Suryaa.co.in

Andhra Pradesh

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 23 నుండి ప్రారంభం

– సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 23 నుండి ప్రారంభం కానుందని కమిషనర్ మరియు ఎక్స్ అఫీషియో సెక్రటరీ, సమాచార, పౌర సంబంధాల శాఖ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కలిగిన అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ క్రింద ఇంటి స్థలాలను అందించేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 535 ద్వారా వీలు కల్పించిందన్నారు.

అర్హులైన జర్నలిస్టులు ఇళ్ల స్థలాల మంజూరు కోసం తమ వివరాలను http://ipr.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. నవంబర్ 23వ తేదీ నుండి ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందని, 45 రోజుల్లోగా (2024 జనవరి 6వ తేదీ) పైన తెలియజేసిన వెబ్‌సైట్ లో జర్నలిస్టులు సంబంధిత వివరాలతో ఆన్‌లైన్ లో తమ దరఖాస్తును సమర్పించాలన్నారు. అక్రిడిటేటెడ్ జర్నలిస్టులకు కేటాయిస్తున్న ఇళ్ల స్థలం విలువలో 60 శాతం ప్రభుత్వం, 40 శాతం జర్నలిస్టులు చెల్లించాలని ఆయన తెలిపారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జర్నలిస్ట్ అక్రిడిటేషన్ వివరాలను, జర్నలిస్ట్ గా వారి వృత్తి అనుభవాన్ని ప్రాథమికంగా పరిశీలించి, అర్హులైన జర్నలిస్టుల జాబితాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లకు అందజేస్తామని ఆయన తెలిపారు. తదనంతరం జిల్లా కమిటీలు నిబంధనల మేరకు జర్నలిస్టుల అర్హతను పరిశీలించి ఇళ్ల స్థలాలను కేటాయించడానికి సరైన స్థలాలను జిల్లా పరిధిలోనే గుర్తిస్తారని తెలిపారు.

ఇప్పటికే తాము సరైన స్థలాలను గుర్తించే విధంగా జిల్లా స్థాయి కమిటీలను వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశామని ఆయన తెలిపారు.
అర్హులైన అక్రిడిటేటెడ్ జర్నలిస్టులందరూ నిర్ణీత సమయంలో ఆన్‌లైన్ లో తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం జర్నలిస్టుల సేవలను గుర్తించి ఇస్తున్న ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఆ ప్రకటనలో తెలియజేశారు.

LEAVE A RESPONSE