Suryaa.co.in

Andhra Pradesh

విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం కింద రూ. 9,600 కోట్లు

– త్వరలో అర్హులైన వారికి రేషన్ కార్డులు
– పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

ఏలూరు/బుట్టాయిగూడెం,ఏప్రిల్,22:నిర్వాసిత కుటుంబాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకజాబ్ మేళాలు నిర్వహిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. మంగళవారం రౌతుగూడెం నిర్వాసితులు కాలనీని సందర్శించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అందించడంతోపాటు వారి జీవనానికి అవసరమైన రేషన్ కూడా అందిస్తున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిస్తామన్నారు. ప్రాజెక్ట్ మూలంగా 379 గ్రామాలు ముంపుకు గురౌతున్నాయని ఇందుకోసం నిర్వాసితులకు రూ. 4,853 కోట్ల రూపాయలు పరిహారం అందించామన్నారు.

ప్రాజెక్ట్ కోసం తమ భూములు త్యాగంచేసిన నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూర్తి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. నిర్వాసితుల కాలనీల్లో త్రాగునీరు, సిసి రోడ్లతోపాటు స్కూల్స్, అంగన్వాడీ, ఆసుపత్రులు, రేషన్ షాపులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి కుటుంబానికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు.

అంత్యోధయ అన్నయోజన కార్డులు అందించేందుకు సర్వే చేపట్టగా 10 వేల కుటుంబాలు ఉండగా ఇంతవరకు 3 వేల కుటుంబాలకు అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారికి, కొత్తగా వివాహమైన వారికి త్వరలో రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఈనెలాఖరుకు ఈకెవైసి ప్రక్రియ పూర్తవుతుందని ఆపిదప కొత్తరేషన్ కార్డుల జారీకి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

కాలనీల్లో 5 సంవత్సరాలు దాటి పాడైన ఇళ్లకు మరమ్మతులు చేపట్టేందుకు సర్వేచేసి వివరాలు ప్రతిపాధిస్తే మరమ్మతులకు చర్యలు తీసుకుంటామన్నారు. త్రాగునీటి సమస్యవున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సంక్షేమం తోపాటు అభివృద్ధికూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా ఎన్ టిఆర్ భరోసా కింద రూ. 2,700 కోట్ల రూపాయలు 63 లక్షల మందికి పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు.

అదే విధంగా రానున్న విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం కింద రూ. 9,600 కోట్లు అందించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పధకంకు పోషకాలతో కూడిన నాణ్యమైన బియ్యాన్ని అందించనున్నట్లు తెలిపారు. దీపం పధకం కింద గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు 48 గంటలలోపుగానే వారి ఖాతాలకు సొమ్ము జమచేయడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ సౌరబ్ గౌర్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఐటిడిఏ పివో రాములు నాయక్, ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల ధర్మరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఆర్ టిసి జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఆర్డిఓ ఎం.వి. రమణ, తహశీల్దారు అచ్యుత్, జనసేన నాయకులు కొటికలపూడి గోవిందరాజు, కరాటం సాయి, గడ్డమనుగు రవి, స్ధానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE