Suryaa.co.in

Telangana

కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా పాత సీసాలో పాత సారానే

-ఎమ్మెల్యేల అవినీతిని కేసీఆర్ సమర్థించారనే అనుకోవాలి
– పాచిపోయిన కూరను మళ్లీ వేడి చేసి ప్రజలకు అందించే ప్రయత్నం
– మహిళలకు జరిగిన అన్యాయాన్ని కవిత ఎలా సమర్థిస్తారు?
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని నిన్న ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తే అర్థమవుతోంది. ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ గతంలో కేసీఆర్ అన్న వ్యాఖ్యలు చూస్తే ఈ సారి పెద్దఎత్తున మార్పులు ఉంటాయని అంతా అనుకున్నారు.

తీరా అభ్యర్థులను చూస్తే 7 చోట్ల మినహా దాదాపు అందరు ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇచ్చారు. కేసీఆర్, ఆయన పార్టీ సిగ్గు తప్పిన విధానాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడుతూ కనీసం 20 మంది ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో 30 శాతం లంచం తీసుకుంటున్నట్లు తనకు సమాచారం ఉందని ఎమ్మెల్యేలను హెచ్చరించారు.

30 శాతం లంచం తీసుకున్నట్టు ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని, కనీసం 20 మంది కొత్త అభ్యర్థులు ఉంటారని చెప్పారు. కానీ అలా జరగలేదు. అంటే ఎమ్మెల్యేల అవినీతిని కేసీఆర్ సమర్థించారనే అనుకోవాలి. నిన్న కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా పాత సీసాలో పాత సారానే తలపించింది. పాచిపోయిన కూరను మళ్లీ వేడి చేసి ప్రజలకు అందించే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు.

పతాక స్థాయికి చేరిన కేసీఆర్, ఆయన ప్రభుత్వ అవినీతిపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేసీఆర్ స్వయంగా పెద్ద అవినీతిపరుడు. అవినీతిలో ఆవిష్కరిస్తున్న కొత్త విధానాలకు ఆస్కార్ అవార్డు ఇచ్చేదుంటే కేసీఆర్ ఈ అవార్డుకు అన్నివిధాల అర్హుడని చెప్పవచ్చు.

బీఆర్ఎస్ చెప్పేదొకటి చేసేదొకటి. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అసెంబ్లీ, పార్లమెంట్‌లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో ధర్నాకు దిగారు. కనీసం బీఆర్ఎస్ అయినా తాము చెప్పింది ఆచరిస్తుందని అనుకున్నాం.

అయితే నిన్న కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో కేవలం ఏడుగురు మాత్రమే మహిళలు ఉండడం బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుంది. సొంత పార్టీలో మహిళలకు జరిగిన ఈ దారుణమైన అన్యాయాన్ని కవిత ఎలా సమర్థిస్తారు?

ఈ జాబితా కేసీఆర్ అవకాశవాదానికి మరో నిదర్శనం. ఇటీవల ముగిసిన మునుగోడు ఎన్నికల్లో నియోజకవర్గంలో కొంత ఉనికి ఉందని సీపీఐ, సీపీఎంలతో దోస్తీ కట్టి, రెండు పార్టీలతో ఇక నుంచీ కలిసి ఉంటామని ప్రకటించారు. మునుగోడు ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత కేసీఆర్ వారిని వదిలేశారు. ఇదీ కేసీఆర్ నైజం. తన స్వలాభం కోసం ప్రజలను వాడుకుని, పని పూర్తయ్యాక వదిలేస్తాడు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన ఇదే చేశారు.

విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను ఉద్యమానికి ఉపయోగించుకుని, రాష్ట్రం ఏర్పడ్డాక వారికి ద్రోహం చేశారు. కేసీఆర్ అవకాశవాదం, ద్వంద్వ వైఖరి, వాడుకొని వదిలేసే విధానం గురించి తెలుసుకున్న ప్రజలు తమ ఓటుతో బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలోకి కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలు సాకారం చేసుకునేందుకు, కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు బిజెపి వైపు ఆశగా చూస్తున్నారు. బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ తో తమ ఆకాంక్షలు నెరవేరుతాయని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు బిజెపి అన్నివిధాలా అండగా ఉంటుంది, వారి కలలను సాకారం చేస్తుంది.

LEAVE A RESPONSE