Suryaa.co.in

Andhra Pradesh

సూపర్ – 6 పథకాల ప్రచారం ప్రతి గడపను తాకాలి

– వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి
– ఇల్లు లేని వారికి సొంతిళ్లు నిర్మించే బాధ్యత నాది
– పనితీరు ప్రామాణికంగానే పదవులు
– గెలుస్తున్నాం అని నిర్లక్ష్యం వద్దు
-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
– క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో లోకేష్ భేటీ

ఉండవల్లి : బాబు సూపర్-6లో పొందుపరిచిన హామీలను ప్రతి గడపకు వెళ్లి తెలియజేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. సూపర్-6 అనేది పేద, మధ్యతరగతి ప్రజల మేనిఫెస్టో అని అన్నారు. తాడేపల్లి పట్టణం, తాడేపల్లి రూరల్, మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్, దుగ్గిరాల మండలాలకు చెందిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జిలతో బుధవారం ఉండవల్లిలో విడివిడిగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో రైతాంగం, మహిళలు, యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలను నేతలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం… లోకేష్ మాట్లాడుతూ….‘‘2019లో ఎన్నికల సమయంలో కేవలం 20 రోజులు ముందు మాత్రమే మంగళగిరి నియోజకవర్గానికి వచ్చా..దీంతో నియోజకవర్గ ప్రజలకు చేరువ కాలేకపోవడంతోనే ఓడిపోయాం. అయినా ఐదేళ్లుగా మంగళగిరిలో తిరిగుతూ సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో అమలు చేస్తున్నా. గెలిస్తే ఇంకెంత సంక్షేమాన్ని అమలు చేస్తానో ప్రజలకు వివరించండి.

నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గతంలో వేరు…ఇప్పుడు వేరు. బూత్, క్లస్టర్, యూనిట్ వారీగా ఎవరు పని చేస్తున్నారో పరిశీలిస్తున్నా. 80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది…80 ఏళ్లు ఎవరు పైబడిన వారు ఉన్నారో గుర్తించి వారితో ఓటు వేయించేలా ప్రయత్నించండి. కొంతమంది ఓటర్లు ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లి ఉంటారు…వారి ఓట్లు ఉన్నాయా…తొలగించారా…దొంగఓట్లు చేర్చారా అన్నది పరిశీలన జరగాలి. మంగళగిరిలో నేను గెలిస్తే కాల్వకట్టల వెంబడి ఇళ్లు తొలగిస్తారని తప్పుడు ప్రచారం చేశారు.

కానీ గెలిచాక వైసీపీ నేతలే మంగళగిరి నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో పేదల ఇళ్లు కూలగొట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద పేదలు ఉండటమే నేరం అన్నట్లు అర్థరాత్రి పేదలను బయటకు తరిమి ఇళ్లు కూల్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల తొలగింపు ఎట్టి పరిస్థితుల్లో జరగదు…వారికి పట్టాలు అందిస్తాం..వసతులు కూడా కల్పిస్తాం. సొంతిళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఇంటికి పట్టాలు లేని వారికి పట్టాలు కూడా అందిస్తాం. అటవీ భూముల్లో, రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం.

పక్కనే కృష్ణానది ఉన్నా తాగునీటి సమస్యకు ఇబ్బంది పడుతున్నారు..సరైన మౌళిక సదుపాయలు పలుచోట్ల ఇంకా లేవు. అధికారంలోకి వచ్చాక వాటిని యుద్ధప్రాతిపదికన కల్పిస్తా. ఇప్పటికే ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం…అధికారంలోకి వచ్చాక స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. మంగళగిరి మోడల్ నియోజకర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. గత ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. రాజధాని మార్పుతో తాడేపల్లి పట్టణ, రూరల్ ప్రజలు నష్టపోయారు.

ఐదేళ్లుగా విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి ప్రజలను పట్టించుకోలేదు….ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు.? మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అధికారంలోకి వచ్చాక తాడేపల్లి, ఉండవల్లి పరిధిలో యూ1 జోన్ ఎత్తేస్తాం. సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు..ఆ వ్యవస్థలను రద్దు చేసే ఉద్దేశం మాకు లేదు. వాటిని స్థానిక సంస్థలతో కలిసి పని చేసే విధంగా బలోపేతం చేస్తాం.

రైతుల, స్వర్ణకారులు, చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది..అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తాం. పని తీరు ప్రామాణికంగానే పదవులు ఇస్తాం…కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా…ఆదుకుంటా. ఈ ప్రభుత్వం పథకాలు రద్దు చేస్తోంది…మన ప్రభుత్వం వచ్చాక మళ్లీ అందిద్దాం. గెలుస్తున్నాం అని నిర్లక్ష్యం వద్దు.’ అని లోకేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE