శ్రీలంకలో రెండు వారాల షట్ డౌన్

– అత్యవసరం కాని సేవలు నిలిపివేత

శ్రీలంకలో చమురు నిల్వలు వేగంగా పడిపోతుండటంతో..వాటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం అత్యవసరం కాని సేవలను సోమవారం నుంచి రెండువారాలు నిలిపివేసింది. దీనిలో భాగంగా పాఠశాలలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఆసుపత్రులు, కొలంబో నౌకాశ్రయం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి.

ఇక పెట్రోల్‌ పంపుల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి ఉన్నాయి.శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ఆందోళనలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. తాజాగా అక్కడ అధ్యక్ష సచివాలయ కీలక ద్వారాలను ఆందోళనకారులు చుట్టుముట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి ప్రధాన ద్వారాన్ని ఆందోళన కారులు దిగ్బంధించారు. తాజాగా రెండు ఎంట్రీపాయింట్లను కూడా వారు దిగ్బంధించారు. ‘గొట గో గమ’ నినాదాలతో చేపట్టిన ఆందోళన 73వ రోజుకు చేరింది.

నిన్న రాత్రి ఆందోళనకారులు ఈ రెండు ఎంట్రీపాయింట్లను ముట్టడించడంతో దాదాపు 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వీరిలో ఒక బౌద్ధమత సన్యాసి , నలుగురు మహిళలు ఉన్నారు. తాజాగా వీరు ముట్టడించిన ఎంట్రీ పాయింట్లలో కీలకమైన ఆర్థికశాఖ, ప్రభుత్వ ఖజానా విభాగాలు ఉన్నాయి. ఆర్థికశాఖను ఐఎంఎఫ్‌ బృందం సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు హుటాహుటిన ఆ ప్రదేశం నుంచి ఆందోళనకారులను తరలించారు. బెయిల్‌ ఔట్‌ ప్రోగ్రామ్‌పై చర్చించేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి బృందం ప్రస్తుతం శ్రీలంకకు రానుంది.

శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి అత్యంతదారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 50 బిలియన్‌ డాలర్ల రుణ చెల్లింపుల తేదీలను పొడిగించాలని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా భారత్‌ సాయం చేస్తోంది. ఈ క్రమంలో జులై నుంచి నాలుగు నెలల పాటు ఇంధన కొనుగోళ్లకు కూడా క్రెడిట్‌ లైన్‌ ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమైందని లంక ప్రధాని విక్రమసింఘే ఇటీవల వెల్లడించారు. ఇప్పటికే భారత్‌ నుంచి 3,500 టన్నుల ఎల్‌పీజీ అక్కడకు చేరుకొంది.

Leave a Reply