– సినీ, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్
– వర్ధంతి సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
విజయవాడ: ఎన్టీఆర్ది మరణం లేని జననం. ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి వన్నె తెచ్చారు. చలన చిత్రంలో కేవలం రంగులు వేసే వారికే మాత్రమే గుర్తింపు వుండేది. కానీ ఎన్టీఆర్ సినీ రంగంలోకి అడుగు పెట్టిన తరువాత సినీ చరిత్రకి కొత్త గుర్తింపు తెచ్చారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె శనివారం ఇక్కడి ఎన్టీఆర్ సర్కిల్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడారు. సినీ రంగంలో మాదిరిగానే రాజకీయాల్లో కూడా తనకంటూ కొత్త చరిత్ర రాశారు.
మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పేదల కోసం రెండు రూపాయలకి కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మాండలిక వ్యవస్థను తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు, ఆంధ్రుల ఆత్మ గౌరవం తీసుకువచ్చారు. జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలి అని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బీజేపీ నేతలు కిలారు దిలీప్, భోగవల్లి శ్రీధర్, కోలపల్లి గణేష్, మాదల రమేష్, పోతం శెట్టి నాగేశ్వరరావు, బుల్లబ్బాయ్, పట్నాయక్, సునీత, సుమతి తదితరులు పాల్గొన్నారు.