ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, రచయిత, పర్యావరణ పోరాట నాయకుడు కె.ఎస్.రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా శుక్రవారం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు, భాష సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలు చర్చకు వచ్చాయి. పర్యావరణపరమైన విషయాల్లో, రైతాంగ పోరాటం, కన్నగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను రాధాకృష్ణన్ తెలియచేశారు.
పశ్చిమ కనుమలలో పర్యావరణ పరిరక్షణకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో చేసిన పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాజకీయంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి, నెడుమారన్, ఈవీకే సంపత్ లాంటి నాయకులతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు.
పవన్ కళ్యాణ్ ని సత్కరించి ‘కరుంగాలి కంబు’ను బహుకరించారు. కరుంగాలి కంబుకి ఇరువైపులా పవిత్రమైన పంచలోహాలతో కూడిన క్యాప్స్ ఉంటాయని రాధాకృష్ణన్ వివరించారు.