Suryaa.co.in

Telangana

టాటా గ్రూప్ రూ.1500 కోట్ల పెట్టుబడులు

ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య కేంద్రాలు

రాష్ట్రంలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్ ట్రైనర్ల నియామకానికి రూ.1500 కోట్ల పెట్టబడులు పెట్టనుంది.

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇప్పటికే వివిధ రంగాల్లో విస్తరించిన టాటా గ్రూప్ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలపై చర్చించారు.

ఐటీ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హైదరాబాద్ లోని అతి పెద్ద ఐటీ కంపెనీలలో ఒకటి . ఇందులో 80 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. రాబోయే కొన్నేళ్లలో టీసీఎస్ మరింత వృద్ధి చెందనుంది.

టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇప్పటికే గ్లోబల్ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో పలు ప్రాజెక్టులు చేపట్టింది. బోయింగ్, సికోర్స్ కీ, జిఇ, లాక్‌హీడ్ మార్టిన్ వంటి కంపెనీలతో కలిసి పెట్టుబడులు పెట్టింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (TTL) ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టు చేపడుతోంది. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్నితగ్గించే బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తుంది. కొత్త కోర్సులకు పెట్టుబడులు పెడుతుంది.

టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా విస్తరణలోనూ హైదరాబాద్ ను ట్రాన్సిట్ హబ్ గా ఎంచుకోనుంది. హైదరాబాద్ నుంచి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల కనెక్టివిటీని పెంచనుంది.

తెలంగాణ అభివృద్ధికి టాటా గ్రూప్ కీలకమైన భాగస్వామ్యం అందిస్తోందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ రంగాలలో పెట్టబడులు పెడుతున్న టాటా గ్రూప్ నకు తగిన సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ ఐటీఐలలో అధునాతన నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు టీటీఎల్ భాగస్వామ్యం పంచుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పేందుకు చొరవ చూపాలని సీఎం టాటా గ్రూప్ ను స్వాగతించారు.

తమ గ్రూప్ పెట్టుబడులకు తెలంగాణ వ్యూహత్మకమైన కేంద్రంగా ఉందని, వీలైనంత మేరకు రాష్ట్రంలో తమ గ్రూప్ వ్యాపారాలను రాష్ట్రంలో విస్తరిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాలనే ఆసక్తితో ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం. ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE