-
కేసు రీ ఓపెన్ చేసిన ప్రభుత్వం
-
ఆ మేరకు ఎస్పీ బిందుమాధవ్ను కోరిన ఏబీవీ
-
సిట్ అధికారిగా దేవరాజ్ పాటిల్
-
వేగంగా నిర్ణయం తీసుకున్న కాకినాడ ఎస్పీ బిందుమాధవ్
-
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్ను కోరిన ఏబీ వెంకటేశ్వరరావు
-
హత్య కేసుపై కలెక్టర్ షణ్మోహన్తో చర్చించిన ఏబీవీ
-
కుటుంబానికి న్యాయం చేయాలని సూచన
-
సుబ్రమణ్యం సొదరుడికి ఉద్యోగం ఇస్తామన్న కలెక్టర్
-
3 సెంట్ల ఇంటిస్థలం, రెండు ఎకరాల సాగుభూమికి అంగీకారం
-
జగన్ బాధిత కేసుల్లో ‘ఏబీవీ ఎఫెక్ట్’
(మార్తి సుబ్రహ్మణ్యం)
పోలీసు అధికారి నుంచి రాజకీయ నాయకుడి అవతారమెత్తిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు రెండవ అడుగు.. ప్రభావం అ‘ద్వితీయం’గా పనిచేసింది. తొలుత అమలాపురం వెళ్లి జగన్ బాధితుడయిన కోడికత్తి శీను కుటుంబాన్ని పరామర్శించిన ఏబీవీ.. మళ్లీ ఇప్పుడు రెండవ అడుగువేసి.. కాకినాడ జిల్లా వెళ్లి, వైసీపీ ఎమ్మెల్సీ చేతిలో హత్యకు గురైన డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి న్యాయం జరిగేలా తనకు చేతనయింత సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఏబీ పరామర్శించిన కోడికత్తి శ్రీను, డ్రైవర్ సుబ్రమణ్యం ఇద్దరూ దళితులు కావడం.. ఇద్దరిదీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కావడం ప్రస్తావనార్హం.
ఆ క్రమంలో ఆయన అందరి నాయకుల మాదిరిగా..బాధిత కుటుంబాన్ని పరామర్శించి పూలదండ వేయించుకుని, చప్పట్లు కొట్టించుకుని, ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లలేదు. వారి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎస్పీ-కలెక్టర్తో స్వయంగా భేటీ అయ్యారు. ఏబీవీ తొలుత కాకినాడ ఎస్పీ బిందుమాధవ్తో భేటీ అయ్యారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసుకు సంబంధించిన చార్జిషీట్పై చర్చించారు. చార్జిషీట్పై తనకున్న సందేహాలన్నీ ఎస్పీతో చర్చించారు. ఎక్కడెక్కడ లోపాలున్నాయో వివరించారు. దానిపై స్పందించిన ఎస్పీ బిందుమాధవ్.. సుబ్రమణ్యం హత్య కేసుపై సిట్ వే స్తున్నట్లు ప్రకటించారు. దేవరాజ్ పాటిల్ను విచారణ అధికారిగా నియమిస్తూ, సిట్ ఏర్పాటుచేశారు.
ఇదే సందర్భంలో డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్ధిక కష్టాలను, కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ను కలసి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కుటుంబానికి ఆధారమైన సుబ్రమణ్యం హత్యకు గురికావడంతో వారి కుటుంబపోషణ కష్టంగా మారిందన్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ఏబీ కోరారు.
తర్వాత దానికి స్పందించిన కలెక్టర్… డ్రైవర్ సుబ్రమణ్యం సోదరుడికి ఉద్యోగం, 3 సెంట్ల ఇంటి స్థలంతోపాటు రెండు ఎకరాల సాగుభూమి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
అందరి రాజకీయ నాయకుల మాదిరిగా.. వెనుక అనుచర గణం లేకపోయినా, జగన్ మళ్లీ సీఎం కాకూడదన్న ఏకైక లక్ష్యంతో రాజకీయ రంగంలోకి దిగిన ఒంటరి సేనాని ఏబీవి పోరాటానికి, వెంటనే స్పందన- ఫలితం కనిపించడం విశేషం. కీలకమైన అంశాలను ఎంచుకుని, ఆ మేరకు జగన్ బాధితుల వద్దకు వెళుతున్న ఏబీ.. ఆయా సందర్భాల్లో ప్రస్తావిస్తున్న అంశాలపై, ప్రభుత్వం వేగంగా స్పందిస్తున్న తీరు.. ఆయనలో సమరోత్సాహం నింపేదే! ఏబీవీ.. ఆల్ ది బెస్!!