– ఉప సభాపతికి గౌరవం ఇవ్వరా?
– కోర్టు తీర్పుకు అనుగుణంగా ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చే ఆక్రమణల తొలగింపు
– కామ్రేడ్లపై కస్సుమన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
విశాఖపట్నం: ఉండి నియోజకవర్గ పరిధిలో కాలువ గట్లపై ఆక్రమణల తొలగింపులో కోర్టు తీర్పును తూచా తప్పకుండా పాటిస్తూ, నిర్వాసితులకు ఆల్టర్నేటివ్ సైట్లను , ఇండ్ల నిర్మాణం కోసం గ్రాంట్లు మంజూరు చేసిన తర్వాతే తొలగిస్తున్నట్లుగా శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో ఇండ్ల తొలగింపు పై కామ్రేడ్లు చేస్తున్న ఆరోపణలని ఒక మీడియా ప్రతినిధి ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఉండి నియోజకవర్గ పరిధిలో కాలువ గట్లు, రోడ్డు మధ్య పెద్ద ఎత్తున గతంలో ఆక్రమణలు జరిగినట్లు తెలిపారు. కాలువ గట్లపై ఇండ్లు నిర్మించుకున్న వారు బాత్రూమ్ ల నిర్మాణం కోసం, ఇతరాత్ర అవసరాల కోసం కాలువలను పూర్తిగా ఆక్రమించారన్నారు. కాలువ గట్లను ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకున్న వారు వదులుతున్న వ్యర్ధాలు మంచినీటి కాలువలలో కలిసిపోయి, చెరువులలోకి వెళ్లి కలుస్తున్నాయన్నారు. ఆ కలుషిత జలాలు సేవించిన గ్రామస్తులు అంతుచిక్కని వ్యాధులతో మంచాన పడుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల వ్యవధిలోనే దుంపగడప అనే గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో ఒక బాలిక మృతి చెందిందన్నారు. కామ్రేడ్స్ వచ్చి ఆందోళన చేశారన్నారు. అసలు విషయం ఏమిటని ఆరా తీయగా… కలుషిత జలాలే కారణమని తెలిసిందన్నారు. దుంపగడప గ్రామంలో 200 నుంచి 250 గృహా లు కాలువ గట్లను ఆక్రమించి నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. వీరందరికీ గత ప్రభుత్వ హయాంలో ప్లాట్లను మంజూరు చేయడం జరిగిందని వివరించారు.
ఎవరో కొద్దిమందికి ప్లాట్లు ఇవ్వలేదని , ఆ తర్వాత వారికి కూడా ప్లాట్లను ఇవ్వడం జరిగిందన్నారు.. అయినా కొంతమంది కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వివరించడం జరిగిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇటీవల మరొక గ్రామంలో కాలువ గట్లను ఆక్రమించుకున్న ఇండ్లను తొలగిస్తే, ఎవరైనా చనిపోతే వచ్చే ప్రశ్నించే కమ్యూనిస్టులే ఇప్పుడు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.. కాలువ గట్లను ఆక్రమించిన వారికి చట్ట ప్రకారం ఆల్టర్నేటివ్ సైట్లను కేటాయించి, ఇండ్ల నిర్మాణానికి గ్రాంట్లు మంజూరు చేసిన తర్వాతే తొలగిస్తున్నామన్నారు .
తాగు నీటి కాలువలు, చెరువులను కలుషితం చేయవద్దని స్పష్టమైన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, నీటి వనరులను ఆక్రమించవద్దని న్యాయస్థానాలు చెబుతున్నప్పటికీ… పేదల ఇండ్లు కూల్చి వేస్తున్నారని కమ్యూనిస్టులు ఆరోపించడం ఎంతవరకు సమంజసం అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఒక్కొక్కరు రెండు ఇండ్లు ఉన్నవారు కూడా తమ ఇండ్లను అద్దెకు ఇచ్చుకొని కాలువ గట్లకు పై నివాసం ఉంటున్నారని, లేకపోతే కాలువగట్లలోని ఇళ్లను అద్దెకు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి సైట్లలో ఇళ్ల నిర్మాణం చేసుకొని అక్కడ ఉంటున్నారన్నారు.
చట్ట ప్రకారం ముందుకు వెళుతున్నప్పటికీ, కామ్రేడ్స్ గొడవకు వస్తే తాను ఏమి చేయగలనని ఎదురు ప్రశ్నించారు. ఇంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నప్పటికీ , తనపై వ్యక్తిగత విమర్శలను చేయడం పట్ల రఘురామ కృష్ణంరాజు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఖబర్దార్ అంటూ తనను హెచ్చరించడం కాకుండా, తనని క్షమాపణలు చెప్పాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.
మీరు కోరుకున్నారు కదా అని నేను చేసే పని ఆపను … తీసివేయాలంటే తీసివేయాల్సిందేనని, చట్ట ప్రకారం ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చిన తరువాతే కోర్టు ఆదేశాల మేరకే తీసివేయడం జరుగుతుందన్నారు. అయినా ఇండ్ల ను కొట్టేస్తానంటున్నాడని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కమ్యూనిస్టులు లేఖలు రాస్తున్నారన్నారు. తాజాగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కూడా లేఖ రాసినట్లుగా సాక్షి దినపత్రికలో చదివానని ఎద్దేవా చేశారు.