Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ నిలిపివేయండి

– సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసే వరకు తదుపరి విచారణ జరపద్దని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. మార్గదర్శి కేసులన్నీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓఖా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది.

ఒకే రకమైన అంశంపై పలు కేసులు పెట్టారని మార్గదర్శి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కొన్ని కేసులు తెలంగాణ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోగా మరికొన్ని కేసులు పెట్టి ఏపీ హైకోర్టులో విచారణ జరుపుతున్నారు. ఒక కేసులో సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టులో తదుపరి విచారణ జరపాలని ఆదేశించింది. కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌ హైదరాబాద్‌లో జరిగినట్టు ఉన్నందున అన్ని కేసుల విచారణ ఒకే చోట జరగాలని లూథ్రా వాదించారు. లూథ్రా వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2వ తేదీ లోపు కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, సీఐడీని ఆదేశించింది.

LEAVE A RESPONSE