– ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల పట్ల ముఖ్యమంత్రి పెద్ద మనసు
– 421 మందికి మొదటి విడతలో ప్లాట్ల పునరుద్ధరణ
– పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్-
– ఎంఎస్ఎంఈలకు లోన్ల ఇబ్బందులపై బ్యాంకర్లతో మాట్లాడి పరిష్కారం : ఏపీఐఐసీ వీసీ & ఎండీ సుబ్రమణ్యం జవ్వాది
అమరావతి, జూలై, 12 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క జీవో నంబర్ 7 విడుదల .. వందలాది పరిశ్రమలలో పునరుజ్జీవం నింపిందని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఇబ్బందులను తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పెద్ద మనసు చాటుకున్నారన్నారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలోని తన కార్యలయంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్లాట్ల పునరుద్ధరణకు సంబంధించిన పత్రాలను మంత్రి గుడివాడ అమర్ నాథ్ అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 572 దాకా వచ్చిన దరఖాస్తులలో మొదటి విడతలో 421 మంది పారిశ్రామికవేత్తలకు పాత ఎస్టేట్ లోని అదే చోట ప్లాట్ కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఫిబ్రవరి 5న ప్రభుత్వం విడుదల చేసిన జీవో అమలుపై బడుగు, బలహీనవర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.
కోల్పోతామనుకున్న ప్లాట్లలోనే తమ పరిశ్రమలను పున: ప్రారంభించేలా ప్రభుత్వం మరో అవకాశం కల్పించడం పరిశ్రమల ప్రగతి పట్ల ముఖ్యమంత్రి అంకితభావానికి నిదర్శనమన్నారు. పారిశ్రామికవేత్తలు నాడు ప్లాట్లు పొందిన నాటి పాత ధరలనే వర్తింపజేయడం, ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించే ఈ అవకాశం వల్ల వందలాది పరిశ్రమలు మళ్ళీ పున: ప్రారంభించుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
అన్ని భూ కేటాయింపులను లీజు నుంచి అమ్మకం(ఓఆర్ఎస్-ఔట్ రేజ్ సేల్) పద్ధతిలోకి మార్చడం, దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తిరిగి కేటాయింపులకు సంబంధించిన లెటర్లు ఇవ్వడం, యూనిట్ ని పూర్తి చేసేందుకు ఏప్రిల్ 1 , 2022 నుంచి మరో మూడేళ్ళ వరకూ కాలపరిమితిని పెంచడం వంటి వెసులుబాటుతో వందలాది కుటుంబాలకు కొండంత అండగా మారినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎంఎస్ఎంఈలకు లోన్ల ఇబ్బందులపై బ్యాంకర్లతో మాట్లాడి పరిష్కారం : ఏపీఐఐసీ వీసీ & ఎండీ సుబ్రమణ్యం జవ్వాది
ఎంఎస్ఎంఈలకు ఎదురవుతున్న రుణ సంబంధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీఐఐసీ వీసీ & ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. ప్రభుత్వంతో మాట్లాడి బ్యాంకర్లతో పారిశ్రామికవేత్తల తరపున భరోసా అందించే దిశగా అడుగులు వేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ఏ సంవత్సరంలో అయితే భూ కేటాయింపు జరిగినదో అదే సంవత్సరంలో ఉన్నటువంటి భూమి రేటు ప్రకారము ఈ సంవత్సరంలో తిరిగి ప్లాటు ఇవ్వడం జరుగుతుందని ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది స్పష్టం చేశారు.
దీని ప్రకారం, 2008వ సంవత్సరంలో జరిగినటువంటి అభ్యర్థులకు అదే ప్లాటు ఇప్పుడు కేటాయించడం ద్వారా ఆ రేటు 4రెట్లు పెరిగిన నేపథ్యంలో వారికి ఇది ప్రభుత్వం చేసిన గొప్ప సాయమన్నారు. ఈ సువర్ణావకాశం వల్ల మొత్తం 420మందికి పైగా పారిశ్రామికవేత్తలకు సంబంధించి జరిగిన మేలును లెక్కిస్తే ఆ విలువ రూ.68 కోట్ల రూపాయల వరకూ ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ వీసీ & ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, ఏపీఐఐసీ సీజీఎం(అసెట్ మేనేజ్ మెంట్) లచ్చిరామ్, ఏపీఐఐసీ జీఎంలు గెల్లి ప్రసాద్, నాగ్ కుమార్, ఏపీఐఐసీ కృష్ణా జోనల్ మేనేజర్ శ్రీనివాస్, ఏపీఐఐసీ గుంటూరు జోనల్ మేనేజర్ గోపి కృష్ణ, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.