Suryaa.co.in

Telangana

రేవంత్.. ఆ 3వేల కోట్ల ఉద్యోగుల బకాయిలేవీ?

– కొండను తవ్వి ఎలుకను పట్టిన క్యాబినెట్ కమిటీ నివేదిక
– నిద్ర పోకుండా ప్రభుత్వాన్న్ని నిలదీస్తూనే ఉంటాం
– 317 జీవో భాదితులకు న్యాయం చేయాలి
– మూడు వేల కోట్లకు పైగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు
డీ ఏ లు ,పి ఆర్ సి పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదు
హెల్త్ కార్డుల ప్రస్తావన లేదు
నక్సలైట్లు ఉండాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇపుడు ఎన్కౌంటర్లు చేస్తున్నారు
– బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్ ,మన్నె గోవర్ధన్ రెడ్డి ,భుజంగ రావు

హైదరాబాద్: ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది. ఎన్నికలపుడు కాంగ్రెస్ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. 317 జీవో ను అధికారం లోకి వచ్చిన 48 గంటల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. 317 జీవో పై వేసిన కేబినెట్ సబ్ కమిటీ ఆరునెలల తర్వాత ఇచ్చిన నివేదిక, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది.

స్థానికత అంశాన్ని సబ్ కమిటీ పూర్తిగా విస్మరించింది. ఉద్యోగ సంఘాలు కూడా ఈ నివేదిక పై నిరసన తెలుపుతున్నాయి.ఖాళీలను బట్టే ఉద్యోగుల బదిలీలు ఉంటాయని సబ్ కమిటీ నివేదిక లో పేర్కొనడం హాస్యాస్పదం. 317 జీవో బాధితులు సీఎంఓ చుట్టూ తిరుగుతున్నా సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.

వెంటనే లోపాలు సరిదిద్ది 317 భాదితులకు న్యాయం చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పని చేసిన మహేందర్ రెడ్డి ఇచ్చిన ప్రకటన, ఉద్యోగ నియామకాల పై బీ ఆర్ ఎస్ చేస్తున్న వాదనను బలపరుస్తోంది. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లే తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా చేసిందేమి లేదు.

ఉద్యోగుల డిమాండ్ల ను రేవంత్ ప్రభుత్వం ఏ ఒక్కటి నెరవేర్చలేదు. కనీసం రిటైర్ మెంట్ అయిన ఉద్యోగులకు వాళ్ళకు దక్కాల్సిన బెనిఫిట్స్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. మూడు వేల కోట్లకు పైగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. డీ ఏ లు ,పి ఆర్ సి పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదు. హెల్త్ కార్డుల ప్రస్తావన లేదు.

మొదటి తారీఖుకు జీతాలు చాలా మంది ఉద్యోగులకు రావడం లేదు. ప్రభుత్వాన్ని ఎవరు బద్నామ్ చేయడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రజలే రోడ్ల పైకి వస్తున్నారు. మీరిచ్చిన హామీలను నెరవేర్చినా మేము ఆందోళన చేస్తే ప్రజలే మమ్మల్ని తప్పుబడుతారు.

ప్రధాన ప్రతిపక్షం గా ప్రజా సమస్యలపై బీ ఆర్ ఎస్ నిలదీస్తూనే ఉంటుంది. ఎందుకు ఏడాది దినాన్ని సంబరంగా చేసుకుంటున్నారు? రేవంత్ ఈ ఏడాది లో తెచ్చింది పొలిసు రాజ్యమే ..ప్రజా పాలన కాదు. నక్సలైట్లు ఉండాలని ప్రతిపక్షం లో ఉన్నపుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇపుడు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని నిర్బంధాలు పెట్టినా మేము నిద్ర పోకుండా ప్రభుత్వాన్న్ని నిలదీస్తూనే ఉంటాం. .

LEAVE A RESPONSE