Suryaa.co.in

Telangana

హెరాల్డ్ ఆస్తులను కొట్టేసిన సోనియా కుటుంబం

– వారిపై విచారణ జరపవద్దా?
– ఈడీ ప్రాథమిక విచారణలోనే సోనియా, రాహుల్ గాంధీ ముద్దాయిలు
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్: భారత దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోంది. కానీ కాంగ్రెస్ నేతలు తమ గతంలోని అవినీతి చర్యల వల్ల జైలుకు వెళ్లే పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ముందుగానే బెయిల్ తీసుకుంటున్నారు.

రాహుల్ గాంధీ గా ఒక కేసులో శిక్షను ఎదుర్కొనగా, మరో కేసులో బెయిల్ తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఇప్పటికే బెయిల్ పై ఉన్నారు.

సోనియా గాంధీ కుటుంబం బోఫోర్స్ కుంభకోణం, 2జీ స్కాం, హెలికాప్టర్ కుంభకోణం, కామన్‌వెల్త్ స్కాం లాంటి ఎన్నో అవినీతి కేసుల్లో వేల కోట్ల రూపాయలను, దేశ సంపదను లూఠీ చేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కొన్ని అవినీతి కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో 90 కోట్ల రూపాయల విలువ గల షేర్లను కేవలం 50 లక్షలకే కొనుగోలు చేసి అనేక నగరాల్లో ఉన్న వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ నాయకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశంపై విచారణ జరగకూడదా? అవినీతిపై చర్యలు తీసుకోవడం తప్పా?

పాట్నా, లక్నో, ఢిల్లీ, బొంబాయిలో ఉన్న వేలకోట్ల రూపాయల నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాంగ్రెస్ పార్టీలోని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వారి కుటుంబం కాజేసింది. లక్షల కోట్ల రూపాయలతో అవినీతికి పాల్పడిన వారిపై విచారణ జరపొద్దా..? అంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అవినీతి చేయొచ్చు కాని విచారణ జరపొద్దా? వారిపై చర్యలు తీసుకోవద్దా?

బెయిల్ పై ఉన్న సోనియా, రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారంతో అప్రతిష్టపాల్జేయాలని ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఈడీ ప్రాథమిక విచారణలోనే సోనియా, రాహుల్ గాంధీ ముద్దాయిలుగా తేలారు. వారి అవినీతి చరిత్రను దేశ ప్రజలు గమనించారు. అందుకే దేశం అంతటా “కాంగ్రెస్ ముక్త్ భారత్” నినాదం మార్మోగుతోంది.

గాంధీ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కుటుంబం.. ఇందిరాగాంధీ కుటుంబం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు అసభ్య పదజాలంతో, సభ్యత లేకుండా, హేళనగా మాట్లాడిన తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ తరహా మాటలు కాంగ్రెస్ నాయకులకు తగవు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల భాష మార్చుకోవాలి.

అద్దంకి దయాకర్ కొత్తగా ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన స్థాయికి మించి ప్రధాని మోదీ పై అమిత్ షా పట్ల అవమానకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక టీవీ చానెల్‌లో “పాకిస్తాన్ అంటే ఇష్టం, భారత్ అంటే ఇష్టం లేదు” అని వ్యాఖ్యానించిన వ్యక్తి ఇప్పుడు దేశభక్తులపై హేళనగా మాట్లాడటం దురదృష్టకరం.

దేశ ప్రజలు మూడు సార్లు కాంగ్రెస్ పార్టీని ఓడించారు. కేవలం కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రమే అధికారం ఉంది. త్వరలో అక్కడ కూడా కాంగ్రెస్ కనుమరుగవుతుంది. సోనియా, రాహుల్ గాంధీ కుటుంబం దేశాన్ని లూఠీ చేసింది. లక్షలకోట్ల రూపాయలను కాజేసింది. వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు.

కాంగ్రెస్ నాయకులు జైలుకు పోవాల్సిన వారికి వకాలతు పుచ్చుకోవడం సబబు కాదు. సోనియా గాంధీ కుటుంబం చేసిన అవినీతిపై ఈడీ విచారణను వేగవంతం చేసి, న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని బిజెపి కోరుతోంది.

LEAVE A RESPONSE