– ప్రజలకు,ఉద్యోగుల మధ్య చిచ్చు
– మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్ : ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న ఓడ దిగినాక బోడి మల్లన్న లాగా ఉంది రేవంత్ వ్యవహారం. ఉద్యోగులను కంటికి రెప్పలగా కాపాడుకుంటా అని పెద్ద పెద్ద మాటలు చెప్పి రేవంత్ రెడ్డి నమ్మించి గొంతు కోశాడు. నాడు ఓట్ల కోసం ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. గద్దెనెక్కిన తర్వాత ఇవాళ ఉద్యోగులను అవమానించేలా మాట్లాడుతున్నారు.
అధికారంలోకి రాగానే మంచి PRC ,ఎన్ని DA లు పెండింగ్ ఉంటే అన్ని DA లు, 317 జి.ఓ బాధితులకు 48 గంటల్లో న్యాయం చేస్తా,పెన్షనర్ల బకాయిలు చెల్లిస్తా అన్నాడు. గత ప్రభుత్వమే 317 జి.ఓ పారా నెంబర్ 28 లో ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఎవరినైనా ఎక్కడికైన మార్చవచ్చు అని వెసులుబాటు కూడా కల్పించింది. మేము రాగానే 48 గంటల్లో అమలు చేస్తాం అన్నారు అమలు పరచండి అని డిమాండ్ చేస్తున్నాం.
పెన్షనర్లు వాళ్లకు రావాల్సిన డబ్బులు రాక పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. ఫోర్త్ సిటీ, మూసీ ప్రాజెక్టుకు,స్కిల్ యూనివర్సిటీ కి,అందాల పోటీలకు డబ్బులు ఉంటాయి కానీ, ఉద్యోగులకు పెండింగ్ బకాయిలకు డబ్బులు లేవా? డబ్బులు లేవు ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసింది అంటూ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడితే పెట్టుబడులు ఎక్కడ నుండి వస్తాయి?
ఒకనాడు ఏమో తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉంది అని మాట్లాడి, ఇప్పుడేమో దివాళా తీసింది అంటూ పూటకో మాట మాట్లాడుతున్నావ్. పక్క రాష్ట్రాల పెళ్ళిలకు, ఢిల్లీకి మీరు మూటలు మోయడానికి ,ప్రతి కార్యక్రమానికి మంత్రులు హెలికాప్టర్ లు వాడుతుంటే దుబారా ఖర్చు కావడం లేదా రేవంత్ రెడ్డి? ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని , ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు.
నీ అధికార యావ కోసం హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియలేదా రేవంత్ రెడ్డి? పరిపాలన చేయడంలో పూర్తిగా రేవంత్ సర్కార్ వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు అమలు పరచండి అని ఉద్యోగస్తులు అడిగితే ప్రజలకు ఏ పథకాలు కోతలు పెట్టి మీకు ఇవ్వాలో చెప్పండి అని ఉద్యోగులపై ఎదురుదాడి చేయడం శోచనీయం.
ప్రజలకు,ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టి ముఖ్యమంత్రి చలి కాచుకోవాలని చూస్తున్నాడు. ఉద్యోగులతో మాది పేగుబంధం అని కేసీఆర్ గారు ఉద్యోగులకు భరోసా కల్పించారు..మనో ధైర్యాన్ని ఇచ్చారు. తన పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉద్యోగులను అవమానించేలా, బెదిరించేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో,పునర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది.వారికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.