Home » ఆరుగురు ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షులపై వేటు

ఆరుగురు ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షులపై వేటు

– రెండో దశలో మరో ఐదుగురిపై వేటుకు సిద్ధం?
– కోర్‌ కమిటీలో చర్చించకుండానే అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం
– ఆరుగురు అధ్యక్షులూ కన్నా హయాంలోని వారే
– ఇద్దరు రాష్ట్ర నేతల రాజీనామా
– ఏకపక్ష నిర్ణయాలంటూ శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి రాజీనామా లేఖ
– రాజీనామా బాటలో మరికొందరు నేతలు?
– సోము, సునీల్‌ ఏక పక్ష నిర్ణయాలపై ఢిల్లీకి ఫిర్యాదు?
– రాష్ట్ర అధ్యక్షుడు మారకుండా జిల్లా అధ్యక్షుల మార్పేంటి?
– తమకు తెలియకుండా జిల్లా అధ్యక్షులను నియమించడంపై సీనియర్ల సీరియస్‌
– గతంలో తమతో చర్చించి నిర్ణయం తీసుకున్నారంటున్న కోర్‌ కమిటీ సభ్యులు
– సంఘటనా మంత్రి నిర్లిప్తతపై జిల్లా నేతల ఆగ్రహం
– అధ్యక్షుడి నిర్ణయాలకుఆయన ఆమోదముద్ర వేస్తున్నారంటూ అసంతృప్తి
– సంఘటనా మంత్రి మధుకర్‌జీని మార్చాలంటున్న సీనియర్లు
– అధ్యక్షుల తొలగింపుపై నిజమైన సూర్య జోస్యం
– ఏపీ బీజేపీలో కమిటీల కిరికిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనుకున్నదే అయింది. ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుపై‘‘ సూర్య’’ చెప్పిందే జరిగింది. 11 మంది జిల్లా అధ్యక్షుల మార్పుపై ‘‘సూర్య’’ కథనం నిజమయింది. తొలిదశలో 6గురు జిల్లా అధ్యక్షులను మార్పుస్తూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. రెండో దశలో మరో ఐదుగురిని మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తొలగించిన వారిలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గానికి చెందిన వారే కావడం విశేషం. కాగా ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షులను మారుస్తున్నారంటూ ‘‘సూర్య’’ లో ఇటీవలే ప్రత్యేక కథనం వెలువడిన విషయం తెలిసిందే.

ఏపీ బీజేపీలో జిల్లా అధ్యక్షుల మార్పు వ్యవహారం ఆ పార్టీలో అసంతృప్తి- అసమ్మతికి దారితీసింది. తమను సంప్రదించకుండా అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్‌ దియోథర్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా , రాష్ట్ర కార్యవర్గ సభ్యులయిన రెడ్డి నారాయణరావు – చిగురుపాటి కుమారస్వామి తమ పదవులకు రాజీనామా చేయడం, పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కుమారస్వామి శ్రీకాకుళ ం పార్టీ ఇన్చార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. మరికొంతమంది రాష్ట్ర నేతలు కూడా, రాజీనామా బాటలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ఉమామహేశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా డి.పరమేశ్వరరావు, రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిగా బొమ్ముల దత్తు, మచిలీపట్నం జిల్లా అధ్యక్షుడిగా గుత్తికొండ రాజబాబు, నర్సరావుపేట జిల్లా అధ్యక్షుడిగా ఆలోకం సుభాకర్‌, ఒంగోలు జిల్లా అధ్యక్షుడిగా శివారెడ్డిని నియమించారు. రెండో దశలో మరో ఐదు జిల్లా అధ్యక్షులను మార్చనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

సాంకేతికంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పదవీకాలం ముగిసే వరకూ తమను తొలగించే అధికారం లేదని చెబుతున్నారు. ఇప్పటివరకూ సభ్యత్వాలు ప్రారంభం కాలేదంటున్నారు. ‘నిజానికి అక్టోబర్‌లోనే సభ్యత్వాలు ప్రారంభం కావలసి ఉంది. కానీ అది జరగలేదు. సభ్యత్వాల తర్వాత మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటారు. అసలు రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం పూర్తవకముందే మమ్మల్ని ఎలా తొలగిస్తారు? ఈ కనీస పరిజ్ఞానం కూడా పార్టీని నడిపించేవారికి, పర్యవేక్షించేవారికి లేకపోవడమే విచారకం’ అని ఓ నాయకుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కాగా తమకు జరిగిన అవమానంపై పార్టీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అయిన సంఘటనా మంత్రి మధుకర్‌జీతో చర్చించేందుకు ఇష్టపడకపోవడం ఆశ్చర్యం. మధుకర్‌జీ తో మాట్లాడి ఉపయోగం లేదంటున్నారు. తమను మారుస్తున్నారన్న సమాచారం ఉన్న.. మరో ఐదుగురు జిల్లా అధ్యక్షులతో కలసి, వారంతా ఢిల్లీ పార్టీ నేతల వద్దకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా జిల్లా అధ్యక్షులు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మధుకర్‌జీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సంఘటనా మంత్రిగా ఉన్న మధుకర్‌జీ, స్వత ంత్రంగా పనిచేయడం లేదని.. సోము వీర్రాజు, సునీల్‌ దియోథర్‌ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారన్నది, చాలాకాలం నుంచి ఉన్న ఫిర్యాదు. తెలంగాణలో మంత్రి శ్రీనివాస్‌, గతంలో ఏపీ సంఘటనా మంత్రి రవీంద్రరాజు పనితీరులో .. మధుకర్‌జీ పదోవంతు కూడా, స్వతంత్రంగా పనిచేయడం లేదని అటు సీనియర్లు సైతం చాలాకాలం నుంచి విమర్శిస్తున్నారు.

సోము-సునీల్‌ నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడం తప్ప, జిల్లా-రాష్ట్ర నేతల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం, ఆ మేరకు రాష్ట్ర కమిటీకి దిశానిర్దేశం చేయడం లేదన్నది సీనియర్ల వ్యాఖ్య. చివరకు కోర్‌ కమిటీలో ఉన్న ప్రముఖులకు సైతం.. విలువ ఇవ్వని వాతావరణాన్ని.. మధుకర్‌జీ ఇప్పటివరకూ సరిదిద్దలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కీలకమైన జిల్లా అధ్యక్షుల మార్పు అంశంపై ఆయా జిల్లాలకు చెందిన రాష్ట్ర, జాతీయ కమిటీ నాయకులతో, సోము వీర్రాజు-సునీల్‌ దియోథర్‌ సంప్రదించిన దాఖలాలు లేవంటున్నారు. ప్రధానంగా కోర్‌ కమిటీలో ఎంపీలు, కేంద్రమాజీ మంత్రులు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న్పటికీ.. వారితో మాట మాత్రం చెప్పకుండా, జిల్లా అధ్యక్షులను తొలగించిన వైనం వివాదానికి దారితీసింది. అసలు కీలకమైన జిల్లా అధ్యక్షుల తొలగింపు-నియామక అంశంపై కోర్‌ కమిటీలో చర్చించని వైనాన్ని సంఘటనా మంత్రి మధుకర్‌జీ, రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించకపోవడమే దారుణమంటున్నారు. కృష్ణా జిల్లా నుంచి కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ మాధవ్‌, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా నుంచి కేంద్రమాజీ మంత్రి పురందీశ్వరి కోర్‌ కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి సైతం వారి జిల్లాల్లో జరిగిన అధ్యక్షుల మార్పు గురించి, సమాచారం లేకపోవడం విమర్శలకు దారితీసింది.

‘దీన్ని బట్టి మధుకర్‌జీ ఎంత స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్ధమవుతోందని’ తూర్పు గోదావరికి చెందిన ఓ సీనియర్‌ నేత వ్యంగ్యాస్త్రం సంధించారు. రాష్ట్ర నాయకత్వానికి- పార్టీ క్యాడర్‌కు అనుసంధానంగా ఉండి, సమస్యలు పరిష్కరించాల్సిన సంఘటనా మంత్రే స్వయంగా ఓ వర్గాన్ని బలపరచడం, విచారకరమంటున్నారు. ఈ దృష్ట్యా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేని మధుకర్‌జీని తొలగించి, ఆయన స్థానంలో.. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపే, మరొక నేతను నియమించాలన్న డిమాండ్‌కు తెరలేచింది.

ఇదిలాఉండగా, 11 మంది జిల్లా అధ్యక్షులతోపాటు, మరికొందరు రాష్ట్ర నేతలు ఈ వ్యవహారాన్ని.. ఢిల్లీ పార్టీ దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే ఆ మేరకు ఒక లేఖ సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఆ లేఖకు సమాధానం వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్లాలా? లేక ముందుగానే వెళ్లాలా? అన్న అంశం ఇంకా ఖరారు కానట్లు పార్టీ వ ర్గాల సమాచారం.

కాగా జిల్లా అధ్యక్షుల మార్పుపై అటు కోర్‌ కమిటీ సభ్యులు కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీలో కీలక నిర్ణయం తీసుకునేముందు, కోర్‌ కమిటీని సంప్రదించాలన్న విషయాన్ని, సోము-సునీల్‌ కావాలనే విస్మరిస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్రమంత్రి-ఏపీ ఇన్చార్జి మురళీధరన్‌ నిరాసక్త వైఖరి కారణంగానే, ఏపీ పార్టీలో ఇష్టారాజ్యం నడుస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తే, ఈ సమస్యలు వచ్చేవి కావంటున్నారు.

‘ మురళీధరన్‌జీ చాలా బిజీగా ఉండే నాయకుడు. ఆయన పేరుకు మా రాష్ట్ర ఇన్చార్జి అయినా ఎప్పుడూ పార్టీ వ్యవహారాలు పట్టించుకోరు. పార్టీకి సమయం ఇవ్వరు. బహుశా ఆయన బలవంతంగా, అయిష్టంగానే ఇన్చార్జిగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల కో ఇన్చార్జి సునీల్‌ దియోధర్‌ పెత్తనం పెరిగింది. సునీల్‌ ఎక్కువ సమయం ఇక్కడే కేటాయిస్తున్నారు. ఇన్చార్జి పట్టించుకోకపోవడం సునీల్‌కు వరంలా మారింది. అందుకే కొన్ని నిర్ణయాలు ఇన్చార్జికి సైతం తెలియకుండా తీసుకుంటున్నారు’ అని కృష్ణా జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ నేత విశ్లేషించారు.
bjp-letter1
bjp-letter2

Leave a Reply