– రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేసింది
– రాజ్యాంగ పరిరక్షకులైన సుప్రీంకోర్టు ఈ అంశంలో జోక్యం చేసుకోని సుమోటో గా విచారణ చేపట్టాలి
– సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేఖ
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టీజీపీఎస్సీ… రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించిందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటో గా తీసుకోని విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చీఫ్ జస్టిస్ కు ఆమె లేఖ రాశారు.
గ్రూప్-1 నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులైన 371-డి ఆర్టికల్ కు విరుద్దంగా రిక్రూట్ మెంట్లు జరిపినట్లు ఎంతో మంది అభ్యర్థుల నుంచి తనకు ఫిర్యాదులు వచ్చాయని లేఖలో కవిత తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన టీజీపీఎస్సీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను ఆమె కోరారు.
మా ఉద్యోగాలు మాకే అంటూ తెలంగాణ ఉద్యమం జరిగిందని…ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా రాష్ట్రపతి ఉత్తర్వు ఆర్టికల్ 371-డి ని సాధించుకున్నారన్నారని గుర్తు చేశారు. 371- డి ప్రకారం ఇక్కడి ప్రాంత వాసులకే ఉద్యోగాల్లో అవకాశాలు దక్కాల్సి ఉందన్నారు. కానీ తెలంగాణ సాధించుకున్న పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రజల హక్కులకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన గ్రూప్-1 నియామకాల్లో ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించటమే కాకుండా టీజీపీఎస్సీ చాలా తప్పులకు పాల్పడిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఈ కారణంగా స్థానిక తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీ తన చర్యతో అటు రాజ్యాంగంపై ఇటు తెలంగాణ ప్రజల హక్కులపై దాడి చేసిందన్నారు.
పైగా ఈ అంశంపై అభ్యర్థుల నుంచి వందలాది ఫిర్యాదులు వచ్చినప్పటికీ టీజీపీఎస్సీ పట్టించుకోకపోవటం కచ్చితంగా రాజ్యాంగాన్ని అవమానించటమేనని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థుల్లో రాజ్యాంగంపై నాయ్యవ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని చీఫ్ జస్టిస్ కు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షకులైన మీరు జోక్యం చేసుకోవటం ద్వారానే తెలంగాణలో అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని లేఖలో చీఫ్ జస్టిస్ కు కవిత విజ్ఞప్తి చేశారు.
ఆర్టికల్ 371- డి ఉల్లంఘనకు పాల్పడిన టీజీపీఎస్సీ వ్యవహారాన్ని సుమోటో గా విచారణ జరపాలని కవిత కోరారు. ఈ మొత్తం అంశాన్ని విచారించి అవకతవకలు జరిగినట్లు తేలితే గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)చేపట్టిన గ్రూప్-I పరీక్ష నిర్వహణ, నియామక ప్రక్రియపై స్వతంత్ర న్యాయపరమైన విచారణకు ఆదేశించాలని చీఫ్ జస్టిస్ ను కవిత లేఖలో విజ్ఞప్తి చేశారు.