-
విజయసాయిరెడ్డి సీటు బీజేపీకే
-
అమిత్షాతో బాబు భేటీ
-
అన్నామలైకే ఎక్కువ అవకాశాలు?
-
తమిళనాడు ఎన్నికలే కారణం
-
గతంలో గరికపాటికి నద్దా హామీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడ్డ రాజ్యసభ స్థానాన్ని కూటమి బీజేపీకి కేటాయించింది. వైసీపీ నుంచి రాజీనామా చేసే స్థానాలకు ఒకసారి టీడీపీ, మరోసారి బీజేపీకి కేటాయించాలన్న ముందస్తు ఒప్పందం ప్రకారం, ఇప్పుడు విజయసాయి స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్లు స్పష్టమవుతుంది. తాజాగా విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన చంద్రబాబు, కేంద్రహోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. చర్చల్లో రాజ్యసభ సీటు బీజేపీకి కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
కాగా బీజేపీలో రాజ్యసభ స్థానం కోసం ప్రధానంగా ముగ్గురి పేరు వినిపిస్తోంది. వారిలో కేంద్రమాజీ మంత్రి స్మృతి ఇరానీ, తమిళనాడు బీజేపీ నేత అన్నామలై, తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపి గరికపాటి మోహన్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రానున్న రాజ్యసభ ఎన్నికలో ఏపీ నుంచి ఖాళీ అయిన ఒక స్థానం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో, అక్కడ అన్నాడిఎంకెతో కలసి పోరుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే డిఎంకె సర్కారుపై దూకుడుగా వెళుతున్న అన్నామలై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అన్నామలై తన ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పార్టీ పగ్గాలందుకున్న తర్వాత తమిళనాడులో బీజేపీ ఊపందుకుంది. ప్రధానంగా యువత పార్టీ వైపు ఆకర్షితులవడం పెరిగింది.
అన్నామలై సోషల్మీడియాను విస్తృతంగా వినియోగించుకోవడంతో, హిందువుల్లో చైతన్యం పెరిగి అది ఏకీకరణకు కారణమయింది. పైగా డిఎంకె ప్రభుత్వ అవినీతిపై అన్నామలై విరుచుకుపడుతున్న తీరు, తటస్థులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో పార్టీ బలోపేతానికి అన్నామలైకు ఏపీ నుంచి రాజ్యసభ ఇవ్వవచ్చన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఫైర్బ్రాండ్గా పేరున్న స్మృతికి సీటు ఇవ్వడం ద్వారా , కాంగ్రెస్ను ఆమెపై ప్రయోగించవచ్చన్నది నాయకత్వ యోచన అంటున్నారు. లోకసభలో కాంగ్రెస్కు తన ప్రసంగాల ద్వారా చెమటలు పట్టించే ఫైర్బ్రాండ్గా ఆమెకు పేరుంది. అదీగాక కార్యకర్తలతో మమేకమయ్యే లక్షణాలున్న స్మృతి ఇరానీ వల,్ల ఏపీలో పార్టీకి ఉపయోగం ఉంటుందన్నది మరో అభిప్రాయంగా కనిపిస్తోంది. ఆమెకు ప్రధాని మోదీ ఆశీస్సులుండటం ప్లస్ పాయింటని చెబుతున్నారు.
తెలుగువాడు, ఆర్గనైజర్గా పేరున్న పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు పేరు కూడా రాజ్యసభకు వినిపిస్తోంది. భారీ బహిరంగసభలు, రోడ్షోలు, భారీ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు.. జనసమీకరణలో నిష్ణాతుడిగా పేరొందిన గరికపాటికి, గతంలోనే రాజ్యసభ సీటుపై జాతీయ అధ్యక్షుడు నద్దా హామీ ఇచ్చారన్న ప్రచారం ఉంది. అదీగాక ఆయనకు సీటు ఇవ్వాలని తెలంగాణ బీజేపీ అగ్రనేతలంతా గతంలోనే పార్టీకి సిఫార్సు చేశారు.
నిజానికి ఆయనకు కర్నాటక నుంచి రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం గతంలోనే జరిగిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిన కమ్మ వర్గానికి చెందిన గరికపాటికి సీటు ఇవ్వడం ద్వారా, ఏపీలోని కమ్మ వర్గాన్ని పార్టీ వైపు ఆకర్షితులను చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రానున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు.. రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని కమ్మ సామాజికవర్గాన్ని పార్టీ వైపు ఆకర్షితులను చేసేందుకు గరికపాటి ఉపయోగపడతారన్న అంచనా కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు.