ రావ్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు.విగ్రహ విధ్వంసం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలో భాగంగానే చేశారు.

ఇవి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలపై ప్రజలు తిరుగుబాటు చేయవచ్చు. 2019 జూన్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి.ఇలాంటి సంఘటనలు అధికార వైసీపీ నాయకుల ఆదేశాల మేరకే జరుగుతున్నాయనడానికి వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు కుమారుడు ఎన్టీఆర్ విగ్రహ విధ్వంసమే నిదర్శనం.

ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో జాతీయ నాయకులైన ఎన్టీఆర్, డా. బి.ఆర్‌ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు లాంటి విగ్రహాలను ధ్వంసం చేసే చర్యలకు అధికారపార్టీ గూండాలను ప్రోత్సహిస్తోంది.

ఇలాంటి విధ్వంసాలను ప్రోత్సహించడంలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలను అదుపులోకి తీసుకోవడం మాని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించాలి.

కాబట్టి పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలి. నేరస్తులపై పోలీసులు తీసుకునే కఠినమైన చర్యలు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటి విధ్వంసకర చర్యలు పునరావృతం కాకుండా అడ్డుకుంటాయి.

LEAVE A RESPONSE