టీబీ రహిత రాష్ట్రం వైపు తెలంగాణ అడుగులు

-ప్రతిభ కనబర్చినందుకు రాష్ట్రానికి 4 జాతీయ అవార్డులు
-నిజామాబాద్ కు బంగారు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ వెండి, ఖమ్మం జిల్లాకు కాంస్యం
-వైద్య సిబ్బందిని అభినందించిన మంత్రి హరీశ్ రావు

టీబీ రహిత రాష్ట్రం వైపు తెలంగాణ అడుగులు వేస్తున్నది. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన 4 జిల్లాలకు కేంద్రం జాతీయ అవార్డులు ప్రకటించింది.ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో తెలంగాణ టీబీ విభాగం అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. TB నిర్మూలన కార్యక్రమాల సూచికల ఆధారంగా, తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశంలోనే మూడవ ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా నిలిచింది. 2015 కేసులతో పోల్చితే తెలంగాణలో TB కేసుల తగ్గింపు ప్రతి లక్ష జనాభాకు గణనీయంగా తగ్గింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రకారం, తగ్గింపు లక్ష్యం 80శాతం కాగా, 60 శాతం తగ్గించిన నిజామాబాద్ కు బంగారు పతకం, 40 శాతం తగ్గించిన భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ లకు వెండి, 20 శాతం తగ్గించిన ఖమ్మంకు కాంస్య పతకాలు వరించాయి.

కార్యక్రమంలో భాగంగా అందించిన అవార్డులను రాష్ట్ర టీబీ విభాగం జెడి డాక్టర్ ఎ రాజేశం, నిజామాబాద్ డి ఎం హెచ్ వో సుదర్శనం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ శ్రీ గణ, ప్లానింగ్ ఆఫీసర్ వాసు ప్రసాద్ లు తెలంగాణ ప్రభుత్వం తరుపున అందుకున్నారు. రాష్ట్రంలో టీబీ వ్యాధిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నది. ఇందులో భాగంగా టిబి ప‌రీక్ష‌ల సంఖ్య భారీగా పెంచ‌డంతోపాటు వైద్య స‌హాయం త‌క్ష‌ణ‌మే అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కుటుంబంలో ఒక్కరికి టీబీ గుర్తిస్తే మిగతా సభ్యులకు కూడా పరీక్షలు చేస్తున్నారు.

హైద‌రాబాద్‌ లో ఉన్న ప్ర‌భుత్వ ఛాతీ ఆసుప‌త్రిని అపెక్స్ టిబి ఆసుప‌త్రిగా గుర్తించ‌డంతోపాటు మ‌ల్టీ డ్ర‌గ్ థెర‌పీ, డ్ర‌గ్ రెసిస్టెన్స్ టిబి చికిత్స పొందేవారి కోసం ప్ర‌త్యేక వార్డులు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నది. టీబీ నోటిఫైబుల్ డిసీజ్ కాబట్టి ప్రైవేటు లో గుర్తించిన కేసులకు కూడా పూర్తి ఉచితంగా అన్ని ర‌కాల వైద్య ప‌రీక్ష‌లతోపాటు వైద్యం కూడా అందిస్తున్నాము. ఈ మేర‌కు అన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆసుప‌త్రుల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నది. తెలంగాణ‌లో ప్ర‌త్యేకంగా టిబి నుంచి కోలుకున్నవారిని టిబి ఛాంపియ‌న్స్‌ గా గుర్తించి శిక్ష‌ణ ఇచ్చి, వారి ద్వారా ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న తెస్తున్నాం. ఈ టిబి ఛాంపియ‌న్స్ ప్ర‌త్యేక మొబైల్ యాప్ దీక్ష ద్వారా ఆన్‌ లైన్‌ లో శిక్ష‌ణ ఇవ్వడం జరుగుతున్నది. టిబి వ్యాధిబారిన ప‌డినవారికి ప్ర‌భుత్వం ‘‘నిక్ష‌య్ పోష‌ణ యోజ‌న’’ కింద పోషకాహారం కోసం ప్ర‌తి నెల రూ.500 చొప్పున వ్యాధి నుంచి బ‌య‌టప‌డే వ‌ర‌కు ఆర్థిక స‌హాయం అందిస్తుంది. టిబి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండి మ‌ల్టి డ్ర‌గ్ థెర‌పీ తీసుకునేవారికి రూ.1200 ర‌వాణా ఛార్జీలు, గిరిజ‌న ప్రాంతాల‌తో వీటికి అద‌నంగా మ‌రో రూ.750 అందిస్తున్నాం. బాధితులకు పోషకాహార కిట్స్ అందివ్వడం జరుగుతున్నది. ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల టీబీ నియంత్రణలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

2025 నాటికి పూర్తి స్థాయి నిర్మూలనే లక్ష్యం: మంత్రి హరీశ్ రావు
టీబీ నియంత్రణలో సత్తా చాటి అవార్డులు పొందిన జిల్లాలకు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్యాధికారులను అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణలో 2025 నాటికి పూర్తి స్థాయిలో క్ష‌య వ్యాధి (టిబి) నిర్మూల‌నే లక్ష్యంగా నిర్ధేశించుకుని టిబి ప‌రీక్ష‌లు, వైద్యం వేగ‌వంతం చేస్తున్నట్లు తెలిపారు. టీబీ నిర్మూలన లక్ష్యం దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

Leave a Reply