Suryaa.co.in

Telangana

పథకాల కోతకు రేవంత్ కుట్ర

– అందుకే బీద అరుపులు
– బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా ఇస్తున్నారు?
– ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొడుతున్నారు
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాళా తీసిందని పదేపదే చెప్పడం వెనుక అసలైన ఉద్దేశ్యం ఏమిటి? ఇది ఓ పకడ్బందీ స్కెచ్‌లా కనిపిస్తోంది. ఒకవైపు ప్రజలను ప్రిపేర్ చేస్తున్నట్టు, మరోవైపు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల మీదకు ప్రజలను ఉసిగొల్పుతున్నట్లుగా పకడ్బందీ ప్లాన్ చేసినట్లు కనపడుతోంది.

ఇచ్చిన హామీలను తప్పించుకునే కుతంత్రంగా.. ఒకవైపు ఉద్యోగులను భయపెడుతూ, బ్లాక్ మెయిల్ చేస్తూ.. మరోవైపు ప్రజలలో ఆర్థిక సంక్షోభ భయం రేకెత్తించి సంక్షేమాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కేందుకు ఈ ధోరణి భాగమని స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఇదే విధంగా మాట్లాడుతున్నరు.

ఈరోజు అధికారం కోసం అనేక హామీలిచ్చి.. ఈరోజు ఏదోరకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు.. దివాళా తీసింది.. సంక్షేమ పథకాలను ఇవ్వలేమనట్లుగా ప్రజలను ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి చూస్తే దీని వెనుక పెద్ద కుట్రే ఉంది.

సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి భరోసా కల్పించాల్సింది పోయి.. ప్రజల్ని ఉద్యోగస్తుల మీదకు ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని రాష్ట్ర ప్రజల పరువు తీయాలని చూస్తున్నడు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్ల రూపాయలతో బి-ట్యాక్సులు తీసుకొని బిల్లులు పాస్ చేసినప్పుడు కనపడలేదా ఈ సమస్య..? రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్.. రైతు భరోసా ఏది కట్ చేయాలా అని అడుగుతుండటం సిగ్గుచేటు.

ఉద్యోగులకు జీతభత్యాలు, పెండింగు బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా, ప్రజల ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపెడుతుండమంటే.. ఇంతకంటే మోసం, దగా మరొకటి లేదు. పీసీసీ నాయకులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తో పాటు ఆ పార్టీ నాయకులు ఉత్తమ్, భట్టి విక్రమార్కలు రాష్ట్రంలో రూ. 5.29 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పారు. ఇప్పుడు మాత్రం అప్పు తక్కువగా చూపడం అనుమానాస్పదంగా ఉంది.

రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో అప్పులు పుట్టడం లేదని, అప్పుకోసం వెళ్తే దొంగలను చూసినట్లు చూస్తున్నారంటూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నడు. రబీ, ఖరీఫ్ పంటకాలంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా, అదే డబ్బును బడా కాంట్రాక్టర్ల బిల్లులకు వినియోగించడమే రైతులపై ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి నిదర్శనం.

ఉచిత కరెంట్, వృద్ధాప్య పెన్షన్ వంటి పథకాలను ఎత్తివేయాలనే ఆలోచన కనిపిస్తోంది. మహాలక్ష్మి పథకాన్ని కొనసాగించకుండా విరమించేందుకు ప్రభుత్వం చూస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీని నిలిపివేయడం, రైతు భరోసా వంటి పథకాలపై వెనకడుగు వేయడం ప్రభుత్వ ధోరణిని చూపుతోంది. ప్రభుత్వం వాగ్దానాలను అమలు చేయకపోతే ప్రజలు క్షమించరు. బిజెపి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు తప్పవు.

రైతులకైనా, విద్యార్థులకైనా, ఉద్యోగులకైనా, సర్పంచులకైనా ఇవ్వాల్సిన బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలి. బడా కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు చెల్లించిన బిల్లుల వివరాలను ప్రభుత్వమే వెల్లడించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా డిగ్రీ, పీజీ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. కాలేజీలు, విద్యార్థులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బాసర ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్లు జీతాల కోసం ధర్నా చేసినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం నిర్లక్ష్య పాలనకు ప్రతీక. ప్రైవేటు కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 7 వేల కోట్ల బకాయిలు పెట్టింది. ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా చెల్లించలేదు.

కాంగ్రెస్ మంత్రులకు చెందిన కంపెనీలకు వందల కోట్ల రూపాయల బిల్లులు ప్రాధాన్యతతో చెల్లిస్తూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిల కోసం నిధుల్లేవని చెప్పడం వెనుక ఏ కుట్ర దాగుందో స్పష్టంగా తెలుస్తోంది.

చిన్న కాంట్రాక్టర్లు ఉపముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. “20 పర్సెంట్ కమీషన్ గవర్నమెంట్” అంటూ నినాదాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈ ప్రభుత్వ పరిపాలన స్థాయి ఏంటో అర్థం అవుతుంది. ఇలాంటి నీచమైన ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదు.

మాజీ సర్పంచులకు వెయ్యి కోట్లు, చిన్న కాంట్రాక్టర్లకు ర. 1500 కోట్లు కేటాయించలేని కాంగ్రెస్ ప్రభుత్వం… బడా కాంట్రాక్టర్లకు మాత్రం వేలకోట్లు చెల్లిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లు రూ. 1,100 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలు జరిగినా, ప్రభుత్వానికి చీమకుట్టినట్టూ లేదు.

7 మార్చ్ 2025 రోజున ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని కలిసినప్పుడు… ఆర్జిత సెలవులు, మెడికల్ రీయింబర్స్ మెంట్లు, గ్రూప్ ఇన్సూరెన్స్ లు ఇలా.. మొత్తం రూ. 8 వేల కోట్లు… అదేమాదిరిగా సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి మరో రూ. 2 వేల కోట్ల పెండింగ్ లో ఉన్నాయని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ డీఏలు, పీఆర్ లు ఇవ్వకపోవడంపై నిలదీస్తే.. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి… ప్రజలను ఉద్యోగస్తుల మీదకు ఉసిగొల్పడం దారుణం.

ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర పాలన చేయగల సామర్థ్యం లేకపోతే, తక్షణమే తన ప్రభుత్వాన్ని డిసాల్వ్ చేయాలి. ప్రజాతీర్పు కోరాలి. రాష్ట్రాన్ని ఆర్థికంగా నడిపించలేని స్థితిలో ఉంటే, పాలనలో క్రమశిక్షణ తీసుకురాలేకపోతే… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ముందు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. ప్రజల తీర్పు కోసం ముందుకురావాలి.

ఒకవైపు భారత్ -పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఒకవేళ వార్ మొదలైతే.. ఆ వార్ ను అడ్డుపెట్టుకుని, ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రమైందిగా చిత్రించి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టి, ఉద్యోగుల జీతాలు కట్ చేసి.. సంక్షేమ కార్యక్రమాలు బంద్ పెట్టి.. ఆర్థిక సంక్షోభాన్ని ముందుపెట్టి అన్నీ ఎగ్గొట్టాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ నెరవేర్చేంతవరకు ప్రజల పక్షాన బిజెపి పోరాటం చేస్తుంది. ప్రజా ఉద్యమం చేసి, రేవంత్ ప్రభుత్వం మెడలు వంచుతాం.

LEAVE A RESPONSE