నలుగురు కానిస్టేబుల్ లను దుస్తులు విప్పించి కూర్చోబెట్టిన విజయనగరం ఎస్పీ అరుణ్

– పేకాట శిబిరంలో సొత్తు కాజేసిన వారిపై కేసు నమోదు.. నిందితులకు రిమాండ్‌

చోరీ కేసులు, ఇతర క్రిమినల్‌ కేసు నిందితులను పోలీసులు దుస్తులను విప్పించి స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని తరచూ చూస్తూంటాం. కానీ.. పోలీసుల దుస్తులనే ఊడదీసి.. స్టేషన్లో కూర్చోబెట్టారు విజయనగర జిల్లా ఎస్పీ అరుణ్‌. విజయనగర పట్టణంలోని చలవారి కాలనీలో వెంకటేశ్‌ మరికొందరు రాత్రి పేకాడుతున్నారు. విషయం తెలిసి మహేష్‌, అభిషేక్‌, మంజునాథ్‌, శ్రీకాంత్‌ అనే నలుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లు పేకాట శిబిరంపై దాడి చేశారు.

రూ.20 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ స్వాఽధీనం చేసుకున్నారు. కానీ కేసు నమోదు చేయలేదు. స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్‌ను స్టేషన్‌లో అప్పగించలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం పోలీస్టేషన్‌కు వెళ్లిన పేకాటరాయుడు వెంకటేశ్‌, తన సెల్‌ఫోన్‌ ఇవ్వాలని పోలీసులను అడిగాడు. రికార్డులను పరిశీలించిన పోలీసులు, అలాంటి కేసేదీ నమోదు కాలేదని తెలిపారు. దీంతో వెంకటేష్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం ఎస్పీ వరకూ వెళ్లింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు.

పేకాట శిబిరంపై జరిగిన దాడి, నగదు, సెల్‌ఫోన్‌ కాజేసినట్లు తేలడంతో జూదరుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. నలుగురు కానిస్టేబుళ్లపైనా ఎస్పీ కేసు నమోదు చేయించారు. ఎస్పీ, కానిస్టేబుళ్ల దుస్తులను విప్పించి రెండు గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టారు. వారిని సస్పెండ్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply