– సిట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరిన ఏబీ
– చార్జిషీట్ ఎమ్మెల్సీని బయటపడేసేందుకే
– ఎఫ్ఐఆర్, చార్జిషీట్కు పొంతన లేదు
– బెదిరింపులతో కుటుంబాన్ని గ్రామానికి తరిమారు
– బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ డీజీ ఏబీవీ
– దర్యాప్తులో పోలీసుల తీరుపై అసంతృప్తి
– అధికార మదంతో వారి బతుకులను నాశనం చేశారు
– వారికి జరిగిన నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత
– ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే
– కాకినాడ కలెక్టర్ షణ్మోహన్తో ఏబీ
– మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్
కాకినాడ: వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య భాస్కర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తూ ఆయన చేతిలో హత్యకు గురయి, శవాన్ని డోర్ డెలివరీ చేసిన సుబ్రమణ్యం కేసు నత్తనడక నడవంపై మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చార్జిషీట్ ఎమ్మెల్సీని కాపాడేందుకు ఉంది తప్ప, బాధితుడికి న్యాయం చేసేలా లేదని మండిపడ్డారు. ఆ కేసును ప్రభుత్వం మళ్లీ రీ ఓపెన్ చేయాలని, ఆ మేరకు తాను ఎస్పీని కలసి కోరినట్లు వెల్లడించారు.
ఈ కుటుంబానికి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించి, పరిహారం అందించాలని సూచించారు. కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలోని సుబ్రహ్మణ్యం నివాసానికి వెళ్లిన ఆయన, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబసభ్యులను పరామర్శించిన ఏబీవీ, అనంతరం మీడియాతో మాట్లాడారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన అన్ని వివరాలు, కోర్టులో దాఖలు చేసిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించానని.. ఈ కేసు దర్యాప్తు పూర్తిగా లోపభూయిష్టంగా జరిగిందని, కేసును నీరుగార్చే విధంగా దర్యాప్తు నివేదికలు రూపొందించారని ఆరోపించారు.
ఎఫ్ఐఆర్ కు, చార్జిషీట్ కు మధ్య ఎక్కడా పొంతన లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసుశాఖ చరిత్రలోనే మచ్చగా మిగిలిపోయే దర్యాప్తు ఇది. ఇలాంటి దర్యాప్తు నా ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎఫ్ఎఆర్కు, ఛార్జ్ షీట్కు సంబంధం లేదు.మధ్యవర్తులు చెప్పేదానికి, ఎస్పీ వాదనకు పొంతన లేదు.
ఛార్జ్షీట్ వీగిపోయేలా, కేసు కొట్టేసేలా పోలీసులు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, కోర్టు అనుమతి తీసుకుని ఈ కేసును ప్రభుత్వం మళ్లీ రీ ఓపెన్ చేయాలని, కేసు పూర్తి నిజానిజాలు వెలికితీయడానికి, సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అధికార మదంతో, బెదిరింపులతో ఈ కుటుంబాన్ని కాకినాడ నుంచి ఇక్కడికి తరిమివేశారు. అక్కడ అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిచేసుకునే పరిస్థితి నుంచి, ఈరోజు ఈ చిన్న గ్రామంలో ఇళ్లలో పాచిపని చేసుకుని బతకాల్సిన దుస్థితికి నెట్టారు. వారి బతుకులను నాశనం చేశారు అని సుబ్రహ్మణ్యం కుటుంబం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ఏబీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటిదాకా ఎవరూ రాలేదు: ఏబీతో కుటుంబసభ్యుల వేదన
డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏబీవీ వస్తున్నారని తెలియడంతో అనేక మంది దళిత కుటుంబాలు అక్కడికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఏబీవీ, తనకు చేతనయింత మేరకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని, ఆ మేరకు ప్రభుత్వంపై తనకున్న మార్గాల్లో ఒత్తిడి చేస్తానని హామీ ఇచ్చారు.
కాగా ఇప్పటివరకూ తమ గురించి ఒక్కరు కూడా ఆలోచించలేదని, తమ కుటుంబ పరిస్థితుల గురించి ఎవరూ విచారించలేదని, తమకు న్యాయం చేసేందుకు వచ్చిన మీకు రుణపడి ఉంటామని సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు ఏబీవీ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
అక్కడికి వచ్చిన దళిత కుటుంబాలు సైతం.. ప్రభుత్వం మారినప్పటికీ, ఈ కేసులో తమకు న్యాయం జరగడం లేదని ఫిర్యాదు చేశారు.